రైతాంగం సంక్షేమమే లక్ష్యంగా చిత్తశుద్ధితో పనిచేస్తున్నాం
– మార్కెట్ను బట్టి రైతులకు గిట్టుబాటు ధర
– 24 గంటల్లోపే ధాన్యం నగదు చెల్లింపులు
– గత ప్రభుత్వ బకాయిలు రూ.361 కోట్లను మిల్లర్లకు చెల్లించాం
– మిల్లర్లు బాధ్యతగా వ్యవహరించకపోతే ఊరుకోం..కేసులు నమోదుచేస్తాం
– నూటికి నూరుశాతం రైతుల పక్షాల నిలబడతాం
– నెల్లూరుజిల్లాలో గత ప్రభుత్వం చెల్లించాల్సిన రవాణా, హమాలీ చార్జీలను రెండురోజుల్లో చెల్లిస్తాం
– రాష్ట్ర పౌరసరఫరాలశాఖ మంత్రి నాదెండ్ల మనోహర్
– మంత్రి ఆనం, ఎంపీ వేమిరెడ్డితో కలిసి సంగంలో అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు
నెల్లూరు / సంగం, ఫిబ్రవరి 22 : రైతుల సంక్షేమమే లక్ష్యంగా ఎన్డిఎ కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో నిజాయితీగా పనిచేస్తోందని రాష్ట్ర ఆహార, పౌర సరఫరాలు, వినియోగదారుల వ్యవహరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. శనివారం ఉదయం సంగం మండలంలో మంత్రి ఆనం రామనారాయణరెడ్డి, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకరరెడ్డితో కలిసి మంత్రి నాదెండ్ల పలు ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. సంగం మండల కేంద్రంలో 20.50 లక్షలతో నిర్మించిన ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం భవనం, గోదాములు, ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మంత్రి నాదెండ్ల ప్రారంభించారు. ఈ సందర్భంగా రైతులనుద్దేశించి మంత్రి నాదెండ్ల మాట్లాడుతూ ఇది రైతు సంక్షేమ ప్రభుత్వమన్నారు. ప్రతి విషయంలోనూ రైతులకు మంచి చేసేందుకు నిజాయితీగా పనిచేస్తున్నట్లు చెప్పారు. రైతులకి మార్కెట్ని బట్టి మద్దతు ధర అందించేలా కృషి చేస్తామన్నారు. ఖరీఫ్ సీజన్ లో 33 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగులు చేసి 5.87 లక్షల మంది రైతులకు 24 గంటల్లో 7480 కోట్ల రూపాయలు జమచేసినట్లు చెప్పారు. గత ప్రభుత్వంలో నెల్లూరు జిల్లాలో 32కోట్ల రూపాయల రైతుల సొమ్ముని స్కామ్ చేసి దోచేశారన్నారు. గత ప్రభుత్వ పాలకులు వ్యవస్థలను దుర్వినియోగం చేసి రైతులను మోసం చేసినట్లు చెప్పారు. గత ప్రభుత్వం మిల్లర్లకు చెల్లించాల్సిన బకాయిలు రూ.361 కోట్లను తమ ప్రభుత్వం చెల్లించిందన్నారు. నెల్లూరు జిల్లాకు సంబంధించి మిల్లర్లకు రూ. 10 కోట్లు చెల్లించామన్నారు. అలాగే రైతులకు సంబంధించి గత ప్రభుత్వం ధాన్యం సేకరించి డబ్బులు చెల్లించకుండా, 1674 కోట్లు బకాయి పెట్టిందని, తమ ప్రభుత్వం ఆ బకాయిలను రైతులకు చెల్లించిందని చెప్పారు. నెల్లూరు జిల్లాకు సంబంధించి గత ప్రభుత్వం బకాయి పెట్టిన రవాణా, హమాలి చార్జీలు రూ. 1.40 కోట్లు రెండు రోజుల్లో రైతుల ఖాతాలో జమ చేస్తామని చెప్పారు. ధాన్యం కొనుగోలుకు సంబంధించి గత ఏడాది కంటే ఈ ఏడాది నాలుగు లక్షల మెట్రిక్ టన్నులు అదనంగా కొనుగోలు చేసి 24 గంటల్లోపే డబ్బులు చెల్లించామని చెప్పారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా రైతాంగానికి అన్నివిధాలా అండగా నిలుస్తామన్నారు. రైసుమిల్లుల యజమానులు బాధ్యతగా పనిచేయాలని, రైతుల్ని ఇబ్బంది పెడితే సహించమని, వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. మధ్యాహ్న