Home Political news
4
0

 జగన్ ప్రభుత్వంలో దళితులపై దమనకాండ

 దాడులు, దౌర్జన్యాలు, దాష్టీకాలతోనే ఐదేళ్ల పాలన

న్యాయం చేయాలంటూ హోంమంత్రి కి ‘విదసం’ వినతి

 సమగ్ర దర్యాప్తు జరిపిస్తానని భరోసానిచ్చిన హోంమంత్రి

నా ఎస్సీలు అంటూనే  జగన్ తన ఐదేళ్ల అధికారాన్ని దళితులపై దమనకాండ చేయడానికే  వాడుకున్నారంటూ ‘విదసం’ ఆవేదన వ్యక్తం చేసింది. పాయకరావపేట నియోజకవర్గంలోని హోంమంత్రి క్యాంపు కార్యాలయంలో హోంమంత్రి అనితని కలిసి ‘విదసం’ నేతృత్వంలో దళితులు తమ గోడును వెల్లబోసుకున్నారు. అన్యాయంగా అక్రమకేసులు పెట్టి వేధించిన తమకు న్యాయం చేయాలంటూ హోంమంత్రిని కలిసి బాధితులు కన్నీరుమున్నీరయ్యారు. గత ప్రభుత్వ హయాంలో తీవ్ర మనోవేదనకు గురైన దళిత బాధిత కుటుంబాలకు కూటమి ప్రభుత్వం న్యాయం చేయాలని వినతి పత్రం అందించి విజ్ఞప్తి చేశారు. ప్రధానంగా రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపిన కోడి కత్తి కేసు, వీధి సుబ్రమణ్యం, వేంకటాయ పాలెం శిరోముండనం, విశాఖ జైల్లో దళితుడి ఆకస్మిక మరణం వంటి  కేసులకు సంబంధించి బాధిత కుటుంబసభ్యులు హోంమంత్రిని కలిశారు. విదసం నాయకులు డాక్టర్ బూసి వెంకట రావు నేతృత్వంలో హోం మంత్రి అనిత ను కలిసి కేసుల పై మళ్ళీ  వేగమైన విచారణ జరిపి బాధితులను త్వరగా  ఆదుకోవాలని కోరారు.

2018లో ఎయిర్ పోర్టులో నాటి ప్రతిపక్షనేత జగన్ పై  కోడి కత్తితో దాడి చేసిన కేసు నిందితుడు శ్రీనివాసరావు, వైసీపీ నాయకుడు అనంతబాబు చేతిలో హత్యకు గురైన వీధి సుబ్రమణ్యం తల్లిదండ్రులు నూక రత్నం, సత్తి బాబు , వైసీపీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు చేతిలో శిరోముండనం కాబడిన పట్టాభి, జైలు అధికారులు నిర్లక్ష్యం వల్ల ఆకస్మికంగా మృతి చెందిన ఉప్పాడ గౌరీ శంకర్ తల్లి నర్సయ్యమ్మ తదితర భాదితులు విదసం ( విస్తృత దళిత సంఘాల) ఐక్య వేదిక ఆధ్వర్యంలో హోంమంత్రి క్యాంపు కార్యాలయం చేరి ఈ మేరకు శనివారం వినతి పత్రం అందజేశారు.. 

ఈ కేసుల స్థితిగతులు , బాధితుల ఇబ్బందులను  బూసి వెంకట రావు హోంమంత్రి కు వివరిస్తూ వీధి సుబ్రమణ్యం హత్య కేసులో నాటి ఎస్పి, ఇతర అధికారులు లోతైన విచారణ జరపకుండా నిందితుల జాబితాను కుదించి కేసు వీగిపోయేలా అనంతబాబును ఒక్కడినే అరెస్టు చేసి మిగతావారందరినీ వదిలేశారని ఈ కేసుపై మరోసారి దర్యాఫ్తు చేయాలని కోరారు.

కోడి కత్తి కేసులో టెర్రరిస్టు కుట్ర, రాజకీయ కుట్ర లేదని ఎన్ ఐ ఎ రిపోర్ట్ ఇచ్చినందున కేసును రాష్ర్ట పోలీసులకు బదిలీ చేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు.

వేంకటాయిపాలెం శిరోముండనం కేసులో తోట త్రిమూర్తులు క్రిమినల్ అప్పీల్ పై ప్రభుత్వం క్రాష్ అప్పీల్ వేయాలని విశాఖ సెంట్రల్ జైళ్లో గత ఏడాది జూలైలో జరిగిన కస్టోడియల్ మరణంపై మెజిస్టిరియల్ విచారణ జరపాలని హోంమంత్రికి విజ్ఞప్తి చేశారు.

బాధితులందరి ఆవేదనను విన్న హోంమంత్రి అనిత వారి వినతుల పట్ల సానుకూలంగా స్పందించారు. వైఎస్ జగన్ ఆకృత్యాలకు బలైన  దళితుల కేసులను పునర్విచారణ చేయిస్తానని వారికి భరోసానిచ్చారు. బాధితుల కేసులపై ఎస్పీల నుండీ నివేదిక తెప్పించుకుని తదనుగుణంగా న్యాయం చేసే విధంగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. 

ఈ కార్యక్రమంలో జాజి ఓంకార్, గుడాల ఈశ్వర రావు, బూల భాస్కర్ రావు, పిట్టా వర ప్రసాద్ పాల్గొన్నారు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here