08.03.2025
మహిళాభ్యుదయంలో జగనన్న పాలన ఓ సువర్ణాధ్యాయం
వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త మల్లాది విష్ణు.
ఆడపడుచులను దగా చేస్తున్న కూటమి సర్కారు: వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి శ్యామల
మహిళా పక్షపాతి జగనన్న మేయర్ రాయన భాగ్యలక్ష్మి
మహిళలు బాగుంటేనే ఆ కుటుంబం, రాష్ట్రం, దేశం బాగుంటుందని వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం వేడుకలు ఆంధ్రప్రభ కాలనీలోని జనహిత సదనంలో శనివారం ఘనంగా జరిగాయి. మల్లాది విష్ణు ఆధ్వర్యంలో జరిగిన వేడుకలలో వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి శ్యామల, మేయర్ రాయన భాగ్యలక్ష్మి, డిప్యూటీ మేయర్ అవుతు శ్రీ శైలజా రెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మల్లాది విష్ణు మాట్లాడుతూ.. ఆడపడుచులకు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. మహిళలు లేకపోతే ప్రపంచం నడవదని.. నేటి సమాజంలో మహిళలు పురుషులతో సమానంగా పోటీ పడుతున్నారని చెప్పారు. అటువంటి ఆడపడుచుల అభ్యున్నతి, సాధికారతకు పెద్దపీట వేస్తూ.. గత వైసీపీ ప్రభుత్వంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలన సాగించారని గుర్తు చేశారు.
సెంట్రల్ పరిధిలో రూ. 440 కోట్ల సంక్షేమం
పేద కుటుంబాలలో వెలుగు నింపేందుకు ఐదేళ్లలో గత ప్రభుత్వం నవరత్నాల కింద ఏకంగా రూ.1,89,519 కోట్లను నేరుగా మహిళల ఖాతాల్లో జమచేసిందని మల్లాది విష్ణు చెప్పారు. మహిళల భద్రత, సంక్షేమం విషయంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎక్కడా రాజీ పడలేదన్నారు. అన్నిరంగాల్లో మహిళలను ప్రోత్సహించి, దాదాపు 32కు పైగా పథకాల ద్వారా వారికి భరోసా కల్పించారన్నారు. ఒక్క సెంట్రల్ నియోజకవర్గ పరిధిలోనే వైఎస్సార్ ఆసరా పథకం ద్వారా 33,940 మంది అక్కచెల్లెమ్మలకు రూ. 118 కోట్ల 64 లక్షలు., సున్నావడ్డీ పథకం ద్వారా 42,760 మందికి రూ. 17 కోట్ల 26 లక్షలు., వైఎస్సార్ చేయూత ద్వారా 10,875 మందికి రూ. 63 కోట్ల 35 లక్షలు., అమ్మఒడి పథకం ద్వారా 28,834 మంది తల్లులకు రూ. 118 కోట్ల 98 లక్షలు., వైఎస్సార్ కాపు నేస్తం ద్వారా 2,583 మందికి రూ. 12 కోట్లు., ఈబీసీ నేస్తం ద్వారా 2,593 మందికి రూ. 6 కోట్ల 81 లక్షలు సహా పలు ప్రభుత్వ పథకాల ద్వారా నేరుగా ఆడపడుచుల ఖాతాలలో నగదు జమ చేసినట్లు వెల్లడించారు. మొత్తంగా ఐదేళ్లలో దాదాపు 58 వేల మంది లబ్ధిదారులకు రూ. 440 కోట్ల సంక్షేమాన్ని అందజేసినట్లు వివరించారు. 2016 డిసెంబర్ నాటికి ఏపీలో 11.77 శాతం ఉన్న పేదరికం.. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత 6.06 శాతానికి తగ్గిందని గుర్తుచేశారు.
నామినేటెడ్ పదవులు, పనుల్లో 50 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ చట్టం
వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆడపడుచులకు 50 శాతం రిజర్వేషన్ కల్పించడం ద్వారా చట్టసభల్లో మహిళల ప్రాతినిధ్యం పెరిగిందని మల్లాది విష్ణు అన్నారు. హోంమంత్రితోపాటు మరో ముగ్గురు మహిళలకు కీలక మంత్రి పదవులను అప్పగించారన్నారు. తొలిసారి శాసనమండలి వైస్ చైర్మన్ గా జకీయా ఖానంను నియమించామన్నారు. రాష్ట్రంలో 13 జెడ్పీ చైర్మన్ పదవుల్లో ఏడుగురు మహిళలే ఉన్నారని.. 26 జెడ్పి వైస్ చైర్మన్ పదవుల్లో 15 మంది మహిళలకు అవకాశం కల్పించామన్నారు. 12 మేయర్ పోస్టులు, 24 డిప్యూటీ మేయర్ పదవులు కలిపి మొత్తంగా 36 పదవుల్లో 18 మంది మహిళలే ఎన్నికయ్యారని పేర్కొన్నారు.
