26.02.2025
మహా శివరాత్రిని పురస్కరించుకుని శివయ్యకు మల్లాది విష్ణు ప్రత్యేక పూజలు
పరమశివునికి ప్రీతిపాత్రమైన మహా శివరాత్రిని పురస్కరించుకుని బుధవారం శివాలయాలన్నీ ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి. ముత్యాలంపాడు షిరిడీ సాయిబాబా మందిరం భక్తజన సంద్రమైంది. తెల్లవారు జామునుంచే పెద్ద సంఖ్యలో భక్తులు శివయ్యను దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించి మహాశివుడిని ప్రసన్నం చేసుకున్నారు. ఈ సందర్భంగా దేవస్థానంలో నిర్వహించిన సర్వదేవతా హోమాలు, పూర్ణాహుతిలో వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, వైసీపీ నేత పూనూరు గౌతమ్ రెడ్డి పాల్గొన్నారు. తొలుత సాయిబాబా దర్శనం చేసుకున్నారు. అనంతరం వేద పండితుల మంత్రోచ్ఛరణల మధ్య శివలింగానికి రుద్రాభిషేకం నిర్వహించారు. మహా శివరాత్రిని పురస్కరించుకుని స్వామి వారిని దర్శించుకోవడం సంతోషంగా ఉందని మల్లాది విష్ణు అన్నారు. సృష్టి లయకారుడు, ఓంకార స్వరూపుడైన శంకరుని భక్తి ప్రపత్తులతో ధ్యానిస్తే కష్టాలన్నీ తొలగిపోయి.. సకల శుభాలు కలుగుతాయన్నారు. ఆ ముక్కంటి కరుణా కటాక్షాలు నియోజకవర్గ ప్రజలపైన, వైఎస్ జగన్మోహన్ రెడ్డిపైన ఎల్లవేళలా ఉండాలని కాంక్షించారు. తదనంతరం వేదపండితులు ఆశీర్వచనాలు పలికి పరమశివుని తీర్థప్రసాదాలు అందజేశారు. ఆయన వెంట పట్టాభిరామ్, చల్లా సుధాకర్, వెన్నం రత్నారావు, ప్రేమ్, కోలంటి రవి, మాతా మహేష్, తదితరులు ఉన్నారు.