*ఎన్టీఆర్ జిల్లా, ఫిబ్రవరి 21, 2025*
హోటళ్ల స్వచ్ఛతా ప్రమాణాలకు గ్రీన్ లీఫ్ రేటింగ్
– *లాడ్జిలు, ఇతర ఆతిథ్య సౌకర్యాలకూ ర్యాంకింగ్ వ్యవస్థ*
– *వన్ లీఫ్, త్రీ లీఫ్, ఫైవ్ లీఫ్ స్టేటస్ ఇచ్చేందుకు కార్యాచరణ*
– *డివిజన్, జిల్లాస్థాయిలో ప్రత్యేక కమిటీల ఏర్పాటు*
– *జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ*
పర్యావరణ హిత స్వచ్ఛత, పారిశుద్ధ్యంలో అత్యుత్తమ ప్రమాణాలు పాటిస్తూ పర్యాటకులకు మధురానుభూతులు మిగిల్చే హోటళ్లు, లాడ్జిలు వంటివాటికి ప్రభుత్వం గ్రీన్ లీఫ్ రేటింగ్ ఇవ్వనుందని జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ తెలిపారు.
శుక్రవారం కలెక్టర్ డా. జి.లక్ష్మీశ అధ్యక్షతన కలెక్టరేట్ శ్రీ పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో స్వచ్ఛతా గ్రీన్ లీఫ్ రేటింగ్ సిస్టమ్ (ఎస్జీఎల్ఆర్ఎస్)పై వివిధ శాఖల అధికారులతో సమన్వయ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ లక్ష్మీశ మాట్లాడుతూ దేశ, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థలో ఆతిథ్య రంగం కీలకమైందని.. స్థానిక సమాజం, పర్యావరణాన్ని దృష్టిలో ఉంచుకొని బాధ్యతాయుత పర్యాటకంలో భాగంగా ఆతిథ్య రంగంలో సురక్షిత పారిశుద్ధ్య నిర్వహణను ప్రోత్సహించేందుకు గ్రీన్ లీఫ్ రేటింగ్ వ్యవస్థను ఆవిష్కరించినట్లు వివరించారు. హోటళ్లు, లాడ్జీలు, హోమ్స్టేలు, ధర్మస్థలాలు తదితర ఆతిథ్య సౌకర్యాలకు గ్రీన్ లీఫ్ రేటింగ్ ఇవ్వడం జరుగుతుందని.. వన్ లీఫ్ రేటింగ్ పొందాలంటే ఘన వ్యర్థాలు, మానవ వ్యర్థాలు, మురుగునీటి నిర్వహణలో 100-130 మార్కులు రావాలని, అదేవిధంగా త్రీ లీఫ్ రేటింగ్కు 130-180 మార్కులు, ఫైవ్ లీఫ్ రేటింగ్కు 180-200 మార్కులు సాధించాల్సి ఉంటుందని వివరించారు. రేటింగ్కు సిఫార్సు చేసేందుకు వీలుగా జిల్లాస్థాయిలో కలెక్టర్ అధ్యక్షతన గ్రామీణ నీటి సరఫరా విభాగం సూపరింటెండింగ్ ఇంజనీర్ కన్వీనర్గా, జిల్లా పర్యాటక అధికారి సభ్య కార్యదర్శిగా కమిటీ ఉంటుందని, అదేవిధంగా డివిజన్ స్థాయిలో ఆర్డీవో ఛైర్మన్గా వెరిఫికేషన్ ఉప కమిటీ ఉంటుందని తెలిపారు. ముందుగా హోటళ్లు, లాడ్జీలు తదితరాలను స్వచ్ఛ భారత్ అభియాన్ (గ్రామీణ్) వెబ్సైట్ ద్వారా మ్యాపింగ్ చేయాల్సి ఉందని, ఆయా యాజమాన్యాలకు డివిజన్ స్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించి, రేటింగ్ వ్యవస్థ గురించి వివరించాలని అధికారులను ఆదేశించారు. జిల్లాస్థాయిలోనూ వర్క్షాప్లతో పాటు శిక్షణ కార్యక్రమాలపైనా దృష్టిసారించాలని స్పష్టం చేశారు. ఈ ఏడాది అక్టోబర్ 2 నాటికి రాష్ట్ర వ్యాప్తంగా కనీసం వెయ్యి ఆతిథ్య లొకేషన్లకు ర్యాంకింగ్స్ ఇవ్వాల్సి ఉందని.. ఈ నేపథ్యంలో జిల్లాస్థాయిలో ర్యాంకింగ్కు సంబంధించిన కార్యకలాపాలను వేగవంతం చేయాలని ఆదేశించారు. ఈ రేటింగ్స్ వల్ల పర్యాటకులతో పాటు ఆయా హోటళ్ల యాజమాన్యాలకు ప్రయోజనం ఉంటుందని.. అమరావతికి గేట్ వే వంటి విజయవాడలో ఎక్కువ హోటళ్లు, లాడ్జ్లు మంచి గ్రీన్ లీఫ్ రేటింగ్ సాధించి, పర్యాటకం పరంగా, ఆతిథ్యం పరంగా జిల్లాను ముందునిలిపేందుకు భాగస్వామ్య పక్షాలు కృషిచేయాలని కలెక్టర్ లక్ష్మీశ సూచించారు.
సమావేశంలో గ్రామీణ నీటి సరఫరా ఎస్ఈ ఎస్.విద్యాసాగర్, జెడ్పీ సీఈవో కె.కన్నమనాయుడు, ఏపీ హోటల్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఆర్వీ స్వామి, ఏపీ టీడీసీ డివిజనల్ మేనేజర్ చైతన్య, జిల్లా పర్యాటక అధికారి ఎ.శిల్ప, గ్రామవార్డు సచివాలయాల ప్రత్యేక అధికారి జి.జ్యోతి, డీపీవో పి.లావణ్య కుమారి, జిల్లా టూర్స్ అండ్ ట్రావెల్స్ అసోసియేషన్ ప్రతినిధి టి.రవికుమార్, డీఎల్డీవోలు తదితరులు హాజరయ్యారు. విజయవాడ ఆర్డీవో కె.చైతన్య, తిరువూరు ఆర్డీవో కె.మాధురి, నందిగామ ఆర్డీవో కె.బాలకృష్ణ వర్చువల్గా సమావేశానికి హాజరయ్యారు.