దేశ ప్రజలకు ప్రధాని మోదీ వీడియో సందేశం..!!
Dr Manmohan Singh: ప్రఖ్యాత ఆర్థికవేత్త, మాజీ ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ మృతి పట్ల ప్రధాని నరేంద్ర మోదీ సంతాపాన్ని వ్యక్తం చేశారు. ఈ ఉదయం మోదీ ఆయన నివాసానికి వెళ్లారు.
పార్థివదేహంపై పుష్పగుచ్ఛాలు ఉంచి ఘనంగా నివాళి అర్పించారు.
ఈ సందర్భంగా దేశ ప్రజలను ఉద్దేశించి ఓ వీడియో సందేశాన్ని విడుదల చేశారు. ఈ దేశానికి మన్మోహన్ సింగ్ చేసిన సేవలను స్మరించుకున్నారు. ఓ ఎంపీగా ఎంతో బాధ్యతాయుతంగా వ్యవహరించేవారని మోదీ చెప్పారు. వీల్చైర్పై పార్లమెంట్ సమావేశాలకు హాజరయ్యారని గుర్తు చేశారు.
తాను గుజరాత్ ముఖ్యమంత్రిగా మన్మోహన్ సింగ్ ప్రధానిగా పని చేశారని, ఆ సమయంలో పలు జాతీయ, అంతర్జాతీయ, ఆర్థిక అంశాలపై ఆయనతో తరచూ చర్చించేవాడనని మోదీ చెప్పారు. ఓ రాజనీతిజ్ఞుడిగా రాజకీయ పార్టీలకు అతీతంగా వ్యవహించే వారని, ప్రతి ఒక్కరికీ అన్ని సందర్భాల్లో అందుబాటులో ఉండేవారని అన్నారు.
మన్మోహన్ సింగ్ మృతి ఈ దేశానికి తీరని లోటును మిగిల్చిందని మోదీ పేర్కొన్నారు. సంక్షోభ సమయాలను ధీటుగా ఎదుర్కొని, ఎలా అత్యున్నత శిఖరాలకు చేరవచ్చనే విషయాన్ని మన్మోహన్ సింగ్ జీవితాన్ని చూసి నేర్చుకోవచ్చని, ఈ తరానికి ఆయన ఓ ఆదర్శనీయుడని నివాళి అర్పించారు.
మచ్చలేని రాజకీయ నేతగా, ఓ గొప్ప ఆర్థికవేత్తగా.. మన్మోహన్ సింగ్ తన జీవితాన్ని ఈ దేశానికి, మానవీయ కోణంలో అమలులోకి తీసుకొచ్చిన ఆర్థిక సంస్కరణలకు అంకితం చేశారని మోదీ కొనియాడారు. అత్యంత సంక్లిష్ట సమయాల్లో ఆర్థిక నిపుణుడిగా, రిజర్వ్ బ్యాంక్ గవర్నర్గా ఈ దేశానికి ఎంతగానో సేవలందించారని చెప్పారు.
మాజీ ప్రధానమంత్రి, దివంగత పీవీ నరసింహా రావు మంత్రివర్గంలో ఆర్థిక శాఖ మంత్రిగా మన్మోహన్ రూపొందించిన ఆర్థిక సంస్కరణలు, అమలు చేసిన వ్యూహాలు దేశ ఆర్థిక వ్యవస్థను మలుపు తిప్పాయని, బలంగా వేళ్లూనుకునేలా చేసిందని మెదీ వ్యాఖ్యానించారు. ఆర్థిక మాంద్యంలో దేశ ఆర్థిక వ్యవస్థ చెక్కుచెదరకపోవడానికి అదే ప్రధాన కారణమని పేర్కొన్నారు.