ప్రభుత్వ అసమర్థతతో మహిళలపై పెచ్చుమీరిన దాడులు
కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన 10 నెలల కాలంలో మహిళల అభ్యున్నతికి ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదని మల్లాది విష్ణు ఆరోపించారు. పైగా ఆడపడుచులపై దాడులు పెచ్చుమీరాయని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఎక్కడా మహిళలు స్వేచ్ఛగా తిరిగే పరిస్థితులు లేవని.. హోంమంత్రి సొంత జిల్లాలో మైనర్ బాలిక బద్ది దర్శిని హత్య, విజయవాడ బృందావన్ కాలనీలో ప్రేమోన్మాది ఘాతుకం, విశాఖ మధురవాడలో ఐదేళ్ల బాలికపై లైంగికదాడి, పాడేరులో ఆరేళ్ల చిన్నారిపై సామూహిక అత్యాచారం, గుంటూరు జిల్లాలో దళిత బాలికపై అత్యాచారం లాంటి ఘటనలు ఎక్కువయ్యాయని.. అయినా ప్రభుత్వంలో మాత్రం ఎటువంటి చలనం లేకపోవటం బాధాకరమన్నారు. మహిళలకు ఇచ్చిన హామీల అమలులోనూ ఈ ప్రభుత్వం వంచన చేస్తోందని మల్లాది విష్ణు మండిపడ్డారు. తల్లికి వందనం., మహిళలకు నెలకు రూ. 1,500 ఏమైయ్యాయని ప్రశ్నించారు. ఎన్నికల ముందు రాష్ట్ర వ్యాప్తంగా ఉచిత బస్సు ప్రయాణమని ఊదరగొట్టి.. తీరా అధికారంలోకి వచ్చాక జిల్లాల వరకే పరిమితమని అసెంబ్లీలో మంత్రి చెప్పటం ఆడపడుచులను మోసగించటమేనన్నాను. ఈ ప్రభుత్వ చర్యలను ఎండగట్టాలని ఆడపడుచులకు పిలుపునిచ్చారు. మరలా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా అయితేనే.. మహిళలకు పూర్తిస్థాయిలో న్యాయం జరుగుతుందని అభిప్రాయం వ్యక్తం చేశారు.
వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి శ్యామల మాట్లాడుతూ ప్రతి ఒక్క మహిళలోనూ భూదేవికి ఉన్నంత ఓర్పు, సహనం ఉంటుందని మాట్లాడారు. కానీ కూటమి సర్కార్ మహిళల సహనాన్ని పరీక్షిస్తోందని మండిపడ్డారు. ఈ ప్రభుత్వం వచ్చాక ఆడపడుచులపై దాడులు నిత్యకృత్యమయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలలో శాంతంగా ఉండే మథర్ థెరిస్సాలే కాదు.. ఝాన్సీ లక్ష్మి భాయ్, చాకలి ఐలమ్మ వంటి వీర వనితలు కూడా ఉన్నారని ఈ ప్రభుత్వానికి తెలిసివచ్చే రోజులు దగ్గరలోనే ఉన్నాయని మాట్లాడారు.
నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి మాట్లాడుతూ.వైసీపీ హయాంలో మహిళలందరూ ఎంతో ఆనందంగా ఉంటూ అన్ని రంగాల్లో ముందుకెళ్లే వారని గుర్తు చేశారు. మహిళలను అన్నివిధాలా ప్రోత్సహిస్తూ అనేక సంక్షేమ పథకాలు వైఎస్ జగన్ అమలు చేశారని చెప్పారు. ప్రతి మహిళా లక్షాధికారి అవ్వాలి అనే వైఎస్సార్ ఆశయాలను జగన్మోహన్ రెడ్డి గారు ముందుకు తీసుకు వెళ్లారని తెలిపారు. మహిళలకు ఉన్నత పదవులు ఇస్తూ రాజకీయాలలో కూడా రాణించాలని అండగా ఉన్నారన్నారు. కానీ కూటమి ప్రభుత్వంలో మహిళలకు రక్షణ కరువైందన్నారు.
డిప్యూటీ మేయర్ అవుతు శ్రీ శైలజా రెడ్డి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం మహిళలను నిర్లక్ష్యం చేస్తుందని మండిపడ్డారు. కుటుంబ బాధ్యతలు మోస్తున్న ఆడపడుచులకు గత ప్రభుత్వం అండగా నిలబడితే.. ఆ భరోసాను కూటమి ప్రభుత్వం లేకుండా చేసిందని దుయ్యబట్టారు. దిశచట్టాన్ని నిర్వీర్యం చేశారని ఆరోపించారు. జగనన్న సర్కార్ అమలు చేసిన పథకాలన్నింటిని అటకెక్కించారని నిప్పులు చెరిగారు. రాబోయే రోజుల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ గెలిపించడానికి మహిళలందరూ సిద్ధంగా ఉన్నారని తెలిపారు. అనంతరం కేక్ కట్ చేసి.. పలు రంగాల్లో రాణించిన మహిళలకు శాలువాలు కప్పి సన్మానం చేశారు. కార్యక్రమంలో వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు తోపుల వరలక్ష్మి, వైసీపీ కార్పొరేటర్లు అలంపూర్ విజయలక్ష్మి, ఎండి షాహినా సుల్తానా, ఇసరపు దేవి, యరగొర్ల తిరుపతమ్మ, కొండాయగుంట మల్లేశ్వరి, కుక్కల అనిత, ఉద్ధంటి సునీత, ముఖ్య నాయకులు, పార్టీ శ్రేణులు, పెద్ద సంఖ్యలో మహిళలు హాజరయ్యారు.