Home Political news ఏపీలో తొలి కొకైన్ కేసు నమోదైంది వైసీపీ పాలనలోనే హోంమంత్రి వంగలపూడి అనిత

ఏపీలో తొలి కొకైన్ కేసు నమోదైంది వైసీపీ పాలనలోనే హోంమంత్రి వంగలపూడి అనిత

3
0

 ఏపీలో తొలి కొకైన్ కేసు నమోదైంది వైసీపీ పాలనలోనే  హోంమంత్రి వంగలపూడి అనిత

గంజాయిపై గత ప్రభుత్వం దృష్టిపెట్టకే దుష్పరిణామాలు

గంజాయి, డ్రగ్స్, మాదకద్రవ్యాల ఉనికి లేకుండా చేస్తాం

కూటమి ప్రభుత్వంలో 70వేల కిలోల గంజాయి స్వాధీనం, ధ్వంసం

3 గంజాయి కేసులలో ఇప్పటికే ఆస్తుల జప్తును అమలు చేశాం

గంజాయి కేసులో పట్టుబడితే ప్రభుత్వ సంక్షేమం తొలగించడంపై సమాలోచన

డాక్టర్ ప్రిస్క్పిక్షన్ లేకుండా డ్రగ్స్ అమ్మితే మెడికల్ షాపులు సీజ్

డ్రగ్స్, గంజాయి నిర్మూలనకోసం పాఠశాలస్థాయిలోనే అవగాహన చర్యలు

గంజాయి నిర్మూలనకు పార్టీలకతీతంగా ఏకమవుదాం

ఓటీటీ, రీల్స్ లో విషప్రచారంపట్ల ప్రత్యేక దృష్టి పెడతాం

దేశంకోసం ప్రాణత్యాగం చేసే సైనికుల కుటుంబాలకు అండగా ఉంటాం

రూ.10 కోట్ల కార్పస్ నిధితో సైనిక్ వెల్ఫేర్ కార్పొరేషన్ ఏర్పాటు

అమాయక గిరిజన యువకులకు శిక్ష పడకుండా అవగాహన పెంచుతాం

సరిహద్దు రాష్ట్రాలతో గంజాయి నిర్మూలనపై త్వరలో అంతర్గత సమావేశం

అమరావతి, మార్చి, 06; గంజాయిపై గత ప్రభుత్వం దృష్టి సారించకపోవడం వల్లే నేటి దుష్పరిణామాలకు కారణమని హోంమంత్రి వంగలపూడి అనిత వెల్లడించారు. గంజాయి, డ్రగ్స్, మాదకద్రవ్యాలు ఏ రూపంలో ఉన్నా ఉనికి లేకుండా చేస్తామని ఆమె స్పష్టం చేశారు. దీనికోసమే 30 శాతం ఫిట్ మెంట్ సహా టెక్నాలజీ గురించి తెలిసిన అధికారులు, అత్యాధునిక డ్రోన్లు, సీసీ కెమెరాలతో పటిష్ట ఈగల్ వ్యవస్థను ఏర్పాటు చేశామన్నారు.ఐదుగురు మంత్రులతో కూడిన సబ్ కమిటీ ద్వారా విధివిధానాలు రూపొందించినట్లు తెలిపారు. గంజాయి సాగును 90 శాతం తగ్గించినట్లు హోంమంత్రి పేర్కొన్నారు. గంజాయి కేసుల్లో వైసీపీ పాలనలో 01.10.2023-31.05.2024 కాలంలో 1,995 మందిని అరెస్ట్ చేయగా.. కూటమి ప్రభుత్వం ఏర్పడిన కొద్దికాలంలోనే 2,513 మందిని అరెస్ట్ చేసిందని గణాంకాలతో సహా వివరించారు.9 నెలల్లోనే 70 కేజీల స్వాధీనం చేసుకోవడం, గంజాయి మొత్తాన్ని ధ్వంసం చేయడం అందుకు నిదర్శనమన్నారు. గంజాయిలో పట్టుబడిన మూడు కేసులలో ఇటీవలే ఆస్తులను కూడా జప్తు చేసినట్లు శాసన మండలిలో హోంమంత్రి పేర్కొన్నారు. గురువారం శాసనమండలిలో వైసీపీ ఎంఎల్సీలు పండు రవీంద్రబాబు, ఇజ్రాయెల్, మహ్మద్ రుహుల్లా, శివరామిరెడ్డి, భరత్ అడిగిన ప్రశ్నలపై హోంమంత్రి అనిత సమాధానమిచ్చారు. ఈ సందర్భంగా ఆమో మాట్లాడుతూ గంజాయి కేసులో పట్టుబడితే ప్రభుత్వ సంక్షేమాన్ని తొలగించడంపై సమాలోచనలు చేస్తున్నట్లు తెలిపారు. డాక్టర్ ప్రిస్క్పిక్షన్ లేకుండా డ్రగ్స్ అమ్మితే మెడికల్ షాపులు సీజ్ చేస్తామని హెచ్చరించారు. డ్రగ్స్, గంజాయి నిర్మూలనకోసం విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ చొరవతో పాఠశాలస్థాయిలోనే అవగాహన చర్యలు చేపడుతున్నామన్నారు. టీచర్లు, ప్రిన్సిపళ్ల నేతృత్వంలో ఈగల్ కమిటీలు, మెగా పేరెంట్ మీటింగ్ లను ఏర్పాటు చేశామన్నారు. కోటి మంది చిన్నారులకు గంజాయిపై సదస్సుల ద్వారా అవగాహన కలిగించామన్నారు. గంజాయి కేసుల్లో ఎక్కువగా బాధితులవుతున్న అమాయక గిరిజన యువకులకు శిక్ష పడకుండా ముందస్తు అవగాహన పెంచుతామన్నారు. గంజాయి నిర్మూలనకు పార్టీలకతీతంగా ప్రతి ఒక్కరం ఏకమవ్వాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. సోషల్ మీడియా సహా ఓటీటీ, ఇన్స్టా రీల్స్ లో జరిగే విషప్రచారంపట్ల ప్రత్యేక నిఘా పెడతామన్నారు. గంజాయిపై చర్యల పట్ల వైసీపీ ఎమ్మెల్సీ భరత్ సూచనలను హోంమంత్రి అనిత స్వాగతించారు. సరిహద్దు రాష్ట్రాలైన ఒరిస్సా, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, చత్తీస్‌గఢ్ రాష్ట్రాలతో సమన్వయం చేసుకునేలా గంజాయి నిర్మూలనపై విశాఖపట్నం వేదికగా త్వరలో అంతర్గత సమావేశం నిర్వహించనున్నట్లు హోంమంత్రి వెల్లడించారు. 

ఏపీలో తొలి కొకైన్ కేసు ఘనత వైసీపీ ప్రభుత్వానిదే  హోంమంత్రి కౌంటర్

కూటమి ప్రభుత్వం వచ్చాక గంజాయి కేసులు పెరిగాయన్న వైసీపీ ఎంఎల్‌సీ బొమ్మి ఇజ్రాయెల్ వ్యాఖ్యలపై హోంమంత్రి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వంలో సీఎం ఇంటికి సమీపంలోనే గంజాయి కొట్టి ఒక యువతిపై సామూహికంగా అఘాయిత్యం చేసినా స్పందించని విషయాన్ని ఆమె ఈ సందర్భంగా ప్రస్తావించారు. తొలి కొకైన్ కేసు కూటమి ప్రభుత్వంలో నమోదైందన్న వైసీపీ ఎంఎల్సీ ఇజ్రాయెల్‌ ఆరోపణలపై గట్టిగా కౌంటర్ ఇచ్చారు. దేశంలో మొట్టమొదటి కొకైన్ కేసు ఏపీలో నమోదైంది 2021 జగన్ పాలనలోనేనని స్ఫష్టం చేశారు. విశాఖపట్నం మూడో పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో 3 గ్రాముల కొకైన్ స్వాధీనం, 8 మంది నిందితులను అరెస్ట్ చేయడాన్ని ఆధారంగా తేల్చి చెప్పారు. గుంతకల్ ఒకటో పట్టణ ఠాణా పరిధిలో 20.64 గ్రాముల కొకైన్ పట్టుబడింది, ఆ కేసులో ఏడుగురు అరెస్ట్ అయింది కూడా గత ప్రభుత్వ 2022 హయాంలోనేనన్నారు. ఉత్పత్తి,తయారీ, నిల్వ,రవాణా, ఎగుమతి, దిగుమతి, వాడకం , ప్రేరేపించినా అన్నీ నేరాలేనని ఎవరు చేసినా శిక్ష తప్పదన్నారు. జైళ్లలో ఎస్టీలు ఎక్కువ శాతం గంజాయి కేసుల్లో మగ్గుతుండడం పట్ల హోంమంత్రి విచారం వ్యక్తం చేశారు. డ్రోన్ ఎగిరితే భయపడిపోయి జి.మాడుగుల మండలం ప్రాతపాడు గ్రామంలో గంజాయి సాగుని ధ్వంసం చేసిన విషయాన్ని హోంమంత్రి ప్రస్తావించారు. గంజాయి సాగుకు అలవాటుపడిన 359 కుటుంబాలలో చైతన్యం కలిగించి ప్రత్యామ్నాయ పంటలవైపు మళ్లించేందుకు అవగాహన కలిగిస్తున్నట్లు వివరించారు. 46 లక్షల మొక్కల స్థానంలో గంజాయికి బదులు ఇతర పంటలు పెంచుకునేందుకు చర్యలు చేపట్టామన్నారు. పోలీసులు, గిరిజన, వైద్య శాఖ నేతృత్వంలో ఇప్పటిదాకా 9,818 అవగాహన సదస్సులు ఇప్పటివరకూ నిర్వహించినట్లు చెప్పారు.

దేశంకోసం ప్రాణత్యాగం చేసే సైనికుల కుటుంబాలకు అండగా ఉంటాం: హోంమంత్రి అనిత

దేశంకోసం ప్రాణత్యాగం చేసే సైనికుల కుటుంబాలకు అండగా ఉంటామని హోంమంత్రి అనిత వెల్లడించారు. అందులో భాగంగానే రూ.10 కోట్ల కార్పస్ నిధితో సైనిక్ వెల్ఫేర్ కార్పొరేషన్ ఏర్పాటు చేశామన్నారు. జీవోఎంఎస్ నంబర్ 26 ప్రకారం యుద్ధంలో మరణించిన సైనికులు, వారి కుటుంబసభ్యులకు ఏ కష్టం రానీయమన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన ఐదు నెలల కాలంలోనే వారికోసం ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయడమే అందుకు నిదర్శనమన్నారు. యుద్ధంలో ప్రాణాలు విడిచిన యుద్ధవీరుల సతీమణులైన వితంతువులకు 300 చదరపు గజాల స్థలం ఇవ్వడమే కాకుండా సాయుధబలగాల సిబ్బంది పిల్లల విద్యకోసం మొదటి ప్రాధాన్యత కల్పిస్తున్నామన్నారు. యుద్ధంలో వికలాంగులైన యుద్ధవీరుల కుటుంబాలకు రూ.3లక్షల సాయం, కాలు, చేయి,చూపు, వినికిడి సమస్యల బారన పడితే రూ.2 లక్షలు, కాలిన లేదా తుపాకీ గాయాలపాలయితే రూ.లక్ష సాయం అందిస్తున్నట్లు వివరించారు. యుద్ధంలో వికలాంగులైన సైనికులకు సైతం 300 చదరపు గజాల ఇంటి స్థలం, యుద్ధంలో వికాలంగులైన సైనికుల పిల్లల చదువుకు రెండో ప్రాధాన్యత కల్పిస్తున్నామన్నారు. సరిహద్దుల్లో మరణించినా, వికలాంగులైన సైనికుల ఆధారితులకు , అవివాహితులైన సైనికుల యొక్క సోదర,సోదరిమణులకు రాష్ట్ర ప్రభుత్వంలోని ఏదైనా శాఖలో కారుణ్యనియామకం కింద ఉద్యోగ అవకాశం కల్పిస్తున్నట్లు చెప్పారు. విద్యార్హతల ఆధారంగా ఆఫీస్ సబార్డినేట్, టైపిస్ట్, జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలిస్తున్నట్లు పేర్కొన్నారు. జనవరి, 2020 నాటి నుంచి నేటి వరకూ కారుణ్య నియామకాల కింద వచ్చిన దరఖాస్తులు 11 కాగా అందులో ఇద్దరు దరఖాస్తుదారులకు ఉద్యోగాలిచ్చినట్లు స్పష్టం చేశారు. మరో తొమ్మిది దరఖాస్తులు పరిశీలనలో ఉన్నట్లు తెలిపారు. సైనికుల కుటుంబాలకు దక్కే గౌరవ, మర్యాదలు, పరిహారం అందజేతల క్రమంలో ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనివ్వాలని కోరగా అందుకు హోంమంత్రి సానుకూలంగా స్పందించారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే నష్టపరిహారాన్ని కూడా పెంచి కేబినెట్ లో నిర్ణయం తీసుకుని అమలు చేస్తామని హోంమంత్రి బదులిచ్చారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here