రైతు ద్రోహి జగన్
రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత ఫైర్
అమరావతి రైతు ద్రోహి జగన్ అని, వైసీపీ పాలనలో ఏనాడూ అన్నదాతలను పట్టించుకున్న పాపాన పోలేదని రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత మండిపడ్డారు. మునిగిపోతున్న తన పార్టీని కాపాడుకోడానికి జగన్ వేస్తున్న పిల్లి మొగ్గలను ప్రజల గమనిస్తున్నారని, మరోసారి ఆయనను నమ్మే పరిస్థితే లేదని స్పష్టం చేశారు. ఈ మేరకు బుధవారం మంత్రి ఒక ప్రకటన విడుదల చేశారు. వైసీపీ 5 ఏళ్ల పాలనలో ఏనాడూ రైతులను పట్టించుకోలేదన్నారు. జగన్ అసమర్థ పాలన వల్ల గడిచిన 5 ఏళ్లలో ఎందరో రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారన్నారు. రైతులకు ధాన్యం బకాయిలు చెల్లించకుండా ముఖం చాటేసిన ఘనుడన జగన్ అని మండిపడ్డారు. తీవ్ర ఆర్థిక ఇబ్బందులున్నా… ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి రాగానే రైతుల ధాన్యం బకాయిలను సీఎం చంద్రబాబు చెల్లించారని మంత్రి తెలిపారు. వైసీపీ హయాంలోనే మిర్చి కనీస ధర 7 వేలుగా నిర్ణయించిన విషయాన్ని మంత్రి గుర్తు చేశారు. ధర నిర్ణయంపై అప్పట్లోనే రైతులు ఆందోళనకు దిగినా జగన్ పట్టించుకోలేదని, చివరకు మిర్చి ధరలు పడిపోయినా కొనుగోలు చేయలేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. రైతు వ్యతిరేకిగా, ద్రోహిగా ముద్రపడిన జగన్ ను ప్రజలు 11 సీట్లకే పరిమితం చేసి తగిన గుణపాఠం చెప్పారన్నారు. జగన్ అసమర్థతను గ్రహించిన వైసీపీ నేతలు ఒక్కొక్కరిగా వైసీపీని వీడిపోతున్నారన్నారు. దీంతో చేసేదేమీ లేక, పార్టీని కాపాడుకోడానికి రైతులపై మొసలి కన్నీరు కారుస్తూ మిర్చి రైతుల పరామర్శ పేరుతో కొత్త డ్రామా తెర తీశారన్నారు. జగన్ నమ్మే పరిస్థితిలో రైతులే కాదు వైసీపీ నేతలే లేరన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ఉందని ఎన్నికల అధికారులు హెచ్చరించినా, నియంతలా గుంటూరు మిర్చి యార్డుకెళ్లి నానా యాగీ చేశారన్నారు. జగన్ కు ప్రజాసామ్యంపైనా, చట్టాలపైనా గౌరవం లేదని మంత్రి సవిత ఆ ప్రకటనలో మండిపడ్డారు.