*04.12.2024*
కొణిజేటి రోశయ్య, ఘంటసాలకు మల్లాది విష్ణు నివాళులు
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, తమిళనాడు మాజీ గవర్నర్ కొణిజేటి రోశయ్య అజాత శత్రువు అని వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. కొణిజేటి రోశయ్య వర్థంతిని పురస్కరించుకుని బుధవారం ఆంధ్రప్రభ కాలనీలోని జనహిత సదనంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం మల్లాది విష్ణు మాట్లాడుతూ.. రాష్ట్ర రాజకీయాలలో రోశయ్యది ప్రత్యేక స్థానమని కొనియాడారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో చెరగని ముద్ర వేశారని కీర్తించారు. సుమారు 50 ఏళ్ల తన రాజకీయ జీవితంలో గవర్నర్ గా, ముఖ్యమంత్రిగా అనేక కీలక పదవులు పోషించి వాటికి వన్నె తెచ్చారన్నారు. ఉమ్మడి ఏపీకి సుధీర్ఘకాలంపాటు ఆర్థికమంత్రిగా పనిచేసిన ఘనత రోశయ్యదేనని చెప్పారు. ఆర్థిక క్రమశిక్షణకు ఆయన మారుపేరు అని.. బడ్జెట్ కూర్పులో ఘనాపాటిగా పేరుపొందారన్నారు. దేశంలోని ఏ రాష్ట్రంలో లేని విధంగా 16 సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన ఘనత రోశయ్యకే దక్కుతుందన్నారు. ఆయన వాగ్దాటికి అసెంబ్లీ సమావేశాలు దద్దరిల్లేవని.. గొప్ప హాస్య చతురతతో పాటు ముక్కుసూటిగా మాట్లాడటం రోశయ్య శైలి అని చెప్పుకొచ్చారు. రాజకీయాల్లో మచ్చలేని నాయకుడిగా ఎదిగి ఎంతో మందికి స్ఫూర్తిగా నిలిచారన్నారు మల్లాది విష్ణు.
అజరామరం.. ఘంటసాల గానం
అనంతరం ప్రముఖ సినీ గాయకుడు పద్మశ్రీ ఘంటసాల వెంకటేశ్వరరావు జయంతిని పురస్కరించుకుని ఆయన చిత్రపటానికి ఘన నివాళులు అర్పించారు. తెలుగు సంగీత సామ్రాజ్యానికి రారాజు ఘంటసాల అని ఈ సందర్భంగా మల్లాది విష్ణు కొనియాడారు. గాయకుడిగా కొనసాగుతూనే దాదాపు వంద చిత్రాలకు సంగీత దర్శకత్వం వహించారన్నారు. ఆయన ఆలపించిన భగవద్గీత నభూతో నభవిష్యత్ అని కీర్తించారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఆస్థాన విద్వాంసుడిగా మూలవిరాట్టు వేంకటేశ్వరస్వామి ఎదురుగా భక్తి గీతాలు ఆలపించిన ధన్యజీవి ఘంటసాల అని చెప్పారు. వాగ్గేయకారుడు అన్నమాచార్యుడి తర్వాత ఈ భాగ్యం ఆయనకే దక్కిందన్నారు. 1971లో ఐక్యరాజ్యసమితిలో గానకచేరీ చేసిన ప్రతిభ ఈ గంధర్వ గాయకుడిదని తెలిపారు. తెలుగు పాట ఉన్నంత కాలం ఘంటసాల వెంకటేశ్వరరావు సజీవంగా ఉంటారని ఈ సందర్భంగా తెలియజేశారు. కార్యక్రమంలో 33 వ డివిజన్ వైసీపీ కార్పొరేటర్ శర్వాణి మూర్తి, నాయకులు దోనేపూడి శ్రీనివాస్, కొప్పవరపు బలరాం, శనగవరపు శ్రీనివాస్, మల్లెం శ్రీను, చాంద్, సనత్, చంటి, మార్తి చంద్రమౌళి, కృష్ణమోహన్, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.