Home Political news సైబర్ క్రైమ్, డిజిటల్ అరెస్ట్, డ్రగ్స్ వినియోగం వల్ల కలుగు అనర్థాలు వంటి అంశాలపై అవగాహన...

సైబర్ క్రైమ్, డిజిటల్ అరెస్ట్, డ్రగ్స్ వినియోగం వల్ల కలుగు అనర్థాలు వంటి అంశాలపై అవగాహన కార్యక్రమం

3
0

 *ఎన్.టి.ఆర్. జిల్లా పోలీస్ కమిషనర్ కార్యాలయం, విజయవాడ*

*తేదీ: 27-12-2024*

సైబర్ క్రైమ్, డిజిటల్ అరెస్ట్, డ్రగ్స్ వినియోగం వల్ల కలుగు అనర్థాలు వంటి అంశాలపై అవగాహన కార్యక్రమం

సమాజంలో జరుగుతున్న సైబర్ నేరాలు, డ్రగ్స్ వినియోగం వల్ల కలుగు అనర్థాలు, వాటిని అరికట్టడానికి అవసరమైన జాగ్రత్తల గురించి ప్రజలలో అవగాహన కల్పించడం ప్రధాన లక్ష్యంగా ఎన్.టి.ఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ ఎస్.వి. రాజశేఖర బాబు, ఐ.పి.ఎస్.  పర్యవేక్షణలో మరియు ఆధ్వర్యంలో లక్కిరెడ్డి బాలిరెడ్డి కళాశాల విద్యార్థులు, విద్యార్థినులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో సైబర్ క్రైమ్, డిజిటల్ అరెస్ట్, సైబర్ సిటిజన్ యాప్, డ్రగ్స్ వంటి అంశాలపై అవగాహన కలిగించడం  జరిగింది. సైబర్ నేరాల నియంత్రణకు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం ఎంత ముఖ్యమో, సైబర్ నేరాలు జరగకుండా అవగాహన కల్పించడమే సైబర్ సురక్షిత సమాజ నిర్మాణానికి మార్గమని కమిషనర్  వివరించారు.

*కమిషనర్  సందేశం*

కమిషనర్  మాట్లాడుతూ, ‘‘నేను గతంలో ఇంజనీరింగ్ కళాశాలలో లెక్చరర్‌గా పనిచేశాను. మళ్లీ ఇక్కడికి రావడం ఆనందంగా ఉంది. ఈ సందర్భంగా ఏరోస్పేస్ ల్యాబ్‌ను సందర్శించాను. టెక్నాలజీని పోలీసుల పనిలో సమర్ధవంతంగా ఉపయోగించడం ద్వారా ప్రజలకు మెరుగైన సేవలు అందించవచ్చని’’ తెలిపారు.

అదనంగా, టెక్నాలజీ విద్యార్థులు నూతన ఆవిష్కరణలతో సైబర్ నేరాలను అరికట్టడానికి యాప్‌లు, డిజిటల్ సాధనాలు రూపొందించవచ్చని పేర్కొన్నారు. విద్యార్థులు తమ జ్ఞానం, సృజనాత్మకతను సమాజానికి ఉపయోగకరంగా మలచాలని ఉద్బోధించారు.

*సైబర్ నేరాల నివారణ చిట్కాలు:*

1. సైబర్ సిటిజన్ యాప్: ఈ యాప్ ద్వారా సుమారు 3 లక్షల మంది ప్రజలను నేరాలపై నిఘాలో భాగస్వామ్యం చేయడం జరిగింది.

2. 1930 కాల్ సెంటర్: సైబర్ నేరం జరిగిన వెంటనే ఫిర్యాదు చేయడానికి ఉపయోగపడే కాల్ సెంటర్.

3. NCRP పోర్టల్ & I4C: జాతీయ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ మరియు కోఆర్డినేషన్ కోసం ఏర్పాటు చేసిన ప్లాట్‌ఫారమ్‌లు.

4. సోషల్ మీడియాలో జాగ్రత్తలు: సోషల్ మీడియాలో ఏమి షేర్ చేయాలన్న దానిపై ఒక నిమిషం ఆలోచించాలి.

*డ్రగ్స్ పై కఠిన చర్యలు*

యువత డ్రగ్స్ వినియోగం కారణంగా జీవితాలు నాశనం అవుతున్నాయని, ప్రతి ఒక్కరూ డ్రగ్స్‌కు దూరంగా ఉండాలని కమిషనర్  స్పష్టంగా తెలిపారు. డ్రగ్స్ రహిత సమాజం కోసం ఈగల్ అనే ప్రత్యేక సంస్థ ఏర్పాటు చేసి, ఉక్కు పాదంతో డ్రగ్స్‌పై దాడి చేపట్టారు.

*డ్రోన్స్ ద్వారా పర్యవేక్షణ*

ప్రతి పాఠశాల, కళాశాల వద్ద ఉదయం, సాయంత్రం డ్రోన్స్ కెమెరాల ద్వారా ఈవ్ టీజింగ్ నివారణకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. విద్యార్థినులు అఘాయిత్యాల బారిన పడకుండా వారి భద్రతను పర్యవేక్షించడానికి ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశారు.

ఈ కార్యక్రమంలో ట్రైనీ ఐ.పి.ఎస్. మనీషా , ఏ.డి.సి.పి. టాస్క్ ఫోర్సు శ్రీనివాసరావు , మైలవరం ఏ.సి.పి. ప్రసాద రావు , ఇన్స్పెక్టర్లు చంద్ర శేఖర్ , గిరిబాబు , కళాశాల ప్రిన్సిపాల్ అప్పారావు , ప్రెసిడెంట్ శ్రీనివాసరెడ్డి , ఇతర అధికారులు పాల్గొన్నారు. సుమారు 3500 మంది విద్యార్థులు, విద్యార్థినులు ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం అయ్యారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here