ఇన్ఛార్జ్ మంత్రివర్యులు సత్యకుమార్ యాదవ్ డీఆర్సీ సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడుతూ.
.
జిల్లా సమీక్షా కమిటీ సమావేశం అనంతరం మీడియా ప్రతినిధులతో జిల్లా ఇంచార్జ్, వైద్యఆరోగ్య కుటుంబ సంక్షేమం, మెడికల్ ఎడ్యుకేషన్ శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ సమాజంలో అన్ని వర్గాలకు సంబంధించిన అనేక సమస్యలపై సమావేశంలో చర్చించడం జరిగిందన్నారు. ప్రజల జీవన ప్రమాణాల పెంపునకు ప్రాధాన్యమిస్తున్నట్లు తెలిపారు. ఇంచార్జ్ మంత్రిగా సమీక్షా కమిటీ సమావేశంలో ప్రజలకు సంబంధించిన పలు విభాగాలకు చెందిన సమస్యలపై సంబంధిత అధికారులతో చర్చించడం జరిగిందన్నారు. బుడమేరు వరద ప్రభావిత ప్రాంతాలలో రికార్డు స్థాయిలో గృహ, పంట, వాహన తదితర విభాగాలకు సంబంధించి నష్టపరిహారాన్ని బాధితులకు అందించడం అభినందనీయమన్నారు. మౌలిక సదుపాయాలకల్పన జాతీయ రహదారులు, రైల్వేకు సంబంధించి భూ సేకరణతో పాటు నాలుగు గ్రామీణ నియోజకవర్గాల ప్రాంతాలలోని రహదారులు, త్రాగునీరు, ఉపాధిహామి తదితర అంశాలపై చర్చించామన్నారు. ఎ కొండూరు మండలంలోని కిడ్నీ ప్రభావిత ప్రాంతాలకు సురక్షిత త్రాగునీరు అందించే పథకాలను త్వరితగతిన పూర్తిచేసేలా అధికారులను ఆదేశించామన్నారు. ఉద్యోగ ఉపాధి అవకాశాలపై చర్చించడంతో పాటు దీర్ఘకాలం పెండింగ్లో ఉన్న ఎత్తిపోతల పధకాలను పూర్తిచేసేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించామన్నారు. ప్రధానమంత్రి ఫసల్ భీమా యోజనపై రైతులకు అవగాహనా కల్పించాలని, పంట నష్టపరిహారం సత్వరమే చెల్లింపులు జరిగేలా చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. రైతులు పండించిన ప్రత్తి, ధాన్యం, పెసర ప్రధాన పంటలను కొనుగోలు చేసేలా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని కోరామన్నారు. తేమ శాతం ఎక్కువ ఉన్నప్పటికి కొనుగోలు కేంద్రానికి వచ్చిన రైతు పంటను విక్రయించకుండా తిరిగి వెళ్లకుండా చూడాలని ఆదేశించామన్నారు. రాజధాని ప్రాంతంలోని విజయవాడ పట్టణం ప్రాముఖ్యత సంతరించుకుందని దీనిని దృష్టిలో పెట్టుకొని మౌళిక సదుపాయాల కల్పన ద్వారా ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడంలో ప్రధానంగా ప్రభుత్వం తీసుకువస్తున్న విప్లవాత్మక పాలసీలు, ఇండస్ట్రీయల్, టూరిజం డెవలప్మెంట్ పార్క్, ఎంఎస్ ఎమ్ ఈ పాలసీల ద్వారా వేగంగా ఉపాధి అవకాశాలు కల్పించి కార్యాచరణను రూపొందించాలని ఆదేశించామన్నారు. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలతో ఈ ప్రాంతంలో పరిశ్రమలను ఏర్పాటు చేసి ఇండస్ట్రీయల్ హబ్ గా రూపొందించేందుకు విస్తృత చర్చ సమావేశంలో జరిగిందన్నారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పధకాలను పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకొనేలా అవగాహన కల్పించాలని ఆదేశించామన్నారు. పీఎం ఏవై పధకంలో నిర్మాణాలు పూర్తైన గృహాలను లబ్ధిదారులకు అందించడంలో ఉన్న సమస్యలను పరిష్కరించాలని ఆదేశించామన్నారు. జిల్లాలో పర్యాటక ప్రాంతాలను కేంద్ర రాష్ట్ర నిధులతో అభివృద్ధి చేసి పర్యాటకులను ఆకర్షించే విధంగా తీర్చిదిద్దాలని తద్వారా ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించేందుకు అవకాశం ఉంటుందన్నారు. నగరంలో వాకర్స్ కు అనువుగా కళాశాలల మైదానాలు వినియోగించుకునేలా చర్యలు తీసుకోమని ఆదేశించామన్నారు. జిల్లా సమీక్షా కమిటీ సమావేశం క్రమానుసారం జరిగేలా ప్రతి మూడు నెలలకు అవసరాన్ని బట్టి ముందుగా రెండు సార్లు నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటానన్నారు. సమావేశంలో ప్రజాప్రతినిధులు తీసుకువచ్చిన సమస్యలను పరిష్కరించే విధంగా యాక్షన్ టేకెన్ రిపోర్ట్ సిద్ధం చేసుకోవాలని అధికారులను ఆదేశించానన్నారు. అధికారులు ప్రజాప్రతినిధుల సమన్వయంతో జిల్లా సమగ్రాభివృద్ధిలో ప్రతి ఒక్కరు భాగస్వాములవుదామని మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు.