*05.12.2024*
*పత్రిక ప్రకటన*
బడి పండుగతో విద్యార్థులకు జరిగే మేలేమిటో ప్రభుత్వం సమాధానం చెప్పాలి
వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త మల్లాది విష్ణు
రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో డిసెంబర్ 7న నిర్వహించనున్న బడి పండుగతో ఒనగూరే ప్రయోజనాలేమిటో తల్లిదండ్రులకు ప్రభుత్వం వివరించాలని వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మొదటి నెలలోనే తల్లిదండ్రుల నమ్మకాన్ని పూర్తిగా కోల్పోయిందని.. ఇప్పుడు తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల మెగా సమావేశాలు ఎవరిని మోసం చేయటానికని సూటిగా ప్రశ్నించారు. నూతన విద్యా విధానం కోసం గత ప్రభుత్వం అక్షరాల రూ. 71 వేల కోట్లు ఖర్చు చేయగా.. ఈ ప్రభుత్వం ఇంతవరకు ఎంత కేటాయించిందో సమాధానం చెప్పాలన్నారు. నాడు-నేడు, ఇంగ్లీషు మీడియం, సీబీఎస్ఈ, టోఫెల్, 8వ తరగతి విద్యార్థులకు ట్యాబుల పంపిణీ, విద్యాకానుక రద్దుతో నాణ్యమైన విద్యకు ఈ ప్రభుత్వం గండికొట్టిందని మండిపడ్డారు. గోరుముద్ద తినలేక విద్యార్థులు ధర్నాలు చేస్తూ ఆస్పత్రులకు చేరుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయని దుయ్యబట్టారు. ఓవైపు పరిస్థితులు ఇంత దారుణంగా ఉంటే.. మరోవైపు తల్లిదండ్రులకు ఆటల పోటీలు, రంగోలీలు, సహపంక్తి భోజనాలంటూ ప్రభుత్వం బాధ్యతలేకుండా వ్యవహరిస్తోందని ఆరోపించారు. ప్రోగ్రెస్ రిపోర్టులనేవి ప్రతి పాఠశాలలోనూ ఉండేవే అని.. ఈ మెగా ఈవెంట్ తో విద్యార్థులకు కలిగే ప్రయోజనమేమిటో వివరించాలన్నారు. అదే గత ప్రభుత్వంలో విద్యారంగంలో విప్లవాత్మక మార్పులను తీసుకొచ్చి సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ విద్యపై ప్రజలలో నమ్మకాన్ని పెంచారని చెప్పారు.
*వైసీపీ ప్రభుత్వంలో..*
పేద విద్యార్థుల చదువుకు ఆర్థిక ఇబ్బందులు అడ్డంకి కాకూడదన్న ఉద్దేశంతో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. అమ్మఒడి, విద్యాకానుక కిట్లు, జగనన్న గోరుముద్ద, 8వ తరగతి విద్యార్థులకు ట్యాబ్లు, పదవ తరగతి విద్యార్థులకు ప్రోత్సాహకాలు అందజేశారని మల్లాది విష్ణు చెప్పారు. ఒక్క సెంట్రల్లోనే ఏటా 30 వేల మందికి అమ్మఒడి., 15 వేల మంది చిన్నారులకు విద్యాకానుక కిట్లు., 2 వేల మంది 8వ తరగతి బాలబాలికలకు మంది ట్యాబ్లు అందజేసినట్లు వెల్లడించారు. నాడు-నేడు కార్యక్రమం ద్వారా మంచినీటి సదుపాయం, మరుగుదొడ్లు, విద్యుత్ సదుపాయం, లైట్లు, ఫ్యాన్లు, బెంచీలు, ఫర్నీచర్, గ్రీన్ చాక్ బోర్డులు, పెయింటింగ్, ఇంగ్లీష్ ల్యాబ్స్, ప్రహరీ గోడలతో పాఠశాలలను అధునాతనంగా ముస్తాబు చేసుకున్నట్లు గుర్తుచేశారు. పుచ్చలపల్లి సుందరయ్య ప్రభుత్వ పాఠశాలలో రూ. 2.40 కోట్ల నిధులతో 20 అదనపు తరగతి గదుల నిర్మాణాలు చేపట్టగా.. S.T.V.R.M.C. ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో రూ. 3 కోట్ల నిధులతో 18 అదనపు తరగతి గదులు., చుండూరు వెంకటరెడ్డి మున్సిపల్ హైస్కూల్ నందు రూ. 1.50 కోట్లతో 10 అదనపు తరగతి గదులను నిర్మించుకున్నట్లు చెప్పారు. AKTPM పాఠశాలలో రూ.2.62 కోట్లు, ప్రశాంతి ప్రాథమిక పాఠశాలలో రూ. 30 లక్షల నిధులతో నాడు – నేడు పనులు చేపట్టడం జరిగిందన్నారు. మొత్తంగా రూ. 33.49 కోట్ల నిధులతో సెంట్రల్లోని 28 ప్రభుత్వ పాఠశాలల్లో 168 అదనపు తరగతి గదుల నిర్మాణం చేపట్టినట్లు వివరించారు. అలాగే ప్రభుత్వ విద్యా సంస్థల్లో ప్రతిభ కలిగిన విద్యార్థులను ప్రోత్సహిస్తూ.. పదో తరగతి పరీక్షలలో ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులను ‘జగనన్న ఆణిముత్యాలు’ పేరుతో ఘనంగా సత్కరించుకోవడం జరిగిందన్నారు. దీంతో రాష్ట్రంలో విద్యను అభ్యసించే వారి శాతం గత ప్రభుత్వంలో గణనీయంగా పెరిగిందని చెప్పుకొచ్చారు. కానీ ఈ ప్రభుత్వం వచ్చాక ప్రభుత్వ పాఠశాలల్లో కనీస సౌకర్యాలు లేక విద్యార్థులు, ఉపాధ్యాయులు నానా అగచాట్లు పడుతున్నారని విమర్శించారు. కనుక ఇప్పటికైనా ప్రభుత్వం విద్యా ప్రమాణాలు మెరుగుపర్చే దిశగా ఆలోచన చేయాలని.. రద్దు చేసిన కార్యక్రమాలను వెంటనే పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు.