*ఎన్టీఆర్ జిల్లా, మే 28, 2025**ఎన్టీఆర్ కీర్తిప్రతిష్టలు అజరామరం బృంద స్ఫూర్తితో ఎన్టీఆర్ (జిల్లా) కీర్తిని ఇనుమడింపజేద్దాం ఎన్టీఆర్ ఆశయాల స్ఫూర్తితో పేదలకు సేవలందిద్దాం స్వర్ణాంధ్ర @ 2047 లక్ష్యాల సాధనకు సమష్టిగా కృషిచేద్దాం జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ సాధారణ ఉద్యోగిగా కళామతల్లి ముద్దుబిడ్డగా పేద ప్రజల గుండె చప్పుడుగా క్రమశిక్షణతో జీవితాన్ని కొనసాగిస్తూ స్వర్గీయ నందమూరి తారకరామారావుగారు అందుకున్న కీర్తిప్రతిష్టలు అజరామరమని, ఆయన్ను స్ఫూర్తిగా తీసుకొని పేదలకు సేవలందించడం ద్వారా ఎన్టీఆర్ జిల్లాకు మరింత ఖ్యాతిని తీసుకొద్దామని జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ అన్నారు.పూర్వ ముఖ్యమంత్రివర్యులు, కళామతల్లి ముద్దుబిడ్డ స్వర్గీయ నందమూరి తారకరామారావుగారి జయంతిని పురస్కరించుకొని బుధవారం కలెక్టరేట్లోని పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ లక్ష్మీశ ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. తొలుత ఎన్టీఆర్ జీవిత విశేషాలపై జిల్లా సమాచార, పౌర సంబంధాల శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఛాయాచిత్ర ప్రదర్శనను కలెక్టర్ ప్రారంభించి అనంతరం కళాక్షేత్ర నాట్య అకాడమీ, భాగవతుల వెంకటరామ శర్మ శిష్యబృంద సాంస్కృతిక ప్రదర్శనలను తిలకించిన అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ తెలుగు జాతి గర్వపడే విధంగా స్వర్గీయ నందమూరి తారకరామారావు అమలుచేసి విప్లవాత్మక పరిపాలనా సంస్కరణలు స్ఫూర్తిదాయకంగా నిలిచాయన్నారు. పేదలకు పట్టెడన్నం పెట్టాలనే లక్ష్యంతో రూ. 2కే కిలోబియ్యం పథకంతో పాటు మండల విధానం ద్వారా పరిపాలనను ప్రజలకు చేరువచేయాలనే ఉద్దేశంతో సాహసోపేత నిర్ణయాలను తీసుకున్న మహోన్నత వ్యక్తి ఎన్టీఆర్ అని కొనియాడారు. సామాన్య రైతు కుంటుంబంలో జన్మించిన ఎన్టీఆర్ ప్రభుత్వ ఉద్యోగానికి రాజీనామా చేసి కళారంగంలో ప్రవేశించారన్నారు. నవరస నటనా చాతుర్యంతో ప్రేక్షకులను ఆకట్టుకుంటూ నటనకే వన్నె తెచ్చారన్నారు. దివిసీమ ఉప్పెన రాష్ట్రాన్ని సంక్షోభంలోకి నెట్టినప్పుడు ప్రజలను ఆదుకునేందుకు సామాజిక స్పృహ కలిగిన కళాకారుడిగా జోలు పట్టి విరాళాలు సేకరించి బాధితులకు అండగా నిలిచారన్నారు. రాజకీయ నాయకుడిగా రంగప్రవేశం చేసి అతి తక్కువ సమయంలోనే ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి ప్రజా కేంద్రీకృత పరిపాలన సాగించారన్నారు. సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్లుగా భావించి పేద ప్రజల సంక్షేమం కోసం ముఖ్యమంత్రిగా ఆయన తీసుకున్న నిర్ణయాలు నేటికీ చిరస్థాయిగా కొనసాగుతున్నాయన్నారు. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుగారు ఎన్టీఆర్ చూపిన మార్గంలో పరిపాలన అందిస్తూ స్వర్ణాంధ్ర సాధనకు కృషిచేస్తున్నారన్నారు. ఎన్టీఆర్ స్ఫూర్తితో ప్రతిఒక్కరూ రాష్ట్రాభివృద్ధికి పునరంకితమై, పేదరికం లేని సమాజం కోసం పాటుపడాల్సిన అవసరముందని జిల్లా కలెక్టర్ లక్ష్మీశ అన్నారు.*తెలుగు జాతి ఖ్యాతికి ప్రపంచస్థాయిలో గుర్తింపు తెచ్చిన మహనీయుడు:*తెలుగుజాతి ఖ్యాతికి ప్రపంచ స్థాయిలో గుర్తించి తెచ్చిన మహనీయుడు స్వర్గీయ ఎన్టీఆర్ అని నాట్యాచార్యులు భాగవతుల వెంకటరామ శర్మ అన్నారు. ఎన్టీఆర్ ఆశయాల స్ఫూర్తిని భావితరాలకు అందించాల్సిన బాధ్యత మనందరిపై ఉందని డీఆర్వో ఎం.లక్ష్మీ నరసింహం, గ్రామ, వార్డు సచివాలయాల ప్రత్యేక అధికారి జి.జ్యోతి అన్నారు. కార్యక్రమంలో భాగంగా విద్యార్థులు ఎన్టీఆర్ గారి జీవితంలోని కీలక ఘట్టాలను వివరించారు.కార్యక్రంలో డీఆర్వో ఎం.లక్ష్మీనరసింహం, కలెక్టరేట్ పరిపాలన అధికారి ఎస్.శ్రీనివాస్రెడ్డి, పర్యవేక్షకులు ఎం.దుర్గాప్రసాద్, డీఐపీఆర్వో యు.సురేంద్రనాథ్, డీపీఆర్వో ఎస్వీ మోహనారావు, డివిజనల్ పీఆర్వో కె.రవి, మీడియా సమన్వయకర్త వీవీ ప్రసాద్, డీఈవో యూవీ సుబ్బారావు, గ్రామ, వార్డు సచివాలయాల ప్రత్యేక అధికారి జి.జ్యోతి, జిల్లా వ్యవసాయ అధికారి డీఎంఎఫ్ విజయకుమారి, ఎర్త్ హీరోస్ ఫౌండేషన్ ప్రెసిడెంట్ భన్సీ, డిప్యూటీ డైరెక్టర్ చంద్రిక తదితరులు పాల్గొన్నారు.
