తెలుగు ప్రజల ఆత్మ గౌరవం శ్రీ పొట్టి శ్రీరాములు
వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త మల్లాది విష్ణు
తెలుగు ప్రజల ఆత్మగౌరవం కోసం నిరాహారదీక్ష చేసి ప్రాణాలర్పించిన మహనీయుడు అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు అని వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు కొనియాడారు. ఆ త్యాగధనుని వర్ధంతిని పురస్కరించుకొని ఆదివారం సత్యనారాయణపురంలోని అమరజీవి విగ్రహానికి స్థానిక కార్పొరేటర్ శర్వాణి మూర్తితో కలిసి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన త్యాగాలను కొనియాడారు. ఉమ్మడి మద్రాసు రాష్ట్రం నుంచి తెలుగు వారికి ప్రత్యేక రాష్ట్రం ఇవ్వాలని పొట్టి శ్రీరాములు సాగించిన పోరాటం మరువలేనిదని గుర్తు చేసుకున్నారు. భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటు కోసం, ఆంధ్రుల ఆత్మగౌరవం కోసం ఎంతవరకైనా వెళ్లాలన్న ఆయన దృఢ సంకల్పం ఎంతో గొప్పదని మల్లాది విష్ణు అన్నారు. మహాత్మా గాంధీ శిష్యుడిగా మారి జాతీయోద్యమంలో పాల్గొని ఆరు సార్లు జైలుకు వెళ్లారన్నారు. సత్యం, అహింసా, హరిజనోద్ధరణకు జీవితాంతం కృషి చేసిన మహనీయుడని.. హరిజనులకు ఆలయ ప్రవేశం చేయించిన ఘనత ఆయనకే దక్కిందన్నారు. గాంధీ స్మారక నిధి సంచాలకులుగా మద్రాస్ రాష్ట్రమంతా పర్యటించేవారని, తద్వారా పొట్టి శ్రీరాములికి ప్రజా సమస్యలు తెలిసేవని చెప్పారు. ప్రజల కోసం తమ జీవితాన్ని పణంగా పెట్టి పోరాడేవాడే నాయకుడిగా నిలుస్తాడని, శ్రీ పొట్టి శ్రీరాములు ఇందుకు నిదర్శనమని మల్లాది విష్ణు అన్నారు. ఆంధ్రులకు ప్రత్యేక రాష్ట్రం కోసం చెన్నై రాయపేట రోడ్డులోని శ్రీ బులుసు సాంబమూర్తి నివాసంలో నిరాహార దీక్ష ప్రారంభించారని.. ఎంతో పట్టుదలతో దీక్షను కొనసాగించి చివరకు ప్రాణత్యాగం చేశారని వివరించారు. ఆయన చేసిన త్యాగాలకు గుర్తుగా మహానేత వైఎస్సార్ హయాంలో నెల్లూరు జిల్లాకు శ్రీ పొట్టి శ్రీరాములు జిల్లాగా పేరు పెట్టి కీర్తించుకోవటం జరిగిందని గుర్తు చేశారు. ఆ మహనీయుని స్ఫూర్తితో ప్రతి తెలుగువాడు ముందుకు సాగాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. కార్యక్రమంలో వైసీపీ డివిజన్ కోఆర్డినేటర్ దోనేపూడి శ్రీనివాస్, నాయకులు మైలవరపు రాము, చల్లా సుధాకర్, చల్లాప్రగఢ గోపాలకృష్ణ, కంభంపాటి ప్రసాద్, కూనపులి ఫణి, మురళీకృష్ణం రాజు, కొల్లూరు రామకృష్ణ, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.