విజయవాడ, తేదీ: 14.12.2024
గీత వృత్తిని మరింత ప్రోత్సహిస్తాం
– వీరంకి వెంకట గురుమూర్తి, చైర్మన్, ఏపీ గౌడ సంక్షేమ మరియు అభివృద్ధి కార్పొరేషన్
గౌడ కుల సంక్షేమం, అభివృద్ధి కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను అర్హులైన అందరికీ అందిస్తామని ఏపీ గౌడ సంక్షేమ మరియు అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ వీరంకి వెంకట గురుమూర్తి తెలిపారు.. బెంజిసర్కిల్ లో ఉన్న కృష్ణా జిల్లా లారీ ఓనర్స్ అసోషియేషన్ హాల్ లో ఏపీ గౌడ సంక్షేమ మరియు అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ గా వీరంకి వెంకట గురుమూర్తి శనివారం ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ బీసీ కులాల చేతి వృత్తులకు పునర్ వైభవం తీసుకువస్తామని గతంలో ఎన్నడూ లేనివిధంగా గీత వృత్తిని మరింత ప్రోత్సహిస్తామన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇచ్చిన గౌడ్ కుల కార్పొరేషన్ చైర్మన్ పదవి ద్వారా రాష్ట్రంలోని బీసీలకు సేవ చేసే అధృష్టంగా భావిస్తానన్నారు. కూటమి ప్రభుత్వం బీసీలకు ఒక్క ఏడాదిలోనే రూ. 39,000 కోట్ల బడ్జెట్ కేటాయించారన్నారు. గౌడ కులాలు ఆర్థికంగా బలోపేతం అయ్యేవిధంగా కేరళలో ఉన్న నీరా ఉప ఉత్పత్తులను అక్కడ ఏవిధంగా ప్రోత్సహిస్తున్నారో ఏపీలో కూడా ఉప ఉత్పత్తులను ప్రోత్సహిస్తామన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లక్ష్యమైన ప్రతి ఇంట్లో పారిశ్రామికవేత్తలను తయారు చేసినట్లే గౌడ కులాల్లో కూడా పరిశ్రమలు పెట్టుకునేలా ప్రోత్సాహం అందిస్తామన్నారు.
గృహ నిర్మాణం, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారధి మాట్లాడుతూ తాను నమ్ముకున్న వారికి పార్టీ, ప్రభుత్వం అండగా ఉంటూ వారి పక్షాన నిలబడుతుందన్నారు. ఈ పదవి రావడం ఆయన చిత్తశుద్దికి నిదర్శనం అని అన్నారు. నాకు 25 సంవత్సరాలుగా గురుమూర్తి వ్యక్తి గతంగా తెలుసునన్నారు. బీసీలకు అండగా ముఖ్యమంత్రి అనేక పథకాలను అందిస్తున్నారన్నారు. గత ప్రభుత్వం గౌడ కార్పొరేషన్ కు నిధులు ఇవ్వకుండా నిర్వీర్యం చేసారన్నారు.
రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ మాట్లాడుతూ గత 5 ఏళ్లలో ఎన్నోపోరాటాలు చేశారని దాని ఫలితమే ఈ పదవి అని కొనియాడారు. బీసీ కులాలందరికీ అందుబాటులో ఉంటూ వారి ఐక్యత కోసం ఎన్నో పోరాటాలు చేశారన్నారు. స్వర్గీయ మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు బడుగు వర్గాల కోసం పాటుపడితే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వారిని ఆర్థికంగా తోడ్పాటు అందిస్తున్నారన్నారు. రాష్ట్రాభివృద్ధికి విజన్ డాక్యుమెంట్ తెచ్చిన ఘనత ముఖ్యమంత్రికే దక్కుతుందన్నారు.
ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ నేడు ఎంతో మంది బీసీలు ప్రముఖ స్థానంలో ఉండటానికి కారకులు స్వర్గీయ మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు అని తెలిపారు. చైర్మన్ గా గురుమూర్తికి సముచిత స్థానం లభించిందన్నారు. గతంలో బీసీ సబ్ ప్లాన్ నిధులను పక్కదారి పట్టించారన్నారు. బీసీ ప్రధాని నరేంద్ర మోదీ రాష్ట్రాల్లో బీసీ కులగణన చేసుకునే విధంగా రాష్ట్రాలకు స్వేచ్ఛ నిచ్చారన్నారు.
ప్రమాణ స్వీకార కార్యక్రమంలో శాసనమండలి సభ్యులు దువ్వారపు రామారావు, అంగర రామ్మోహన్, శాసనసభ్యులు వర్ల కుమార రాజా, గద్దె రామ్మోహన్, వెనిగండ్ల రాము, నక్కా ఆనంద బాబు, బోడే ప్రసాద్, గౌతు శిరీష, కాగిత కృష్ణ ప్రసాద్, తంగిరాల సౌమ్య, నిమ్మకాయల చినరాజప్ప, వివిధ కార్పొరేషన్ చైర్మన్లు కొనకళ్ల నారాయణ, కొమ్మారెడ్డి పట్టాభిరామ్, రావి వెంకటేశ్వరరావు, లంక దినకర్.. మాజీ పార్లమెంట్ సభ్యులు వడ్డే శోభనాద్రీశ్వరరావు, మాజీ శాసనమండలి సభ్యులు టి.డి. జనార్ధన్, స్వర్గీయ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ తనయుడు నందమూరి రామకృష్ణ, నాయకులు నాగుల్ మీరా, గొట్టిపాటి రామకృష్ణ తదితరలు పాల్గొన్నారు. తొలుగ ఏపీ గౌడ సంక్షేమ మరియు అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ గా వీరంకి వెంకట గురుమూర్తి చేత సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ఎస్. తనూజ రాణి ప్రమాణ స్వీకారం చేయించారు..