ఎన్టీఆర్ జిల్లా, డిసెంబర్ 27, 2024
సమ్మిళిత వృద్ధి సాధనలో బ్యాంకులు కీలకపాత్ర పోషించాలి
బ్యాంకుల వారీగా లక్ష్యాలు చేరుకునేందుకు కృషిచేయాలి
– వ్యవసాయ, పారిశ్రామిక, సేవా రంగాల అన్ని పరామితుల్లో పురోగతి కీలకం
– పీఎం విశ్వకర్మ యోజన, సూర్య ఘర్ యోజనలపై ప్రత్యేక దృష్టిపెట్టాలి
– రుణ దరఖాస్తుల పరిష్కార ప్రక్రియను వేగవంతం చేయాలి
– డీసీసీ, డీఎల్ఆర్సీ సమావేశంలో బ్యాంకర్లతో కలెక్టర్ డా. జి.లక్ష్మీశ
స్వర్ణాంధ్ర @ 2047 సాకారం దిశగా అమలుచేస్తున్న ప్రణాళికలు మంచి ఫలితాలు ఇవ్వడంలో, అన్ని రంగాల్లోనూ 15 శాతం సుస్థిర, సమ్మిళిత వృద్ధి సాధనలో బ్యాంకులు కీలకపాత్ర పోషించాలని జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ కోరారు.
శుక్రవారం కలెక్టరేట్ శ్రీ పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో లీడ్ జిల్లా కార్యాలయం ఆధ్వర్యంలో కలెక్టర్ లక్ష్మీశ అధ్యక్షతన జిల్లా సంప్రదింపుల కమిటీ (డీసీసీ), జిల్లాస్థాయి సమీక్షా కమిటీ సమావేశం (డీఎల్ఆర్సీ) జరిగింది. ఈ సమావేశంలో వార్షిక రుణ ప్రణాళిక లక్ష్యాల సాధన, వ్యవసాయం, ఎంఎస్ఎంఈ; కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పథకాలు-బ్యాంకు లింకేజీ, ఆర్థిక సాక్షరత కార్యక్రమాలు, సుస్థిర అభివృద్ధి లక్ష్యాల్లో బ్యాంకింగ్ రంగానికి సంబంధించిన అంశాల్లో పురోగతి తదితరాలపై చర్చించారు. తొలుత ఎల్డీఎం జిల్లాలో బ్యాంకింగ్ రంగ పురోగతిని వివరించారు. జిల్లాలో గ్రామీణ ప్రాంతాల్లో 92, సెమీ అర్బన్లో 125, అర్బన్-మెట్రోలో 331 మొత్తం 548 బ్యాంకు బ్రాంచులు ఉన్నట్లు తెలిపారు. అదే విధంగా మొత్తం డిపాజిట్లు, అడ్వాన్సులు; ఎస్హెచ్జీలకు అడ్వాన్సులు, కీలక బ్యాంకింగ్ సూచికల్లో పురోగతిని వివరించారు. 2024-25 ఆర్థిక సంవత్సర వార్షిక రుణ ప్రణాళికలో 2024, సెప్టెంబర్ 30 నాటికి ప్రాధాన్య రంగంలో 60.63 శాతం, ప్రాధాన్యేతర రంగంలో 79.27 శాతం మేర లక్ష్యాలను సాధించినట్లు తెలిపారు. మొత్తంమీద రూ. 73 వేల కోట్ల లక్ష్యానికి సంబంధించి 72.38 శాతం మేర సాధించడం జరిగిందని.. బ్యాంకులు వార్షిక రుణ ప్రణాళిక లక్ష్యాలను చేరుకునేందుకు కృషిచేయాలని.. వ్యవసాయ, పారిశ్రామిక, సేవా రంగాల అన్ని పరామితుల్లో పురోగతి కీలకమని, పీఎం విశ్వకర్మ యోజన, సూర్య ఘర్ యోజనలపై ప్రత్యేక దృష్టిపెట్టాలని ఈ సందర్భంగా కలెక్టర్ సూచించారు. రుణ దరఖాస్తుల పరిష్కార ప్రక్రియను వేగవంతం చేయాలని స్పష్టం చేశారు. ప్రజా సంక్షేమం లక్ష్యంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న వివిధ పథకాలు, కార్యక్రమాలు విజయవంతంగా అమలు చేయడంలో బ్యాంకులది కీలకపాత్ర అని.. ప్రభుత్వ ప్రాధాన్యతల ఆధారంగా బ్యాంకులు, బ్రాంచ్ల వారీగా లక్ష్యాల సాధనకు కృషిచేయాలని సూచించారు. కౌలు రైతుల సీసీఆర్సీ కార్డులతో పాటు పశు సంవర్థక శాఖ కేసీసీలపైనా ప్రత్యేక దృష్టిపెట్టాలన్నారు. గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ (ఆర్ఎస్ఈటీఐ) ద్వారా బ్యాంకుల సహకారంతో సోలార్ ప్యానెళ్ల నిర్వహణ, మరమ్మతులపై యువతకు స్వల్పకాలిక శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. పీఎం సూర్యఘర్ యోజన ద్వారా ఇన్స్టలేషన్స్ పెరగనున్న నేపథ్యంలో సంబంధిత రంగంలో మానవ వనరుల కొరత లేకుండా ఈ ప్రయత్నం దోహదపడుతుందన్నారు. స్వయం సహాయక సంఘాల సమావేశాల్లో ఆర్థిక అక్షరాస్యత అవగాహన కార్యక్రమాలను భాగం చేయాలని కలెక్టర్ సూచించారు. పీఎంఈజీపీ, స్టాండప్ ఇండియా, ప్రధానమంత్రి ముద్రా యోజన, ఆత్మనిర్భర్-పీఎం స్వానిధి, ఏపీ టిడ్కో-పీఎంఏవై (అర్బన్) తదితరాలపైనా సమావేశంలో చర్చించి కలెక్టర్ సూచనలు చేశారు.
సమావేశంలో డీసీసీ కన్వీనర్ ఎం.శ్రీధర్, ఆర్బీఐ మేనేజర్ నాగ ప్రవీణ్, నాబార్డు డీడీఎం మిలింద్ చౌసాల్కర్, ఎల్డీఎం కె.ప్రియాంక, ఆర్ఎస్ఈటీఐ డైరెక్టర్ మల్లిఖార్జున్రెడ్డి, డీఆర్డీఏ పీడీ కె.శ్రీనివాసరావు, జిల్లా వ్యవసాయ అధికారి డీఎంఎఫ్ విజయకుమారి, పశు సంవర్థక అధికారి ఎం.హనుమంతరావు, ఉద్యాన అధికారి పి.బాలాజీ కుమార్, వివిధ బ్యాంకుల కంట్రోలర్లు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.