ఎన్టీఆర్ జిల్లా, మార్చి 09, 2025
పీ4 కార్యాచరణలో భాగస్వాములుకండి
ఆలోచనలు పంచుకోండి.. మార్పునకు నాంది పలకండి
ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ
సమగ్రాభివృద్ధి లక్ష్యంగా ముఖ్యమంత్రి దార్శనికతకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం ఆవిష్కరించిన స్వర్ణాంధ్ర @ 2047లో భాగంగా పేదరికాన్ని పూర్తిగా నిర్మూలించేందుకు జీరో పావర్టీ-పీ4 విధానం అమలుకు కసరత్తు జరుగుతోందని.. ఈ ప్రయాణంలో ప్రతిఒక్కరూ భాగస్వాములు కావాలని జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ పిలుపునిచ్చారు.
స్వర్ణాంధ్ర@2047 విజన్ డాక్యుమెంట్లోని పది సూత్రాల్లో మొదటి సూత్రమైన శూన్య పేదరికం లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా పబ్లిక్, ప్రైవేట్, పీపుల్ పార్టనర్షిప్ (పీ4) విధానానికి ఉగాది నుంచి శ్రీకారంచుట్టనుందని.. ప్రభుత్వం, దాతలు, ప్రజాభాగస్వామ్యంతో పేదరికం లేని సమాజం లక్ష్యంగా ఈ పీ4 విధానం అమలుకానుందని వివరించారు. ముఖ్యంగా యువతకు జ్ఞానం, నైపుణ్యాలు అందించడం, ప్రతిఒక్కరికీ మెరుగైన వైద్య సేవలు, సుస్థిర ఉపాధి అవకాశాల సృష్టి, వృద్ధికి దోహదం చేసే మౌలిక వసతుల కల్పనపై దృష్టిసారించేందుకు ఇది తోడ్పడుతుందన్నారు. సమాజం నుంచి పేదరికాన్ని దూరం చేసేందుకు ప్రభుత్వం ప్రణాళికాయుతంగా చేపడుతున్న కార్యక్రమాలకు తోడు సామాజికంగా, ఆర్థికంగా పైన ఉన్న కుటుంబాలు సామాజిక బాధ్యతగా అట్టడుగున ఉన్న కుటుంబాలకు మద్దతుగా నిలిచేలా భాగస్వాములను చేయడం పీ4 విధానమని పేర్కొన్నారు. ఈ బృహత్తర కార్యక్రమంపై ప్రజల నుంచి సూచనలు తీసుకోవడం జరుగుతోందన్నారు. క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసి లేదా https://swarnandhra.ap.gov.in/p4 లింక్ ద్వారా ఈ నెల 25వ తేదీలోగా అభిప్రాయాలు తెలియజేసి.. ప్రతి ఇంటికీ అభివృద్ధి, ప్రతి జీవితానికీ ప్రగతిలో భాగస్వాములు కావాలని, మీ సలహాలను ప్రశంసిస్తూ ఒక ప్రశంసా పత్రం కూడా అందించడం జరుగుతుందని కలెక్టర్ లక్ష్మీశ తెలిపారు.