ఫిబ్రవరి రెండో వారం నుంచి అమరావతి నిర్మాణ పనులు వేగవంతం
ప్రపంచంలో టాప్ 5 నగరాల్లో ఒకటిగా అమరావతిని నిర్మిస్తాం
రాజధానిలోని నేలపాడులో జరుగుతున్న పనుల పరిశీలనలో మంత్రి నారాయణ
అమరావతి:- గత ప్రభుత్వం అమరావతిపై కక్షపూరితంగా వ్యవహరించి అడవిగా మార్చేసిందని రాష్ట్ర పురపాలక మరియు పట్టణాభివృద్ధి శాఖా మంత్రి పొంగూరు నారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ అరాచక పాలనలో ఎప్పుడు ఎవరిని అరెస్ట్ చేస్తారోనని ప్రజలంతా భయభ్రాంతులకు గురయ్యారని ఆరోపించారు. గత ప్రభుత్వ నిర్వాకంతో ఎదురైన న్యాయపరమైన సమస్యలను పరిష్కరించుకుంటూ అమరావతి నిర్మాణానికి అడుగులు వేస్తున్నామన్నారు. రాజధానిలోని నేలపాడులో జరుగుతున్న వివిధ పనులను మంత్రి నారాయణ గురువారం ఉదయం పరిశీలించారు. నేలపాడు సమీపంలో 2019 కు ముందే పనులు ప్రారంభమైన అడ్మినిస్ట్రేటివ్ (జీఏడీ టవర్తో పాటు మరో నాలుగు) టవర్లు,హైకోర్టు రాఫ్ట్ పౌండేషన్ల వద్ద ప్రస్తుత పరిస్థితిని పరిశీలించారు. ఐదు టవర్లు,హైకోర్టు పునాదులు నీటిలో మునిగిఉండటంతో కొద్ది రోజులుగా ఆ నీటిని బయటికి తోడివేసే పనులు జరుగుతున్నాయి. ఆయా పనులను పరిశీలించిన తర్వాత మంత్రి నారాయణ మీడియాతో మాట్లాడారు. 2015 జనవరి ఒకటో తేదీన రాజధాని కోసం ల్యాండ్ పూలింగ్ నోటిఫికేషన్ జారీచేసాం. కేవలం 58 రోజుల్లోనే మొత్తం 34 వేల ఎకరాల భూమిని రైతులు ఎలాంటి ఇబ్బంది పెట్టకుండా ప్రభుత్వానికి అప్పగించారు. రైతులు భూములిచ్చి ఎంతో త్యాగం చేసారు. ప్రపంచంలోనే టాప్ 5 నగరాల్లో రాజధాని ఉండాలని పనులు ప్రారంభించాం. అమరావతిలో గవర్నమెంట్ కాంప్లెక్స్ పరిధిలో నిర్మించే అసెంబ్లీ, అడ్మినిస్ట్రేటివ్ టవర్లు, హైకోర్టు భవనాలను ఐకానిక్ భవనాలుగా నిర్మించాలని నిర్ణయించాం. మొత్తం కోటీ నాలుగు లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ భవనాలు నిర్మించేలా ప్రణాళికలు రూపొందించాం. సచివాలయ అధికారులతో పాటు హెచ్వోడీ అధికారులు అందరూ ఒకేచోట ఉండేల జీఏడీ టవర్తో పాటు మరో నాలుగు టవర్లు డిజైన్లు చేసాం. జీఏడీ టవర్ను 48 అంతస్థులతో 17 లక్షల 3వేల 433 చదరపు అడుగుల విస్తీర్ణంలోనూ, టవర్ 1, టవర్ 2లను 40 అంతస్తులతో 28.41 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో, టవర్ 3,టవర్ 4లను 40 అంతస్థుల్లో 23 లక్షల 42 వేల 956 చదరపు అడుగుల్లో నిర్మించేలా డిజైన్ చేసాం. ఇక హైకోర్టును 8 అంతస్థుల్లో 20.32 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో అసెంబ్లీని 11.22 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో 250 మీటర్ల ఎత్తులో వ్యూపాయింట్ వచ్చేలా డిజైన్ చేసాం.అసెంబ్లీ లేని రోజుల్లో టూరిజం ప్రాంతంగా ఉండేలా పక్కా ప్లానింగ్తో డిజైన్ చేసాం. ఈ డిజైన్ల ప్రక్రియ కూడా పూర్తయింది. నిర్మాణాలకు సంబంధించి పనులు కూడా ప్రారంభించాం. వీటితో పాటు మరో కోటీ 24 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో అధికారులు,ప్రజాప్రతినిధులు, ఉద్యోగులకు సంబంధించిన 4053 అపార్టుమెంట్ల నిర్మాణం కూడా గతంలోనే ప్రారంభించాం. వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మాపై కక్షతో ఈ నిర్మాణాలన్నీ నిలిపివేసిందని మంత్రి నారాయణ ఆరోపించారు. ఐకానిక్ భవనాల పునాదులు నీటిలోనే ఏళ్ల తరబడి ఉండిపోవడంతో ఐఐటీ నిపుణల నివేదిక ఆధారంగా కొనసాగిస్తున్నామని తెలిపారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పటివరకూ లక్షల కోట్ల మేరకు పెట్టుబడులకు అంగీకారం కుదిరిందని, సీఎం చంద్రబాబు, లోకేష్లు దావోస్ పర్యటనలో వేలకోట్ల పెట్టుబడులకు పారిశ్రామిక వేత్తలు ఆసక్తి చూపుతున్నారని మంత్రి పేర్కొన్నారు.