Home Political news మైనార్టీల సంక్షేమం, అభివృద్ది ధ్యేయంగా పనిచేస్తా అర్హులైన మైనార్టీలకు పథకాలు అందిస్తా

మైనార్టీల సంక్షేమం, అభివృద్ది ధ్యేయంగా పనిచేస్తా అర్హులైన మైనార్టీలకు పథకాలు అందిస్తా

4
0

 మైనార్టీల సంక్షేమం, అభివృద్ది ధ్యేయంగా పనిచేస్తా

 అర్హులైన మైనార్టీలకు పథకాలు అందిస్తా

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మైనార్టీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఛైర్మ‌న్ మౌలానా షేక్ ముస్తాక్ అహ్మద్

విజ‌య‌వాడ:- మైనారిటీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ పదవి ద్వారా తాను మైనార్టీలకు దగ్గరగా ఉంటూ ప్రభుత్వం అందించే పథకాలను అందిస్తానని, తాను ఈ స్థాయికి రావడానికి అందరి ఆదరాభిమానాలే కారణమని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మైనారిటీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ మౌలానా షేక్ ముస్తాక్ అహ్మద్ తెలిపారు. విజ‌య‌వాడ తుమ్మలపల్లి కళా క్షేత్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మైనారిటీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్‌గా మౌలానా షేక్ ముస్తాక్ అహ్మద్ సోమవారం బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయ‌న మాట్లాడుతూ, మైనారిటీల ఆత్మ బంధువు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అని అన్నారు.. మైనార్టీల సంక్షేమం, అభివృద్ది ధ్యేయంగా అనునిత్యం ముఖ్యమంత్రి అప్పజెప్పిన బాధ్యతను నెరవేరుస్తానన్నారు. త‌న తల్లిదండ్రుల ప్రార్ధనలు, అల్లా దీవెనలు ఈ స్థాయికి తీసుకొచ్చాయన్నారు. తాను మదరాసాలో చదువుకున్నానని, గత ప్రభుత్వం మదరాసాలను నిర్వహణను సరిగా నిర్వహించలేదన్నారు. అర్హులకు తప్పకుండా పథకాలకు దక్కుతాయని, త‌న జీవితం పేద మైనార్టీ కుటుంబాలకు అంకితమన్నారు. లబ్ధిదారులను గుర్తించడానికి అవసరమైతే తానే వారి దగ్గరకు వెళ్లి తగిన న్యాయం చేస్తానన్నారు. మంత్రి లోకేష్ స్పూర్తిగా.. ఇప్పటి నుండి త‌న‌ను కలవటానికి వచ్చేవారు బొకేలు, షాలువాలు కాకుండా పెన్నులు, పెన్సిళ్లు, నోట్ బుక్స్ తెస్తే వాటిని తీసుకెళ్లి మంత్రికి అందిస్తానన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ మైనార్టీ సంక్షేమ శాఖ సలహాదారు మహ్మద్ షరీఫ్ మాట్లాడుతూ, మౌలానా ముస్తాక్ అహ్మ‌ద్ శ్రమే ఆయనకు చైర్మన్ పదవి రావడానికి కారణమైందన్నారు. నిజాయితీకి పట్టం కట్టేలా రాజకీయాలు ప్రక్షాళన జరగాలని ముస్తాక్ అహ్మద్ బలంగా నమ్ముతారన్నారు. రాష్ట్రంలోని 70కి పైగా శాసనసభ నియోజకవర్గాల్లో ఆయన పర్యటించారన్నారు. మైనార్టీల్లోని పేదరికాన్ని దూరం చేయడానికి కృషి చేయాలన్నారు. మైనార్టీలకు సబ్సిడీలతో పథకాలు, వడ్డీలేని రుణాలు అందించాలన్నారు. స్వయం ఉపాధి కోసం మైనార్టీ మహిళలకు టైలరింగ్, బ్యూటీషియన్ తదితర కోర్సుల్లో శిక్షణ అందించాలన్నారు. విజ‌య‌వాడ తూర్పు నియోజ‌క‌వ‌ర్గం ఎమ్మెల్యే గద్దే రామ్మోహన్ మాట్లాడుతూ, మైనార్టీల కోసం ప్రత్యేక శ్రద్ధ కనబ‌రచిన ఏకైక వ్యక్తి ముఖ్యమంత్రి చంద్రబాబు ఒక్కరేనన్నారు. ముఖ్యమంత్రి మైనార్టీల సంక్షేమం కోసం నిరంతరం ఆలోచిస్తారన్నారు. తాను పార్లమెంటు సభ్యునిగా పనిచేసిన కాలంలో కూడా ముస్లింలు, క్రిస్టియన్ల‌కు అనేక నిధులను అందించిన‌ట్లు తెలిపారు. ఎమ్మెల్యే న‌క్కా ఆనంద్ బాబు మాట్లాడుతూ, పనిచేసిన ప్రతి ఒక్కరికీ ముఖ్యమంత్రి న్యాయం చేస్తారనడానికి ఇదే నిదర్శనం అన్నారు. మైనార్టీ నాయకుడిగా ముస్తాక్ అహ్మద్ అనేక అవమానాలు అనుభవించారని అందుకు తగ్గ ఫలితం చైర్మన్ పదవేనన్నారు. మైనార్టీ వర్గాలకు పథకాలు అందించి వారికి చేరువ అయినప్పుడే ముఖ్యమంత్రి ఆశించిన ఫలితం నెరవేరుతుందన్నారు. రాష్ట్ర మైనారిటీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఎండీ యాకూబ్ చైర్మన్‌గా మౌలానా షేక్ ముస్తాక్ అహ్మద్ చేత ప్రమాణ స్వీకారం చేయించారు. కార్య‌క్ర‌మంలో పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ నాగుల్ మీరా, అభిమానులు, ప‌లువురు పార్టీ నాయకులు పెద్దఎత్తున పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here