*ఎన్టీఆర్ జిల్లా (ఇబ్రహీంపట్నం), ఫిబ్రవరి 07, 2025*
ఎంఎస్ఎంఈ సర్వేలో వేగం పెంచండి
పారిశ్రామిక ఆర్ధిక వ్యవస్థ వృద్ధికి సర్వే ఎంతగానో ఉపయోగపడుతుంది
యజమానులకు ఆర్థికంగా చేయూతనిచ్చేందుకు దోహదం చేస్తుంది
యూనిట్ నిర్వహణను మెరుగుపరిచే శిక్షణ అందించేందుకూ వీలు జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ
రాష్ట్ర పారిశ్రామిక శాఖ మార్గదర్శకాలకు అనుగుణంగా చేపట్టిన సూక్ష్మ, చిన్న, మధ్యతరహా సంస్థల (ఎంఎస్ఎంఈ) సర్వేలో వేగం పెంచాలని జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ క్షేత్రస్థాయి సిబ్బందిని ఆదేశించారు.
శుక్రవారం కలెక్టర్ లక్ష్మీశ.. ఇబ్రహీంపట్నం మూలపాడులో గ్రామ సచివాలయ సిబ్బంది చేస్తున్న ఎంఎస్ఎంఈ సర్వే కార్యకలాపాలను పరిశీలించారు. వస్త్ర దుకాణం నడుపుతున్న ఓ మహిళ నుంచి వివరాలు సేకరించి, ఎంఎస్ఎంఈ (ఉద్యమ్) సర్వే యాప్లో పొందుపరిచే విధానాన్ని పరిశీలించారు. ప్రస్తుతం అమలవుతున్న వివిధ ప్రభుత్వ ఆర్థిక చేయూత పథకాలను ఉపయోగించుకొని వ్యాపారాన్ని విస్తరించుకోవడం ద్వారా ఆర్థిక స్వావలంబన దిశగా అడుగులేయొచ్చని ఈ సందర్భంగా కలెక్టర్ లక్ష్మీశ మహిళకు సూచించారు. ఈ సందర్భంగా కలెక్టర్ లక్ష్మీశ మాట్లాడుతూ పోటీతత్వ, ఆరోగ్యకర పారిశ్రామిక ఆర్థిక వ్యవస్థను పెంపొందించే లక్ష్యంతో ఈ సర్వేను చేపట్టడం జరిగిందన్నారు. పారిశ్రామిక యూనిట్ల అవసరాలపై స్పష్టమైన అవగాహనకు, ఎంఎస్ఎంఈ యూనిట్లలో సాంకేతిక వినియోగం, నిర్వహణ నైపుణ్యాల్లో లోపాలను గుర్తించి, సరిదిద్దేందుకు కూడా సర్వే ఫలితాలు దోహదం చేస్తాయని కలెక్టర్ లక్ష్మీశ పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో త్వరితగతిన సర్వేను పూర్తిచేసేందుకు అధికారులు, క్షేత్రస్థాయి సిబ్బంది కృషిచేయాలని ఆదేశించారు. జిల్లాలో చేపట్టిన పౌరుల మిస్సింగ్ డేటాను గృహ డేటాబేస్నకు అనుసంధానించే సర్వేని కూడా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ క్షేత్రస్థాయిలో పరిశీలించారు.