*ప్రచురణార్థం* *05-12-2024*
ఎ.పిలో జి.డబ్ల్యూ.ఎమ్.ఆర్ స్కీమ్ కింద 1.41 లక్షల చ.కి.మీ. భూభాగం మ్యాపింగ్
ఎంపీలు కేశినేని శివనాథ్, దగ్గుమళ్ళ ప్రసాదరావు ప్రశ్నలకు కేంద్ర జలశక్తి మంత్రి సి.ఆర్.పాటిల్ బదులు
న్యూఢిల్లీ, డిసెంబర్ 05: ఆంధ్రప్రదేశ్ లో భూగర్భ జలాల నిర్వహణ, నియంత్రణ (GWMR) పథకం లో 188 గ్రామాలు నియంత్రణ పరిధిలో వున్నాయి. ఈ పథకం కింద, భూగర్భ జల మట్టాలు, నాణ్యతపై నిరంతర పర్యవేక్షణతో పాటు జాతీయ ఆక్విఫర్ మ్యాపింగ్ అండ్ మేనేజ్మెంట్ ప్రోగ్రామ్ (NAQUIM) ద్వారా ఆంధ్రప్రదేశ్లో 1.41 లక్షల చ.కి.మీ. భూభాగం మ్యాపింగ్ చేపట్టినట్లు కేంద్ర జలశక్తి మంత్రి సి.ఆర్.పాటిల్ లోకసభలో లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. టిడిపి విజయవాడ ఎంపి కేశినేని శివనాథ్, ఎంపి దగ్గుమళ్ల ప్రసాదరావు గురువారం లోక్ సభలో భూగర్భ జలాల నిర్వహణ, నియంత్రణ (GWMR) పథకం పై జలశక్తి మంత్రిత్వ శాఖ ను ప్రశ్నించారు.
దేశవ్యాప్తంగా 25 లక్షల చ.కి.మీ. భూభాగం మ్యాపింగ్ పూర్తయిందని మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఈ సమాచారం స్థానిక అధికారులు, ప్రజా ప్రతినిధులకు పంపిణీ చేయబడిందన్నారు. కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా భూగర్భ జలాల నిర్వహణ, నియంత్రణను మెరుగుపర్చే దిశగా కీలక కార్యక్రమాలను అమలు చేస్తుందని తెలపటంతో పాటు , 2007-08లో ప్రారంభమైన భూగర్భ జలాల నిర్వహణ ,నియంత్రణ పథకం (GWM&R Scheme) కీలక విజయాలను సాధించిందని వెల్లడించారు.
గతంలో వున్న నోటిఫైడ్ ప్రాంతాల విధానం 2020 మార్గదర్శకాలు ప్రకారం రద్దు చేసినట్లు తెలపటంతో పాటు, ప్రస్తుతం భూగర్భ జల వినియోగం అసెస్మెంట్ యూనిట్ల స్థాయిలో నియంత్రితమవుతుందని వివరించారు . డైనమిక్ గ్రౌండ్ వాటర్ రిసోర్స్ అసెస్మెంట్, 2023 ప్రకారం, దేశ వ్యాప్తంగా వున్న 6553 అసెస్మెంట్ యూనిట్లలో 736 అసెస్మెంట్ యూనిట్ లు అధిక వినియోగ ప్రాంతాలు (OE) గా వర్గీకరించినట్లు తెలిపారు.
సెంట్రల్ గ్రౌండ్ వాటర్ అథారిటీ (CGWA) అనుమతించని నీటి వినియోగం భూగర్భ నీటి నిబంధనల ఉల్లంఘనలపై గత మూడేళ్లలో కఠిన చర్యలు తీసుకుందన్నారు. 5568 కేసుల్లో జరిమానాలు విధించగా, 1150 కేసుల్లో పర్యావరణ పరిహారం (EC) కూడా విధించి వసూలు చేయబడినట్లు వివరించారు.
గత ఐదేళ్లలో, దేశ వ్యాప్తంగా 195 చెక్ డ్యామ్లు, 113 రీఛార్జ్ షాఫ్ట్లు, 8 పెర్కొలేషన్ ట్యాంకులు, 5 బ్రిడ్జ్-కమ్-భండారాలు, 2 సబ్-సర్ఫేస్ బ్యారియర్స్ , 2 డ్యామ్స్ నిర్మించబడ్డాయన్నారు భూగర్భ జలాల నిర్వహణ, నియంత్రణ (GWMR) పథకం 2026 వరకు మాత్రమే కొనసాగుతుందని, కొత్త అంశాలను చేర్చే ప్రణాళికలు ప్రస్తుతం లేవని కేంద్ర జలశక్తి మంత్రి సి.ఆర్ పాటిల్ స్పష్టం చేశారు.