నిత్యాన్నదానానికి సహకారం…
ధార్మిక సేవలో అగ్రస్థానం…
—-
–
విజయవాడ :
నాలుగు దశాబ్దాల క్రితం దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు ఆలోచనల మేరకు తిరుమల తిరుపతి దేవస్థానంలో భక్తుల సౌకర్యార్థం ప్రారంభమైన నిత్యాన్నదాన పథకానికి గత 18 సంవత్సరాలుగా నిరంతరాయంగా కూరగాయల పంపిణీ చేసే అవకాశం రావడం మహద్భాగ్యమని ప్రముఖ పారిశ్రామికవేత్త కొలుసు కృష్ణకాంత్ యాదవ్ అన్నారు. కస్తూరిబాయిపేట పుష్ప హోటల్ సమీపం నుంచి శనివారం తిరుమలకు బయలుదేరిన పది టన్నుల కూరగాయల వాహనానికి జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ మహత్కార్యానికి నగరంలో ఆద్యుడైన దివంగత మండవ కుటుంబరావు ఆశయాలను కొనసాగించేందుకు ఎంతో మంది సాధారణ భక్తులు ముందుకు రావడం అభినందనీయమన్నారు.
సమాజంలో ఎంతోమంది తమ తమ ఆకాంక్షల మేరకు సమాజ సేవకు వారి పరిధి మేరకు అందిస్తున్న సేవల్లో అన్నదానానిదే అత్యున్నత స్థానమన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం అందిస్తున్న సేవలలో భాగస్వామ్యం కావడం లభించే అవకాశం అందరికీ
ఉండదన్నారు. మనం చేసే ప్రతి పని వెనుక భగవంతుని సహకారం ఉంటుందని ప్రతి ఒక్కరూ విశ్వసిస్తారని పేర్కొన్నారు. కార్యక్రమ నిర్వాహకులు మరడ నాగేంద్ర మాట్లాడుతూ ఇటువంటి మహత్తర కార్యక్రమాన్ని కీర్తిశేషులు మండవ కుటుంబరావు 2006లో అప్పటి టీటీడీ చైర్మన్ దివంగత కనుమూరి బాపిరాజుతో చర్చించి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారని గుర్తు చేశారు. గత 18 సంవత్సరాలుగా దేవదేవుడుని దర్శించుకునే ప్రతి భక్తునికి అన్నదానం దాతలు వితరణ చేస్తున్న కూరగాయలతోనే నిర్వహిస్తోందన్నారు. లక్షలాది మందికి ప్రతిరోజు ఆహారాన్ని అందించడం ఎంతో కష్టమైన సేవ అని పేర్కొన్నారు. జీవితంలో స్థిరపడిన ప్రతి ఒక్కరి విజయం వెనుక భగవంతుని కృప ఉంటుందన్నారు. మనం చేసే ప్రతి సత్కార్యము మనం నమ్మిన దైవశక్తి పిలుపు మేరకే నిర్వహించగలుగుతున్నామన్నారు. ధార్మిక సేవలో పాల్గొనడం, కార్యక్రమాలు నిర్వహించడంలో ఉండే ఆనందం అంతులేని సంతోషాన్ని, మానసికంగా మన మనసుల్లో సానుకూలమైన దృక్పథాన్ని పెంపొందిస్తుందని శాస్త్రవేత్తలు సైతం వివిధ పరిశోధన ద్వారా గుర్తించారని తెలిపారు.తనకు ఉన్నదానిలో ఒకరికి ఇవ్వడం అనే సంతోషం మనలో ఒక గొప్ప చైతన్యాన్ని నింపుతుందన్నారు.
భగవంతుని అనుగ్రహంతో, దాతల సహకారంతో రానున్న రోజుల్లో మరిన్ని ధార్మిక కార్యక్రమాలు నిర్వహించాలని ఆకాంక్షించారు.
ఈ అద్వితీయ వితరణకు సహాయం అందించిన ప్రతి ఒక్కరూ అభినందనీయులని ప్రశంసించారు.
కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ గోగినేని సుజాత, అనుమోలు శ్రీనివాస్, మువ్వా కోటేశ్వరరావు, బొప్పన చంద్రశేఖర్, పువ్వాడ మాలకొండయ్య, బద్దిరెడ్డి కిరణ్ కుమార్,
ఎ. జగన్మోహన్ రెడ్డి, కడియాల విజయ్ కుమార్, ఐలాపురం అరుణ్, అన్నే శ్రీనాథ్, గంతకోరు ద్వారకానాథ్, కొణిదిన శ్రీకాంత్, కాసరనేని చంద్రశేఖర్, పలువురు ధార్మిక, ఆధ్యాత్మికవాదులు పాల్గొన్నారు.