**10-12-2024*
విజయవాడ రైల్వే స్టేషన్ అభివృద్ధి ప్రతిపాదనలకు నీతి ఆయోగ్ నుంచి ఆమోదం ఇప్పించాలి
కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ కు ఎంపి కేశినేని శివనాథ్ విజ్ఞప్తి
ఢిల్లీ : అమృత భారత్ స్టేషన్ పథకం కింద విజయవాడ రైల్వే స్టేషన్ ను పునరాభివృద్ధి చేసేందుకు
సి.ఆర్.బి (Chairman, Railway Board) రూ 819.51 కోట్లు అంచనా వ్యయంతో నీతి ఆయోగ్ కి పంపించిన ప్రతిపాదనలు త్వరగా ఆమోదం పొందే విధంగా కృషి చేయాలని విజయవాడ ఎంపి కేశినేని శివనాథ్ , కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ విజ్ఞప్తి చేశారు. విజయవాడ రైల్వే స్టేషన్ అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని కోరారు.
విజయవాడ పార్లమెంట్ పరిధిలో చేపట్టాల్సిన అభివృద్ది పనులు, పెండింగ్ లో వున్న రైల్వే సమస్యల పరిష్కారం కోసం మంగళవారం రైల్ భవన్ లోని కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ కార్యాలయంలో ఎంపి కేశినేని శివనాథ్ ఆయన్ను కలిశారు.
అలాగే విజయవాడ సెంట్రల్ నియోజవర్గంలోని సింగ్ నగర్ ప్రాంతంలో సెకండ్ ఫ్లై ఓవర్ నిర్మాణంతో పాటు ఎంతో కాలం పెండింగ్ లో వున్న గుణదల ఆర్.వో.బి గురించి కూడా మాట్లాడారు. అలాగే పెండింగ్ లో వున్న ఎనిమిది ఆర్.వో.బి అండ్ ఆర్.యు.బి లు మంజూరు చేయాలని కోరారు. ఇక పశ్చిమ నియోజక వర్గంలో రైల్వే శాఖ తో ముడిపడిన డ్రైన్స్, రోడ్డు నిర్మాణ, వెడల్పు సమస్యల పై కూడా చర్చించి వాటిని షరిష్కరించేందుకు త్వరగా చర్యలు చేపట్టాలని అడిగారు.
అలాగే జగ్గయ్యపేటలో గూడ్స్ రైళ్ల రాకపోకల కోసం వినియోగిస్తున్న రైల్వే స్టేషన్ ను సాధారణ రైళ్లు కూడా తిరిగే విధంగా అభివృద్ది చేసి ప్రయాణీకులకు అందుబాటులోకి తీసుకురావాలని కోరారు. అదే విధంగా కొండపల్లి -మధిర మీదగా వెళ్లే రైళ్లు సత్తుపల్లి మీదుగా నడిపిస్తే తిరువూరు నియోజవర్గ ప్రయాణీకులకి కూడా ఉపయోగకరంగా వుంటుందని తెలిపారు. ఎంపి కేశినేని శివనాథ్ చర్చించిన అంశాలపై కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ సానుకూలంగా స్పందించటమే కాకుండా త్వరలోనే అన్ని సమస్యలు పరిష్కరించే విధంగా చర్యలు చేపడతామని ఎంపి కేశినేని శివనాథ్ కి తెలిపారు.