పీహెచ్సీల నిర్వహణ బాగుంది పీహెచ్సీలలో డెలివరీలు పెంచాలి
ఎన్టీఆర్ వైద్య సేవ సద్వినియోగం చేసుకోవాలి వైద్య సిబ్బందికి శిక్షణలు ఇవ్వాలి
ఆయుష్మాన్ భారత్ వైద్య సేవల పట్ల అవగాహన కల్పించాలి
రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ కమిషనర్
మచిలీపట్నం, నవంబర్ 20, 2024
రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు పీహెచ్ శీల నిర్వహణ పట్ల శ్రద్ధ వహించాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ డాక్టర్. వాకాటి కరుణ వైద్యాధికారులను ఆదేశించారు.
కమిషనర్ బుధవారం జిల్లా పరిషత్ మీటింగ్ హాల్లో జిల్లా కలెక్టర్, డి ఎం అండ్ హెచ్ ఓ, పిహెచ్సి వైద్యాధికారులతో క్లస్టర్ల వారి సమీక్ష సమావేశం నిర్వహించారు.
ప్రతి పిహెచ్సి ని మ్యాప్ చేసి వాటిల్లో అందించాల్సిన వైద్య సదుపాయాలన్నీ రోగులకు అందేలా చూడాలన్నారు.
ఇమ్యునైజేషన్ నూరు శాతం జరుగుతోందని, హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్ కి శిక్షణలు చాలా ముఖ్యం, కావున ఆ దిశగా చర్యలు తీసుకోవాలన్నారు.
ప్రోటోకాల్ ప్రకారం గర్భవతుల ఎనీమియా రీడింగ్స్ కరెక్ట్ గా నమోదు చేయాలన్నారు. బయోమెడికల్ ఎక్విప్మెంట్స్ లేని చోట్ల వాటిని ఏర్పాటు చేయాలన్నారు. వైద్య పరికరాలు పనిచేసేలా చూడాలని, ఉన్న వాటిని వినియోగించాలని అన్నారు. ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులు ఖాళీలు భర్తీ చేయుటకు చర్యలు తీసుకుని, రోగులకు వైద్య పరీక్షలు పూర్తిస్థాయిలో అందేలా చూడాలన్నారు. మహిళలకు క్యాన్సర్ స్క్రీనింగ్ సర్వే పటిష్టవంతంగా నిర్వహించాలన్నారు. క్షయ, కుష్టు వ్యాధుల నివారణ, నియంత్రణ కార్యక్రమాల నిర్వహణలో అలసత్వం వహించరాదన్నారు. ప్రోగ్రాం అధికారులకు, పి హెచ్ సి వైద్యాధికారులకు అవసరమైన ఇండక్షన్ ట్రైనింగ్ నిర్వహించాలన్నారు. బయో మెడికల్ వేస్ట్ మేనేజ్మెంట్ సిస్టం సరిగా నిర్వహించాలన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల లోపల పరిశుభ్రత, శానిటేషన్ తో పాటు పి హెచ్ సి ఆవరణ కూడా పరిశుభ్రంగా ఉంచాలన్నారు. ఎదురు మొండి దీవులలో పిహెచ్సి వైద్యుల నివాస సదుపాయం కల్పించుటకు చర్యలు తీసుకోవాలన్నారు.
జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ మాట్లాడుతూ know your ABHA డ్రైవ్ చేపట్టి సచివాలయాల వారిగా ఆభా కార్డులు ప్రింటింగ్ చేసి అందించేలా చర్యలు తీసుకుంటామన్నారు. కొత్త పిహెచ్ సి భవనాలు నిర్మించి బడ్జెట్ అయిపోయి ప్రారంభించని చోట్ల, బ్యాలన్స్ వర్కులు ఏమేమి ఉన్నాయి గుర్తించి జాబితా తయారు చేసుకుని వాటిని పూర్తి చేసేలా కృషి చేస్తామన్నారు. నర్సులకు ఇతర వైద్య సిబ్బందికి అర్జెంటుగా శిక్షణ ఇవ్వడానికి చర్యలు తీసుకుంటామన్నారు. అందరూ ప్రోగ్రాం వైద్యాధికారులతో వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేసి, వారి కార్యక్రమాలు సక్రమంగా అమలు జరిగేలా పర్యవేక్షిస్తామన్నారు.
గతంలో ఎన్నడూ లేని విధంగా కమిషనర్ ప్రత్యేక చొరవతో జిల్లాలో ఉన్న అన్ని పిహెచ్సి లను రాష్ట్రస్థాయి ప్రోగ్రాం అధికారులు సందర్శించి అక్కడి పరిస్థితులు స్థితిగతులను పరిశీలించి నివేదిక ఇవ్వాలని పంపడం విశేషం అన్నారు.
తొలుత వివిధ వైద్య విభాగాల రాష్ట్రస్థాయి ప్రోగ్రాం అధికారులు బుధవారం జిల్లాలో అన్ని పిహెచ్సి లు క్లస్టర్ల వారి సందర్శించి, రోగులకు అందిస్తున్న వైద్య సేవలు వైద్య పరీక్షలు, పీహెచ్ సి ల నిర్వహణ, అందుబాటులో గల మందులు, వైద్య సేవలు గురించి ఈ సమావేశంలో కమిషనర్ కి ఫీడ్బ్యాక్ సమర్పించారు.
రాష్ట్ర పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ డా.పద్మావతి,
కమిషనర్ కార్యాలయంలో చీఫ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ డా.గణపతి, డి ఎం అండ్ హెచ్ ఓ డాక్టర్ జే. గీతాబాయి, వివిధ వైద్య విభాగాల ప్రోగ్రాం అధికారులు, జిల్లాలో పీహెచ్సీ వైద్యాధికారులు, రాష్ట్రస్థాయి మెడికల్ ఐటి టీం పాల్గొన్నారు.