*26.12.2024*
జగన్ కు ప్రజలే ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు
జగన్ అసెంబ్లీ కి రాకపోవడం ప్రజాస్వామ్యం మీద దాడి లాంటిదే
ముఖ్యమంత్రి చంద్రబాబును చూసే ధైర్యం లేక అసెంబ్లీ కి రావడం లేదు
గన్నవరం ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ యార్లగడ్డ వెంకట్రావ్
ప్రజా సమస్యలను ప్రస్తావించాల్సిన వేదిక అసెంబ్లీ అని, ముఖ్యమంత్రి చంద్రబాబు ను చూసే ధైర్యం లేక పులివెందుల ఎమ్మెల్యే జగన్ అసెంబ్లీ కి రావడం లేదని గన్నవరం నియోజకవర్గ శాసనసభ్యులు, ప్రభుత్వ విప్ యార్లగడ్డ వెంకట్రావ్ విమర్శించారు. గురువారం రామవరప్పాడులో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. జగన్ ప్రజాదర్బార్ నిర్వహించడం హాస్యాస్పదమని ప్రజాదర్బార్ లో వచ్చిన ఫిర్యాదులను జగన్ సొంత నిధులతో పరిష్కరిస్తారా అని ప్రశ్నించారు. అసెంబ్లీ సమావేశాలకు రాకుండానే మైక్ ఇవ్వడం లేదంటూ అసత్యాలు చెబుతున్నారని, జగన్ కు మైక్ ఇవ్వరేమోనన్న ఫోబియా పట్టుకుందని ఎద్దేవా చేశారు. అసెంబ్లీ కి రాకపోవడం అంటే ప్రజాస్వామ్యాన్ని, శాసనసభను అవమానించడమే అన్నారు. 1994 లో కాంగ్రెస్ కు ప్రతిపక్ష హోదా లేనప్పటికీ అప్పటి ప్రజాప్రతినిధులు శాసనసభకు వచ్చారని గుర్తు చేశారు. శాసనమండలికి వైసీపీ సభ్యులు ఎందుకు వెళ్తున్నారని, రాజ్యసభ లో, లోక్ సభలో వైసీపీ కి ప్రధాన ప్రతిపక్ష హోదా లేనప్పటికీ అక్కడికి ఎందుకు వెళ్తున్నారని యార్లగడ్డ నిలదీశారు. చంద్రబాబు కు ప్రతిపక్ష హోదా తీసివేయడానికీ అప్పటి ముఖ్యమంత్రి గా వున్నా జగన్ సర్వశక్తులు ఒడ్డారని అన్నారు. ప్రజలు అన్ని గమనిస్తున్నారని చెప్పారు. జగన్ తీరుతో వారి పార్టీ సభ్యులు కూడా బాధపడుతున్నారని కొత్తగా ఎమ్మెల్యే గా గెలుపొందిన వారు శాసనసభను చూస్తామా లేదా అని మదనపడుతున్నారని వ్యాఖ్యానించారు. బూతులు తిట్టే వారికీ మంత్రి పదవులు ఇస్తే ప్రజలు తిరస్కరించారని, అందుకు ప్రజల ను నిందిస్తారా అని మండిపడ్డారు. 1955 నుండి ఇప్పటివరకు తక్కువ అభివృద్ధి జరిగింది జగన్ ప్రభుత్వంలో కదా అన్నారు. భాష పై కూడా దాడి చేసిన ప్రభుత్వం అని విమర్శించారు. 11 మంది శాసనసభ్యులు ఉంటే ప్రతిపక్ష హోదా ఎలా ఇస్తారని ప్రశ్నించారు. ప్రతిపక్ష హోదా ప్రజలే ఇవ్వలేదని యార్లగడ్డ వ్యాఖ్యానించారు.