భోజనపథకానికి వచ్చే విద్యాసంవత్సరం నుంచి సన్నబియ్యాన్ని సరఫరా చేయబోతున్నట్లు చెప్పారు. రైతులు భయాందోళనకు గురయ్యేలా కొంతమంది అసత్య ప్రచారాలు చేస్తున్నారని, వీటిని నమ్మవద్దన్నారు. నూటికి నూరుశాతం రైతుల పక్షాల పనిచేసే ప్రభుత్వం కూటమి ప్రభుత్వమని మంత్రి చెప్పారు. నెల్లూరు జిల్లాలో 50వేల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. మార్చి నెల ఒకటో తేదీ నుంచి జిల్లాలో సుమారు 300 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా 32 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరిస్తుండగా, 25 లక్షల ధాన్యాన్ని పిడిఎస్ బియ్యానికి వినియోగిస్తున్నట్లు చెప్పారు. గత ప్రభుత్వంలో మూడు వేల మందికి పైగా రైతులు ఆత్మహత్య చేసుకున్నారని, వారందరికీ కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఒక్కొక్కరికి లక్ష రూపాయలు చొప్పున 1871 మందికి ఆర్థిక సహాయం అందించారని చెప్పారు. తేమశాతం 17 కంటే ఎక్కువగా ఉంటే ఒక కేజీ నుంచి ఐదు కేజీల వరకు మాత్రమే ధాన్యం తీసుకోవాలని, అంతకు మించితే కేసులు నమోదు చేసి చర్యలు తీసుకుంటామని రైస్ మిల్లర్లను హెచ్చరించారు.
*జిల్లాలో 30లక్షల గోతాలు అందిస్తాం*
– తేమ శాతం నిర్ధారించేందుకు ఒకే కంపెనీ మిషన్లు
– క్షేత్రస్థాయిలో అధికార యంత్రాగం అందుబాటులో ఉంటుంది
– అక్రమాలకు పాల్పడే మిల్లర్లపై చర్యలు తీసుకుంటాం :
– రైతుల ముఖాముఖీలో మంత్రి నాదెండ్ల
జిల్లాలో ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి రైతులకు ఇబ్బందులు లేకుండా 30 లక్షల గోతాలను అందిస్తామవి రాష్ట్ర పౌర సరఫరాలశాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ చెప్పారు. సంగంలో రైతులతో ముఖాముఖిగా మంత్రి మాట్లాడారు. ఈ సందర్భంగా పలు సమస్యలను రైతులు మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. క్షేత్రస్థాయిలో ధాన్యం కొనుగోళ్లు ప్రభుత్వం చెప్పినవిధంగా జరగడం లేదన్నారు. మిల్లర్లు ఇబ్బందులు పెడుతున్నారని, తేమశాతం పేరుతో ఎక్కువ కిలోల తరుగు తీసుకుంటున్నారని చెప్పారు. గోతాలు అందుబాటులో వుండడం లేదన్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోనే తేమ శాతం నిర్ధారించి, ఆ శాతానికే మిల్లర్లు కొనుగోలు చేసేలా చర్యలు చేపట్టాలన్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో స్లిప్పు ఇచ్చిన తరువాత మిల్లర్లను బతిమిలాడే పరిస్థితి లేకుండా చేయాలన్నారు. వ్యవసాయ ఖర్చులు కూడా బాగా పెరిగిపోయాయని, గిట్టుబాటు ధర పెంచాలని విజ్ఞప్తి చేశారు. కౌలు రైతులకు అండగా నిలవాలన్నారు. రైతుల సమస్యలపై సానుకూలంగా స్పందించిన మంత్రి నాదెండ్ల పలు సమస్యలకు పరిష్కారం చూపేలా చర్యలు చేపడ్తామన్నారు. తేమ శాతాన్ని నిర్ధారించేందుకు ఒకే కంపెనీ మిషన్లు అందుబాటులో తీసుకొస్తామన్నారు. ప్రతి మండలానికి కూడా ఒక డ్రయర్ అందించేందుకు, ఉపాధి హామీ నిధులతో ప్రభుత్వ భూముల్లో సిమెంట్ కల్లాలు ఏర్పాటు చేసేందుకు ఆలోచన చేస్తున్నట్లు చెప్పారు. 50% సబ్సిడీతో టార్పాలిన్ పట్టలను రైతులు అందిస్తామని చెప్పారు. కౌలు రైతులకు మేలు జరిగేలా కౌలు రైతు చట్టంలో మార్పులు చేస్తూ రైతు భరోసా వచ్చేలా నూతన చట్టాన్ని తీసుకొస్తామని మంత్రి చెప్పారు.
