29-11-2024
ఎపి లో ‘వన్ స్టాప్ సెంటర్స్’ (OSC) కి రూ.5 కోట్ల 48 లక్షల విడుదల చేయగా, వినియోగం 96 లక్షలు మాత్రమే
ఎంపిలు కేశినేని శివనాథ్, రచనా బెనర్జీ అడిగిన ప్రశ్నలకు కేంద్రం బదులు
ఢిల్లీ : ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వానికి వన్ స్టాప్ సెంటర్స్ భవనాల నిర్మాణం కోసం 5 కోట్ల 48 లక్షల 23 వేల రూపాయల నిధులు విడుదల చేస్తే , 96 లక్షల 50 వేల రూపాయలు నిధుల మాత్రమే వినియోగించినట్లు కేంద్ర మహిళ, శిశు అభివృద్ధి శాఖ సహాయ మంత్రి సావిత్రి ఠాకూర్ లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. టిడిపి విజయవాడ ఎంపి కేశినేని శివనాథ్, పశ్చిమ బెంగాల్లోని హుగ్లీ ఎంపి రచనా బెనర్జీ శుక్రవారం పార్లమెంట్ లో అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. దేశంలో వన్ స్టాప్ సెంటర్స్ మహిళల సంక్షేమానికి, సకాలంలో సేవలు అందించేందుకు ఎంతో దోహదపడుతున్నాయని పేర్కొన్నారు.
దేశ వ్యాప్తంగా మహిళల కోసం ఏర్పాటు చేసిన వన్ స్టాప్ సెంటర్స్ (OSC) 870 వుండగా, ప్రస్తుతం వాటిలో 802 వన్ స్టాప్ సెంటర్స్ మాత్రమే నడుస్తున్నాయని, ఆంధ్రప్రదేశ్ లో ఆమోదించబడిన 26 వన్ స్టాప్ సెంటర్స్ నడుస్తున్నట్లు ఈఏడాదిలో ప్రారంభించిన కృష్ణా, అనకాపల్లి, బాపట్ల, కొనసీమ, పల్నాడు, పార్వతిపురం మాన్యం , నంద్యాల ఏడు జిల్లాలతో కలుపుకొని ఆంధ్రప్రదేశ్ లోని 26 జిల్లాల్లో ఏర్పాటు చేసినట్లు చెప్పారు.
ఈ వన్ స్టాప్ సెంటర్స్ లో అందించే పోలీసు సహాయం, వైద్య సేవలు, న్యాయసలహాలు, తాత్కాలిక ఆశ్రయం తీసుకోవటంలో ఎపి కి సంబంధించి 2023-24 ఆర్థిక సంవత్సరంలో 3,451 మహిళలు సేవలు పొందారు. 2019-20 నుండి 2023-24 వరకు ఎపిలోని వన్ స్టాప్ సెంటర్స్ ద్వారా మొత్తం 17,797 మహిళలు సహాయం పొందినట్లు తెలిపారు.