జగ్గయ్యపేట, ఫిబ్రవరి 12, 2025
తక్కువ వ్యయంతో అధిక దిగుబడులు సాధించాలి
రైతులు పొలం పిలుస్తోంది కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలి
వ్యవసాయ శాస్త్రవేత్తలు, అధికారుల సూచనలు పాటించాలి
ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ
పంటల సాగు వ్యయాన్ని తగ్గించి, అధిక దిగుబడులతో పాటు మెరుగైన ఆదాయాలు పొందాలనే లక్ష్యంతో పొలం పిలుస్తోంది కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతోందని, ఈ కార్యక్రమాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ అన్నారు.
బుధవారం కలెక్టర్ లక్ష్మీశ.. జగ్గయ్యపేట మండలంలో పర్యటించి, క్షేత్రస్థాయిలో పలు అభివృద్ధి కార్యక్రమాలను పరిశీలించారు. ఇందులో భాగంగా అనుమంచిపల్లి గ్రామంలో నిర్వహించిన పొలం పిలుస్తోంది కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొని.. ప్రస్తుతం సాగులో ఉన్న పంటలు, ఉపయోగిస్తున్న ఎరువులు, వాటి లభ్యత తదితర వివరాలను రైతులను అడిగారు. రోజువారీ వ్యవసాయ కార్యకలాపాలు సజావుగా సాగేందుకు అవసరాలేంటో తెలుసుకున్నారు. వ్యవసాయ యంత్ర పరికరాల అవసరాన్ని, కోతుల బెడద గురించి రైతులు వివరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పొలం పిలుస్తోంది కార్యక్రమం ద్వారా రైతులు తాము సాగుచేస్తున్న పంటలకు సంబంధించి ఎప్పటికప్పుడు ఎదురయ్యే సమస్యలను క్షేత్రస్థాయిలో తెలుసుకొని, వాటి పరిష్కారానికి ప్రణాళికాయుత చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఆరోగ్య భద్రతకు భరోసా కల్పించేలా రైతులు ప్రకృతి వ్యవసాయ విధానాలను అనుసరించాలని, అవసరమైన సహాయ సహకారాలు అందించేందుకు జిల్లా అధికార యంత్రాంగం సిద్ధంగా ఉన్నట్లు పేర్కొన్నారు. అగ్రీ కనెక్ట్ కార్యక్రమం ద్వారా పాఠశాల విద్యార్థులను పొలానికి తీసుకెళ్లి ఇప్పటినుంచే పంటలు, నేలలు, భూసారం తదితర అంశాలపై అవగాహన కల్పిస్తున్నట్లు వివరించారు.
పూర్తిస్థాయిలో పనిచేసేలా ఎస్డబ్ల్యూపీ కేంద్రాలు
కలెక్టర్ లక్ష్మీశ జగ్గయ్యపేట మండలంలోని పోచంపల్లి గ్రామంలోని ఘన వ్యర్థాల ప్రాసెసింగ్ కేంద్రాన్ని (ఎస్డబ్ల్యూపీసీ) పరిశీలించారు. సేంద్రియ ఎరువు తయారీ ప్రక్రియను పరిశీలించారు. స్పష్టమైన లక్ష్యాన్ని నిర్దేశించుకుని కార్యకలాపాలు కొనసాగించాలని ఆదేశించారు.
జిల్లాలో 286 గ్రామ పంచాయతీల పరిధిలో ఉన్న 264 ఎస్డబ్ల్యూపీసీలను పూర్తిస్థాయిలో పనిచేసేలా చూస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. కేంద్రాలు లేని 22 గ్రామ పంచాయతీల్లో వాటి ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. ఏవైనా మరమ్మతులు అవసరమైతే వెంటనే పూర్తిచేసి, నిర్వహణలోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. అన్ని కేంద్రాల్లోనూ వర్మీ సీడింగ్ జరిగేలా అధికారులకు ఆదేశాలిచ్చినట్లు తెలిపారు.
కలెక్టర్ లక్ష్మీశ పోచంపల్లి గ్రామంలో డీఎంఎఫ్ నిధులతో చేపట్టిన 2.5 కి.మీ. బీటీ రోడ్డును పరిశీలించారు. రోడ్లకు సంబంధించిన కొలతలు, రికార్డులను పరిశీలించారు.
పర్యటనలో కలెక్టర్ వెంట అసిస్టెంట్ కలెక్టర్ శుభం నోఖ్వాల్,
పంచాయతీరాజ్ ఎస్ఈ జెడ్ రమేష్, వ్యవసాయ శాఖ ఏడీ భవాణి, మండల వ్యవసాయ అధికారి వి.వరలక్ష్మి తదితరులున్నారు.