*పట్టుదల, నిజాయితీ గల నేత మంత్రి ఆనం రామనారాయణరెడ్డి : నాదెండ్ల*
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 2004వ సంవత్సరంలో తాను శాసనసభ్యుడిగా వున్నప్పటి నుంచే ఆనం వివేకానందరెడ్డి, ఆనం రామనారాయణరెడ్డి, గారితో మంచి అనుబంధం వుందని, తనను సొంత కుటుంబసభ్యుడిగా చూసుకుంటూ రాజకీయంగా తనను ఆనం కుటుంబం ముందుండి నడిపించిందని పౌరసరఫరాల మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. మంత్రిగా, ఎమ్మెల్యేగా ఆత్మకూరు అభివృద్ధికి ఆనం రామనారాయణరెడ్డి పట్టుదలతో, నిజాయితీతో పనిచేస్తున్నారని, వందల కోట్ల రూపాయల నిధులను వెచ్చిస్తున్నారని చెప్పారు. కుటుంబ నేపథ్యం వున్నప్పటికీ అంకితభావంతో పనిచేయడంతోనే ఇవన్నీ సాధ్యమని నాదెండ్ల అన్నారు.
*గత ప్రభుత్వంలో రైతుల బాధలు వర్ణణాతీతం*
– తాము పూర్తిచేసిన ప్రాజెక్టులకు పేర్లు పెట్టుకుని ప్రారంభించుకున్నారు
– సంగంలోని ప్రాథమిక వ్యవసాయసహకార సంఘాన్ని రాజకీయ కేంద్రంగా వాడుకున్నారు
– రైతులకు అండగా నిలవడమే కూటమి ప్రభుత్వ లక్ష్యం
– మంత్రి ఆనం రామనారాయణరెడ్డి
రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి మాట్లాడుతూ ఆత్మకూరుతో మంత్రి నాదెండ్ల మనోహర్కు మంచి అనుబంధం వుందన్నారు. 1983లో నాదెండ్ల మనోహర్ తండ్రి నాదెండ్ల భాస్కర్రావు రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రిగా ఈ ప్రాంతంలో ఆనాటి ఎమ్మెల్యే ఆనం వెంకటరెడ్డి హయాంలో ఆత్మకూరులో తాగునీటి పథకానికి శంకుస్థాపన చేశారని, ఇప్పుడు తాను మంత్రిగా, ఎమ్మెల్యేగా వుండడం, మంత్రిగా నాదెండ్ల మనోహర్ తన నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనడం సంతోషంగా వుందన్నారు. గత ప్రభుత్వ హయాంలో రైతుల పడిన బాధలు వర్ణణాతీతంగా మంత్రి చెప్పారు. ధాన్యం అమ్ముకోవాలంటే రైసుమిల్లుల వద్ద నాలుగైదు రోజులపాటు తిండితిప్పలు లేకుండా రైతులు ఎన్నో కష్టాలు పడ్డారన్నారు. ఆ ప్రభుత్వంలో పడిన కష్టాలు పడకుండా రైతుల ప్రయోజనాలే లక్ష్యంగా తమ ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. తమ ప్రభుత్వం 90శాతం పూర్తి చేసిన సంగం, నెల్లూరు ఇరిగేషన్ ప్రాజెక్టులకు గత ప్రభుత్వం తమ పేర్లు పెట్టుకుని ప్రారంభోత్సవాలు చేసుకుందన్నారు. అయినా పూర్తిస్థాయిలో పనులుచేయలేదన్నారు. సంగం రోడ్డు కం బ్యారేజ్ని నిర్మించేందుకు తాను ఆర్థికమంత్రిగా 130కోట్ల రూపాయలను మంజూరు చేస్తే కేవలం సంగం బ్యారేజ్ను