*ఎన్టీఆర్ జిల్లా, జనవరి 27, 2025*
అర్జీల పరిష్కార నాణ్యతలో జిల్లాను నెం.1లో నిలపండి
మండల, డివిజన్ స్థాయిలోనూ గ్రీవెన్స్ డేను సమర్థవంతంగా నిర్వహించండి
జిల్లాస్థాయి పీజీఆర్ఎస్కు 145 అర్జీలు కలెక్టర్ డా. జి.లక్ష్మీశ
రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలుచేస్తున్న పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రెసల్ సిస్టమ్ (పీజీఆర్ఎస్)కు వచ్చే అర్జీల పరిష్కార నాణ్యతలో జిల్లాను నెం.1లో నిలిపేందుకు అధికారులు నిబద్ధతతో కృషిచేయాలని కలెక్టర్ డా. జి.లక్ష్మీశ ఆదేశించారు.
సోమవారం కలెక్టరేట్ పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో కలెక్టర్ లక్ష్మీశ.. డీఆర్వో ఎం.లక్ష్మీ నరసింహం, డీఆర్డీఏ పీడీ కె.శ్రీనివాసరావు, గ్రామ, వార్డు సచివాలయాల ప్రత్యేక అధికారి పి.జ్యోతి తదితరులతో కలిసి ప్రజల నుంచి 145 అర్జీలు స్వీకరించారు. రెవెన్యూ శాఖకు సంబంధించి 56, పురపాలక పట్టణాభివృద్ధికి 30, పోలీస్ శాఖకు 9 అర్జీలు వచ్చాయి. పంచాయతీరాజ్, సర్వే విభాగాలకు ఏడు చొప్పున, విద్యాశాఖకు సంబంధించి 6 అర్జీలు వచ్చాయి. ఉపాధికల్పన 5, ఆరోగ్యం 4, విభిన్న ప్రతిభావంతుల సంక్షేమం 3, రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ 3 అర్జీలు రాగా వ్యవసాయం, ఏపీఎస్ఆర్టీసీ, పౌర సరఫరాలు, ఇరిగేషన్కు రెండు చొప్పున అర్జీలు అందాయి. అదేవిధంగా ఏపీసీపీడీసీఎల్, సహకార, డీఆర్డీఏ, గృహ నిర్మాణం, పరిశ్రమలు, ఇంటర్మీడియెట్ విద్య, సాంఘిక సంక్షేమం శాఖలకు సంబంధించి ఒక్కో అర్జీ వచ్చాయి. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అర్జీదారుల విశ్వాసం చూరగొనేలా దరఖాస్తులను పరిష్కరించేందుకు అధికారులు కృషిచేయాలన్నారు. గడువులోగా అర్జీని పరిష్కరించడంతో పాటు నాణ్యంగా పరిష్కరించడం కూడా అత్యంత ప్రధానమని స్పష్టం చేశారు. ఎప్పటికప్పుడు లాగిన్లో ఉన్న అర్జీలతో పాటు డ్యాష్బోర్డులోని స్థితిగతులను పరిశీలించాలని సూచించారు. డివిజనల్, మండలస్థాయిలోనూ గ్రీవెన్స్డేను సమర్థవంతంగా నిర్వహించాలని కలెక్టర్ లక్ష్మీశ ఆదేశించారు.
*స్వచ్ఛాంధ్ర-స్వర్ణాంధ్రపై ప్రత్యేక దృష్టిపెట్టండి:*
గ్రామీణ, పట్టణ ప్రాంత అధికారులు స్వచ్ఛాంధ్ర-స్వర్ణాంధ్ర లక్ష్యాలపై ప్రత్యేకంగా దృష్టిసారించాలని.. చెత్త నుంచి సంపద సృష్టి కేంద్రాల ఉత్పాదకత పెంచేందుకు ఎంపీడీవోలు కృషిచేయాలని ఆదేశించారు. వారంలోగా అన్ని కేంద్రాలను తనిఖీ చేసి, ఆయా కేంద్రాల్లో వర్మీ కంపోస్టు తయారీ సమర్థవంతంగా జరిగేలా చూడాలన్నారు. మునిసిపల్ కార్పొరేషన్, మున్సిపాలిటీలు సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వస్తువుల వినియోగ నిషేధం, తడిచెత్త పొడిచెత్తను వేరుచేయడం, బయోమెడికల్ వ్యర్థాల నిర్వహణపై భాగస్వామ్య పక్షాలతో ప్రత్యేక సమావేశాలు నిర్వహించాలని ఆదేశించారు. నిబంధనల ఉల్లంఘనలకు తీసుకునే చర్యలను కూడా స్పష్టంగా వివరించాలని కలెక్టర్ సూచించారు. కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లాస్థాయి అధికారులు పాల్గొన్నారు.