బీసీ కార్పొరేషన్ ఋణాల దరఖాస్తు గడువు పెంపు
ఈ నెల 12 వరకూ దరఖాస్తుల స్వీకరణ
2 నెలల్లో యూనిట్లు గ్రౌండయ్యేలా చర్యలు
రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న బీసీ కార్పొరేషన్ల రుణాలను గడువులోగా యూనిట్లు గ్రౌండింగ్ అయ్యేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత, జౌళి శాఖల మంత్రి ఎస్.సవిత స్పష్టం చేశారు. లబ్దిదారుల నుంచి వస్తున్న వినతులను దృష్టిలో పెట్టుకుని బీసీ, ఈడబ్ల్యూఎస్, కాపు సహా వివిధ కార్పొరేషన్ల ఆధ్వర్యంలో మంజూరు చేస్తున్న యూనిట్లకు రుణాల దరఖాస్తుల గడవును ఈ నెల 12 వ తేదీన వరకూ పొడిగిస్తున్నట్లు మంత్రి సవిత వెల్లడించారు. 2024-25 ఆర్థిక సంవత్సరం మరో 2 నెలల్లో ముగినుందని, తక్షణమే అర్హులను గుర్తించే ప్రక్రియ చేపట్టాలని స్పష్టం చేశారు. ప్రస్తుత ప్రభుత్వంలో కార్పొరేషన్లకు విధులతో పాటు నిధులు కూడా కేటాయించామన్నారు.
గడువు పెంపు లబ్ధిదారులకు తెలిసేలా చూడాలి
స్వయం ఉపాధి కల్పనకు స్వీకరిస్తున్న దరఖాస్తుల గడువును ఈ నెల 12 తేదీ వరకూ పొడిగించిన విషయంపై జిల్లాల్లో లబ్ధిదారులకు సమాచారమందించాలని మంత్రి సవిత సూచించారు. కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాల జారీలో ఆలస్యం చోటుచేసు కోకుండా తహసీల్దార్లతో సమన్వయం చేసుకోవాలన్నారు.