ఎన్టీఆర్ జిల్లా, ఫిబ్రవరి 21, 2025
పీఎం సూర్యఘర్ మండల లక్ష్యాలపై దృష్టిపెట్టండి
– *సౌర ఫలకాల ఏర్పాటును వేగవంతం చేయండి*
– *ఎప్పటికప్పుడు అమలు పురోగతిపై ప్రత్యేకంగా సమీక్ష*
– *ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ*
పీఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన పథకం కింద రిజిస్ట్రేషన్లతో పాటు సౌర ఫలకాల ఏర్పాటు (ఇన్స్టలేషన్)పై ప్రతి మండలానికి నిర్దేశించిన లక్ష్యాలపై అధికారులు దృష్టిసారించాలని, పథకం అమలు పురోగతిపై ఎప్పటికప్పుడు ప్రత్యేకంగా సమీక్ష నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ స్పష్టం చేశారు.
శుక్రవారం కలెక్టర్ లక్ష్మీశ కలెక్టరేట్ శ్రీ పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో పీఎం సూర్యఘర్ పథకం అమలుపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఇప్పటివరకు జరిగిన రిజిస్ట్రేషన్లతో పాటు ఇన్స్టలేషన్స్పైనా చర్చించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజలకు కరెంటు బిల్లుల భారాన్ని తప్పించేందుకు, పర్యావరణ పరిరక్షణకు, పునరుత్పాదక ఇంధన వనరుల వినియోగానికి వీలుకల్పించే ఈ పథకాన్ని ఇంటింటికీ చేర్చేందుకు కృషిచేయాలని, జిల్లాలోని ఏడు లక్షల విద్యుత్ సర్వీసుల్లో కనీసం రెండు లక్షల ఇళ్లకు సూర్యఘర్ కనెక్షన్లు ఇవ్వడాన్ని లక్ష్యంగా నిర్దేశించుకున్న నేపథ్యంలో విద్యుత్, గ్రామీణాభివృద్ధి విభాగాల అధికారులు, బ్యాంకర్లు, వెండర్లు.. ఇలా వివిధ భాగస్వామ్య పక్షాలు సమష్టిగా కృషిచేయాల్సిన అవసరముందన్నారు. ఇప్పటికే 75 వేల రిజిస్ట్రేషన్లు వచ్చినందున ఇందుకు అనుగుణంగా త్వరితగతిన సౌర ఫలకాల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని, బ్యాంకులు రుణ మంజూరును వేగవంతం చేయాలని పేర్కొన్నారు. వెండర్లకు బ్యాంకర్లకు మధ్య పటిష్ట సమన్వయం అవసరమని స్పష్టం చేశారు. జిల్లాలో ఆదర్శ సౌర గ్రామాలుగా గుర్తించిన బూదవాడ (జగ్గయ్యపేట), వెల్వడం (మైలవరం), పరిటాల (కంచికచర్ల), కంభంపాడు (ఎ.కొండూరు), షేర్ మహమ్మద్ పేట (జగ్గయ్యపేట) గ్రామాల్లో సోలార్ ప్యానెళ్ల ఏర్పాటు లక్ష్యాలపై ప్రత్యేకంగా దృష్టిసారించాలని, త్వరితగతిన 100 శాతం లక్ష్యాన్ని చేరుకోవాలని ఆయా మండలాల ఎంపీడీవోలు, ఏఈలను కలెక్టర్ లక్ష్మీశ ఆదేశించారు.
సమావేశంలో విద్యుత్ శాఖ ఎస్ఈ ఎ.మురళీమోహన్, డీఆర్డీఏ పీడీ కె.శ్రీనివాసరావు, సూర్యఘర్ నోడల్ అధికారి ఎం.భాస్కర్, ఏపీ సీపీడీపీఎల్ ఈఈ, డీఈ, ఏఈలతో పాటు వివిధ బ్యాంకుల ప్రతినిధులు, వెండర్లు హాజరయ్యారు.