మాత్రమే పూర్తి చేసి రోడ్డును నిర్మించలేదన్నారు. ఈ రోడ్డును పూర్తి చేసి జాతీయ రహదారికి అనుసంధానం చేయాల్సి వుందన్నారు. సీఎం గారితో కూడా ఈ విషయమై చర్చించినట్లు చెప్పారు. మంత్రి నాదెండ్ల మనోహర్ రైతులకు మేలు చేయాలనే చిత్తశుద్ధితో ముందుకు వెళుతున్నారని, అన్నదాతలకు అన్నివిధాల తమ ప్రభుత్వం హయాంలో మంచి జరుగుతుందన్న నమ్మకం, విశ్వాసం తమకు వుందన్నారు. ఆ దిశగా అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. మెట్టప్రాంతాన్ని డెల్టాగా మార్చి పుష్కలంగా పంటలు పండేలా సమృద్ధిగా నేడు సాగునీరు రైతులకు అందేలా చేశామన్నారు. సంగంలోని ప్రాథమిక సహకార సంఘాన్ని గతంలో రాజకీయ కేంద్రంగా వినియోగించుకున్నారని, తాము రైతులకు ఉపయోగపడేలా తీర్చిదిద్దినట్లు చెప్పారు. బ్యారేజ్ వద్ద బ్రిడ్జిని పూర్తిచేయాలని, ఆత్మకూరులో వున్న ఐటిఐ కళాశాలను సంగంలో ఏర్పాటు చేసేలా చర్యలు చేపట్టాలని మంత్రి ఈ సందర్భంగా కోరారు.
*రైతుల ప్రయోజనాలే ఎన్డిఎ ప్రభుత్వ లక్ష్యం : ఎంపీ వేమిరెడ్డి*
ఎంపీ వేమిరెడ్డి ప్రభాకరరెడ్డి మాట్లాడుతూ రైతుల ప్రయోజనాల కోసం కేంద్ర ప్రభుత్వ భాగస్వామ్యంతో రాష్ట్రంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలను నిర్మిస్తున్నట్లు చెప్పారు. జిల్లాలో 3.50 లక్షల ఎకరాల్లో వరిపంట వేశారని, 11మిలియన్ టన్నుల ధాన్యం పండే అవకాశం వుందన్నారు. ఈ ధాన్యాన్ని నిల్వ చేసుకునేందుకు జిల్లాలో వ్యవసాయ గోడౌన్లను నిర్మిస్తున్నట్లు చెప్పారు. జిల్లాలో 78 సహకార సంఘాలు వున్నాయని, వీటి పరిధిలో దళారుల ప్రమేయం లేకుండా ధాన్యం విక్రయించుకునేందుకు జిల్లాలో 298 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. రైతుకు మంచి గిట్టుబాటు ధర అందించేందుకు ప్రభుత్వం దృఢసంకల్పంతో పనిచేస్తుందన్నారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర టిడ్కో చైర్మన్ వేములపాటి అజయ్కుమార్, రాష్ట్ర వక్ప్బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్, రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ డైరెక్టర్ వేమిరెడ్డి పట్టాభిరామిరెడ్డి, జాయింట్ కలెక్టర్ కార్తీక్, ఆర్డీవో పావని, జిల్లా వ్యవసాయాధికారి సత్యవాణి, డిసివో గుర్రప్ప, ఎన్డిసిసి బ్యాంకు సిఇవో శ్రీనివాసరావు, సంగం పిఎసిఎస్ చైర్మన్ కట్టా సుబ్రహ్మణ్యం, సిఇవో దస్తగిరి అహ్మద్, తహశీల్దార్ సోమ్లానాయక్, సర్పంచ్ రమణమ్మ తదితరులు పాల్గొన్నారు.