కార్యనిర్వహణాధికారి వారి కార్యాలయం,
శ్రీ దుర్గా మల్లేశ్వరస్వామి వార్ల దేవస్థానం, విజయవాడ.
తేది. 26.02.2025 )
శ్రీ దుర్గామల్లేశ్వరులకు మంగళగిరి చేనేత పట్టు వస్త్రాల సమర్పణ
మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని విజయవాడ శ్రీ దుర్గా మల్లేశ్వరులకు మంగళగిరి శ్రీ శివభక్త మార్కండేయ వంశీకులు తేదీ 26.02.2025 ఉదయం చేనేత పట్టు వస్త్రాలను సమర్పించారు.
మంగళగిరిలో భక్త మార్కండేయ ట్రస్ట్ ఆధ్వర్యంలో చేనేత మగ్గాలపై భక్తిశ్రద్ధలతో ఈ వస్త్రాలను ప్రత్యేకంగా తయారు చేశారు. మహాశివరాత్రి సందర్భంగా జరిగే శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల కళ్యాణ మహోత్సవానికి శివభక్త మార్కండేయ వంశీకులు చేనేత పట్టు వస్త్రాలు సమర్పించటం ఆనవాయితీగా వస్తుంది. ఈ సంవత్సరం ప్రధాన కైంకర్య పరులుగా ఆంధ్రప్రదేశ్ మెడికల్ సర్వీసెస్ & ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ చిల్లపల్లి శ్రీనివాసరావు, గుత్తికొండ ధనుంజయ రావు చేనేత వస్త్ర నివేదన చేశారు.
చేనేత పట్టు వస్త్రాలు, పసుపు కుంకుమ, గాజులు, విభూది, ఫల పుష్పాలతో ఇంద్రకీలాద్రికి విచ్చేసిన వీరిని ప్రధాన రాజ గోపురం వద్ద దేవస్థానం ఉప కార్యనిర్వహణ అధికారి ఎం. రత్న రాజు, సహాయ కార్యనిర్వహణ అధికారి జె. శ్రీనివాసం తదితరులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అనంతరం అమ్మవారికి ప్రత్యేక పూజలు జరిపి చేనేత పట్టు వస్త్రాలను సమర్పించారు. తదుపరి మల్లేశ్వర స్వామి ఆలయంలో అభిషేకాలు నిర్వహించి స్వామివారికి వస్త్రాలు సమర్పించారు.
ఈ కార్యక్రమంలో మంగళగిరి చేనేత ప్రముఖులు దామర్ల వెంకట నరసింహం, గంజి చిరంజీవి అందే నాగ ప్రసాద్, చిల్లపల్లి మోహన్ రావు, దామర్ల రాజు తదితరులు పాల్గొన్నారు.