ముంబై అభివృద్ధి అభినందనీయం.మంత్రి నారాయణ
అమరావతి దేశ ఆర్థిక రాజధాని ముంబయి నగర అభివృద్ధిలో అనుసరిస్తున్న విధానాలను ఏపీలో కూడా అమలు చేసేందుకు ప్రభుత్వం అధ్యయనం చేస్తుంది.. అక్కడి అధికారులు తీసుకుంటున్న ప్రణాళికలపై చర్చించేందుకు మంత్రి నారాయణ బృందం ముంబయిలో పర్యటించింది. ఈ సందర్భంగా గురువారం ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్మెంట్ అధారిటీ(ఎం.ఎం.ఆర్.డి.ఎ.) అధికారులతో మంత్రి నారాయణ, సీఆర్డీఎ కమిషనర్ కన్నబాబు, ఇతర అధికారులు సమావేశమయ్యారు. ఎం.ఎం.ఆర్.డి.ఎ. ప్లానింగ్ డైరెక్టర్ శంకర్ దేశ్ పాండే మంత్రికి ఘన స్వాగతం పలికారు. మహా ముంబయి నగరాన్ని ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేయడంలో ఎం.ఎం.ఆర్.డి.ఎ. కీలక పాత్ర వహిస్తుంది. ముంబయిలో రోడ్లు, మెట్రో రైలు, హౌసింగ్ ప్రాజెక్టులను కూడా ఈ సంస్థ చేపడుతుంది. పెరుగుతున్న జనాభాకు తగ్గట్లుగా రోడ్ల అభివృద్ధి, మెట్రో రైలు ప్రాజెక్టు ప్లానింగ్, రవాణా ప్రణాళికలు, ఇళ్ల నిర్మాణం ప్రణాళికాబద్ధంగా ఎలా చేపడుతుందనే అంశాలతో పాటు ముంబయి మహానగరంలో విదేశీ పెట్టుబడుల సహకారంతో మౌలిక వసతులను అభివృద్ధి చేస్తున్న విధానాన్ని పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా అక్కడి అధికారులు మంత్రి నారాయణకు వివరించారు. అలాగే భూములను అభివృద్ధి చేయడం ద్వారా నిధులను సమీకరిస్తున్న విధానాన్ని కూడా తెలియజేశారు. ప్రభుత్వ ప్రాజెక్టుల కోసం నిధుల సమీకరణ ఏవిధంగా చేస్తున్నారనే అంశాలను కూడా వివరించారు. ఆంధ్రప్రదేశ్లో అమరావతితో పాటు ఇతర నగరాలు, పట్టణాల అభివృద్ధిలో కొన్ని అంశాల్లో ముంబయి తరహా ప్రణాళికలను అమలు చేసే ఆలోచనలో ఉన్నారు. ఈ విషయమై సీఎం చంద్రబాబుతో చర్చించిన అనంతరం ఆయా అంశాలపై ఒక నిర్ణయానికి రానున్నారు.