*ఎన్టీఆర్ జిల్లా, మార్చి 01, 2025*
పీడీఎస్ బియ్యం పక్కదారి పట్టకుండా పటిష్ట నిఘా..
– *అవకతవకలకు ఆస్కారం లేకుండా విస్తృత తనిఖీలు*
– *ఉల్లంఘనలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవు*
– *జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ హెచ్చరిక*
ప్రజా పంపిణీ వ్యవస్థ (పీడీఎస్) ద్వారా అందించే పేదల బియ్యం పక్కదారి పట్టకుండా పటిష్ట నిఘా పెట్టడం జరిగిందని.. ఎక్కడా అవకతవకలకు ఆస్కారం లేకుండా విస్తృత తనిఖీలు చేపడుతున్నట్లు కలెక్టర్ డా. జి.లక్ష్మీశ తెలిపారు.
శనివారం కలెక్టర్ లక్ష్మీశ జి.కొండూరులో మూడో నంబర్ చౌక ధరల దుకాణాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. లైసెన్సు, ఆన్లైన్ ప్రకారం స్టాక్ వివరాలు, సరుకు నాణ్యతతో పాటు డీలరు సక్రమంగా రికార్డులు నిర్వహిస్తున్నారా లేదా అనే విషయాలను పరిశీలించారు. ఎండీయూ-6 వాహనం ద్వారా లబ్ధిదారులకు సరుకులు అందజేసే ప్రక్రియను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ లక్ష్మీశ మాట్లాడుతూ రేషన్ దుకాణాలు, ఎంఎల్ఎస్ పాయింట్లు, ఎండీయూ ఆపరేటర్ల కార్యకలాపాలు తదితరాలను ఎప్పటికప్పుడు తనిఖీ చేయాలని అధికారులను ఆదేశించినట్లు వెల్లడించారు. జిల్లాలోని 957 రేషన్ దుకాణాలను, ఏడు ఎంఎల్ఎస్ పాయింట్లలో ఎప్పటికప్పుడు తనిఖీలు చేపట్టడం జరుగుతోందన్నారు. పౌర సరఫరాల డిప్యూటీ తహసీల్దార్లు ప్రతినెలా 20 దుకాణాలను తనిఖీ చేయాల్సిందేనని.. అదేవిధంగా తహసీల్దార్లు నెలకు అయిదు దుకాణాలను తనిఖీ చేయాలని స్పష్టం చేశారు. పౌర సరఫరాల డీఎం, జిల్లా పౌర సరఫరాల అధికారి ఎంఎల్ఎస్ పాయింట్లను తనిఖీ చేయాలన్నారు. పేదల ఆహార భద్రతకు వీలుకల్పించే పీడీఎస్ బియ్యంలో ఒక్క గింజ పక్కదారి పట్టినా సహించేది లేదని.. ఉల్లంఘనలపై చట్టపరంగా కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ లక్ష్మీశ హెచ్చరించారు.