ఎన్టీఆర్ జిల్లా, మార్చి 04, 2025
అత్యంత పారదర్శకంగా రీసర్వే పనులు
కార్యకలాపాల్లో పురోగతిపై నిరంతర పర్యవేక్షణ
జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ
భూ యజమానుల సమక్షంలో ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా అత్యంత పారదర్శకంగా, జవాబుదారీతనంతో రీసర్వే పనులు జరుగుతున్నట్లు జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ తెలిపారు.
మంగళవారం కలెక్టర్ లక్ష్మీశ వీరులపాడు మండలం, గోకరాజుపల్లిలో రీసర్వే పనులను పరిశీలించారు. గ్రామంలో రీసర్వే ప్రగతి రికార్డులను పరిశీలించి.. లక్ష్యాల మేరకు కార్యకలాపాలు పూర్తిచేయాలని ఆదేశించారు. గ్రామ పరిధిలోని భూ వివరాలను పరిశీలించి.. మ్యాప్లను, గ్రౌండ్ ట్రూతింగ్ను పరిశీలించారు. గ్రామంలో 686 ఎకరాలు, 99 సర్వే నంబర్లకు సంబంధించి గ్రౌండ్ ట్రూతింగ్ దాదాపు పూర్తయినట్లు సర్వేయర్లు వివరించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ లక్ష్మీశ మాట్లాడుతూ ఎలాంటి తప్పులు లేకుండా రీసర్వే ప్రక్రియను పక్కాగా, పకడ్బందీగా పూర్తిచేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని.. ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయి సిబ్బందికి మార్గనిర్దేశనం చేస్తూ పనులను పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు. రైతులకు ఏవైనా సందేహాలు ఉంటే నివృత్తి చేస్తూ సర్వే ప్రయోజనాలను వివరిస్తున్నట్లు పేర్కొన్నారు. దీర్ఘకాలిక భూ సమస్యలను పరిష్కరించేందుకు సర్వే ఎంతగానో ఉపయోగపడుతుందని.. భూ రికార్డుల స్వచ్ఛీకరణతో గ్రామాలు భూ వివాద రహిత గ్రామాలుగా కొత్త వెలుగులు నింపుకుంటాయన్నారు. క్షేత్రస్థాయి తనిఖీల్లో కలెక్టర్ వెంట నందిగామ ఆర్డీవో కె.బాలకృష్ణ, అసిస్టెంట్ డైరెక్టర్ (సర్వే, భూ రికార్డులు) టి.త్రివిక్రమరావు, సర్వేయర్లు తదితరులు ఉన్నారు.