ఇకపై పేపర్లెస్ అడ్మినిస్ట్రేషన్
ఖచ్చితంగా ప్రక్షాళన జరగాలి
వచ్చే ఖరీఫ్కు దేశంలో నెంబర్ వన్గా ఉండేలా సివిల్ సప్లై డీఎస్వోలు, డీఎంలు సిద్ధం కావాలి
వర్క్షాప్లో మంత్రి నాదెండ్ల మనోహర్
విజయవాడ-19-2-2025 కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రజలకు అందిస్తున్న సేవల్లో లోపాలను గుర్తిస్తూ మరింత మెరుగైన సేవలందించేందుకు డీఎస్వోలు, డీఎంలు సిద్ధంగా ఉండాలని రాష్ట్ర ఆహారం, పౌరసరఫరాలు మరియు వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. విజయవాడ కానూరులోని సివిల్ సప్లై భవన్లో మంత్రి అధ్యక్షతన బుధవారం ఉదయం సివిల్ సప్లై జిల్లా అధికారులతో సమావేశం జరిగింది. ఈ సందర్భంగా మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ అధికారులందరూ కలిసి టీం స్పిరిట్తో పని చేద్దామని పిలుపునిచ్చారు. ప్రజలకు జవాబుదారీతనం పెంచే విధంగా పనిచేయాలని, ఇక్కడ సివిల్ సప్లై కార్పొరేషన్ సివిల్ సప్లై డిపార్ట్మెంట్ రెండు కలిసి ఓకే నిర్ణయంతో ముందుకు సాగాలని సూచించారు. ఏదైనా సమస్య వచ్చినప్పుడు నిలబడి మెరుగుగా పనిచేయడం తద్వారా అంతిమంగా వ్యవస్థ నిలబడాలని పేర్కొన్నారు. ప్రభుత్వం ధాన్యం కొనుగోలు ప్రారంభించిన తర్వాత మిల్లర్లకు వద్దు ప్రభుత్వానికే ధాన్యం అమ్ముతామనే పరిస్థితి రైతు నుంచి వచ్చిందన్నారు. ఇప్పటివరకు 5.21 లక్షల మంది రైతుల నుంచి 32 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశామని, రూ.7,522 కోట్లు విడుదల చేసినట్లు చెప్పారు. 24 గంటల్లోనే రూ.7,508 కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేయడం జరిగిందన్నారు. ధాన్యం సేకరణలో 30 వేల లారీల ద్వారా 37 వేల మంది హమాలీలు ధాన్యం సేకరణలో పాల్గొన్నారని తెలిపారు
టెక్నాలజీ వాడకంతో తొలిసారిగా 7337359375 నెంబర్కు హాయ్ అని వాట్సాప్ చేయడం ద్వారా ధాన్యం కొనుగోలు జరిగిందన్నారు. గత ఐదు సంవత్సరాలుగా నష్టపోయి, నమ్మకాన్ని కోల్పోయిన రైతుకు కూటమి ప్రభుత్వం భరోసా కల్పించిందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం దీపం-2 పథకాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తుందన్నారు. 93 లక్షల మంది గ్యాస్ బుకింగ్ చేసుకోగా రూ.714.57 కోట్ల నగదు లబ్ధిదారుల ఖాతాలో జమ చేసినట్లు చెప్పారు. గ్యాస్ డెలివరీ బాయ్స్ సిలిండర్ డెలివరీ సమయంలో అదనపు చార్జీలు వసూలు చేయకుండా చర్యలు చేపట్టాలని సూచించారు. ప్రభుత్వ విధానాలను ప్రజలకు చేరవేయడానికి, పథకాల అమలులో పారదర్శకత పెంచేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని మంత్రి నాదెండ్ల పిలుపునిచ్చారు. అందుకు ప్రజల్లో ఉన్న సందేహాలను నివృతి చేయాల్సిన బాధ్యత జిల్లా స్థాయి అధికారులదేనని స్పష్టం చేశారు. అందుకు తగ్గట్లుగా అధికారుల సిద్ధం కావాలని, క్షేత్రస్థాయిలో తగిన చర్యలు చేపట్టాలన్నారు. గ్యాస్ డెలివరీపై ఎటువంటి చార్జెస్ లేవు అనే విషయంపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. త్వరలో ఆన్లైన్ వ్యవస్థ తీసుకురాబోతున్నామని, అందుకు జిల్లా స్థాయి అధికారులు సిద్ధం కావాలన్నారు. క్షేత్రస్థాయిలో ప్రక్షాళన జరగాలని, గతంలో ఉన్న అలవాట్లు మారాలని ఆ విధంగా పౌరసరఫరాల జిల్లా స్థాయి అధికారులు నిర్ణయం తీసుకోవాలన్నారు. టెక్నాలజీని ఉపయోగించుకొని ఆన్లైన్ వ్యవస్థకు సిద్ధం కావాలన్నారు
జిల్లాస్థాయిలో ఈ ఆఫీస్, ఈ ఫైల్ కు పటిష్టమైన వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలన్నారు.
గత 25 సంవత్సరాల క్రితం తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు రేషన్ షాపు నుంచి ఒక బస్తా బియ్యం దారి మళ్ళితే వెంటనే ఫోన్ వచ్చేదని, ఈ విధంగా ప్రజలకు రేషన్ మాఫియాపై అవగాహన పెంచాలని సూచించారు. అదేవిధంగా MDU వాహనాలపై నిరంతరం పర్యవేక్షణ ఉండాలన్నారు.దేశంలో ఇప్పటికీ చాలామంది పేదవాళ్లు ఆహారం(ధాన్యం) కోసం ఎదురుచూస్తున్నారని తెలిపారు. వచ్చే అకడమిక్ సంవత్సరం నుంచి రాష్ట్రవ్యాప్తంగా మిడ్ డే మీల్స్, సోషల్ వెల్ఫేర్ హాస్టళ్ళకు పౌర సరఫరాల శాఖ నుంచి సన్న బియ్యాన్ని ప్రత్యేక ప్యాకింగ్తో అందించబోతున్నట్లు తెలిపారు. సమావేశంలో పౌరసరఫరాల శాఖ కమిషనర్ సౌరభ్ గౌర్, మేనేజింగ్ డైరెక్టర్ మనజీర్ జిలానీ, రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల నుండి సివిల్ సప్లై, తూనికలు-కొలతలు, విజిలెన్స్ అధికారులు పాల్గొన్నారు