మణిపూర్ సీఎం బీరెన్ సింగ్ రాజీనామా
మణిపూర్ సీఎం బీరెన్ సింగ్.. తన పదవికి రాజీనామా చేశారు. ఆదివారం తన రాజీనామా లేఖను ఆ రాష్ట్ర గవర్నర్ అజయ్ భల్లాకు ఆయన అందజేశారు. కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాతో శనివారం సీఎం బీరెన్ సింగ్ సమావేశమయ్యారు. అనంతరం బీరెన్ సింగ్ ఈ నిర్ణయం తీసుకున్నారు. కొంత కాలంగా మణిపూర్లో అల్లర్లు జరుగుతోన్నాయి. దీంతో సీఎం బీరెన్ సింగ్పై విమర్శలు వెల్లువెత్తాయి.
2023, మే మాసంలో ఈశాన్య రాష్ట్రాల్లో ఒకటైన మణిపూర్లో రెండు తెగలు.. మైతేయి, కూకీ మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఈ ఘర్షణలో దాదాపు 300 మంది మరణించారు. వేలాది మంది నిరాశ్రయులయ్యారు. లక్షలాది మంది ప్రాణ భయంతో ఇతర ప్రాంతాలకు తరలిపోయారు. ఆ నాటి నుంచి రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితులు పూర్తిగా క్షీణించాయి. అలాంటి వేళ ఆ రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీరెన్ సింగ్ సారథ్యంలోని బీజేపీ ప్రభుత్వంపై విమర్శలు సైతం వెల్లువెత్తాయి.
ప్రభుత్వానికి పలు పార్టీలు తమ మద్దతును ఉపసంహరించుకొన్నాయి. అయినా మణిపూర్లో బీజేపీకి ఎమ్మెల్యేల సంఖ్య బలం బాగానే ఉంది. దీంతో ఆ పార్టీ అధికారంలో కొనసాగుతోంది. అయితే ముఖ్యమంత్రి బీరెన్ సింగ్ను మార్చాలంటూ ఆ పార్టీకి చెందిన పలువురు ఎమ్మెల్యేలు ఇప్పటికే న్యూఢిల్లీలోని అగ్రనాయకత్వానికి వరుస లేఖలు సంధించారు. అదీకాక.. బీరెన్ సింగ్పై సోమవారం అసెంబ్లీలో అవిశ్వాసం పెట్టేందుకు రంగం సిద్దమైంది. అలాంటి వేళ.. బీరెన్ సింగ్ తన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు.