వైద్య, ఆరోగ్య శాఖకు రూ.19,264 కోట్లు
రూ.250 కోట్లతో గిరిజన ప్రాంతాల్లో 5 మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రులు
అసెంబ్లీలో మంత్రి సత్యకుమార్ యాదవ్ వెల్లడి
అమరావతి, మార్చ్ 7
గిరిజన ప్రాంతాల్లో ఒక్కొక్కటీ రూ. 50 కోట్ల వ్యయంతో 5 మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రుల్ని నిర్మిస్తున్నామని వైద్య, రోగ్యశాఖ మంత్రి శ్రీ సత్యకుమార్ యాదవ్ శాసనసభకు వివరించారు. రూ. 19,264 కోట్లు బడ్జెట్ గ్రాంట్ ను మంజూరు చేసినందుకు శాసనసభకు ధన్యవాదాలు తెలియచేస్తున్నానని మంత్రి వెల్లడించారు. గత ప్రభుత్వం ఆఖరు సంవత్సరంలో ప్రవేశపెట్టిన బడ్జెట్ కన్నా 30 శాతం మేర ఇది అధికమనీ, ఆరోగ్య, సంపన్న, ఆనందమయ
(HEALTHY, WEALTHY, HAPPY) ఆంధ్రప్రదేశ్ రూపకల్పనకుగాను ఆరోగ్యశాఖకు పెద్ద మొత్తంలో బడ్జెట్ కేటాయింపులు చేశారనీ, 9 నెలల్లో అనేక సంస్కరణలు వైద్య, ఆరోగ్యశాఖలో తీసుకొచ్చామనీ మంత్రి స్పష్టం చేశారు. అలాగే ఇంటర్ వరకూ 69 మంది లక్షల మంది విద్యార్ధులకు హెల్త్ రికార్డుల్ని రూపొందించామని
మంత్రి వివరించారు. కోటీ 40 లక్షల మందికి వివిధ రోగాలకు సంబంధించిన స్క్రీనింగ్ టెస్టుల్ని నిర్వహించామన్నారు. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా 19 ఆరోగ్య కేంద్రాల్లో ప్రివెంటివ్ క్యాన్సర్ పై చికిత్స అందిస్తున్నామన్నారు. స్టెమీ కార్యక్రమంలో భాగంగా ఒక్కొక్కటీ రూ.45 వేల ఖరీదు చేసే ఇంజక్షన్లు ఉచితంగా ఇచ్చి 2,140 ప్రాణాల్ని కాపాడామన్నారు. గతంలో పేదలకు అందుబాటులో లేని ఎంఆర్ఐ స్కాన్ లను కూడా చేస్తున్నట్టు మంత్రి తెలిపారు. ఫుడ్ సేఫ్టీ ల్యాబులను కూడా అందుబాటులోకి తెచ్చామన్నారు. వేతనాలు పెంచాలని ఆశా వర్కర్లు కొందరు ధర్నాలు చేస్తున్నారనీ, ఏపీలో రూ.10 వేల జీతాన్ని ఆశాలకిస్తున్నామనీ, ఉద్యోగ విరమణ వయసును 62 ఏళ్లకు పెంచి, రూ.1.50 లక్షలు గ్రాట్యుటీని మంజూరు చేస్తూ ఇటీవలే ముఖ్యమంత్రి చంద్రబాబు ని ర్ణయం తీసుకున్నారన్నారనీ మంత్రి వివరించారు. డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవతో పాటు మందులు, 108 ఎమెర్జెన్సీ సేవలకు సంబంధించి గత ప్రభుత్వం అప్పు పెట్టిందన్నారు. మొత్తం రూ.6,500 కోట్ల మేర బకాయిలు పెట్టి కూటమి ప్రభుత్వంపై భారాన్ని మోపారన్నారు. పేద, మధ్య తరగతి ప్రజలకు అందుబాటులో ఉండేలా రూ. 2.5 లక్షల నుంచి రూ.25 లక్షల వరకూ వైద్య సేవలందించేలా హైబ్రీడ్ విధానంలో బీమాను అందుబాటులోకి తెస్తున్నామన్నారు. 108 సేవల కోసం కొత్తగా 190 అంబులెన్స్లను , 53 మహాప్రస్థానం అంబులెన్సులను కొనుగోలు చేస్తున్నట్టు మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు.