12.03.2025
సిద్ధాంతాలే ఊపిరిగా పురుడు పోసుకున్న పార్టీ వైఎస్సార్ సీపీ
వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త మల్లాది విష్ణు
దేశ చరిత్రలోనే వైఎస్సార్ సీపీ ప్రస్థానం చాలా ప్రత్యేకమని వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. బీసెంట్ రోడ్డులోని ఎల్ఐసి కార్యాలయం వద్ద వైఎస్సార్ సీపీ 15వ ఆవిర్భావ దినోత్సవ సంబరాలు మల్లాది విష్ణు అధ్యక్షతన ఘనంగా జరిగాయి. ఈ వేడుకలలో నగర డిప్యూటీ మేయర్ అవుతు శ్రీశైలజారెడ్డి, కాపు కార్పొరేషన్ మాజీ ఛైర్మన్ అడపా శేషు, వైఎస్సార్ సీపీ కార్పొరేటర్లు, పార్టీ వివిధ అనుబంధ సంఘాల అధ్యక్షులు పాల్గొన్నారు. తొలుత దివంగత మహానేత వైఎస్సార్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం పార్టీ జెండాను ఆవిష్కరించారు. “వైఎస్ జగన్మోహన్రెడ్డి నాయకత్వం వర్దిల్లాలి” అంటూ పార్టీ శ్రేణుల నినాదాలు హోరెత్తించాయి. ఈ సందర్భంగా మల్లాది విష్ణు మాట్లాడుతూ.. వైఎస్సార్ సీపీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పార్టీ శ్రేణులకు శుభాకాంక్షలు తెలిపారు. రాజకీయాలు రూపాంతరం చెందుతున్న ప్రస్తుత తరుణంలో దివంగత మహానేత వైఎస్సార్ దగ్గర నుంచి కానీ, వైఎస్ జగన్మోహన్ రెడ్డి నుంచి కానీ నేర్చుకోవలసింది ఎంతో ఉందని మల్లాది విష్ణు అన్నారు. అధికారంలో ఉన్నప్పుడు ప్రజలకు ఏవిధంగా సేవ చేయాలో.. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎంత హుందాగా వ్యవహరించాలో వారి నుంచే నేర్చుకోవాలన్నారు. కనుకనే సార్వత్రిక ఎన్నికలలో మూకుమ్మడిగా అన్ని పార్టీలు కలిసి పోటీ చేసినా.. వైఎస్సార్ సీపీ ఒంటరిగా వాటన్నింటినీ ఎదుర్కొందని మల్లాది విష్ణు అన్నారు. అయినా కూడా స్వల్ప తేడాతోనే ఓడిపోవలసి వచ్చిందన్నారు.
వైఎస్సార్ ఆలోచన, స్ఫూర్తితో
దివంగత మహానేత వైఎస్సార్ ఆలోచన, స్ఫూర్తితో ఆనాడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీని స్థాపించారని మల్లాది విష్ణు పేర్కొన్నారు. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా, ఆటుపోటులను ఓర్చుకుంటూ తండ్రి ఆశయం కోసం పోరాడారన్నారు. చరిత్రలో నిలిచిపోయే పాదయాత్రను మహాయజ్ఞంలా పూర్తిచేశారన్నారు. సుధీర్ఘ పాదయాత్రలో ఎండనక వాననక నిత్యం ప్రజల్లోనే ఉంటూ వారి కష్టాలను తెలుసుకుని, అధికారంలోకి వచ్చాక ప్రజలకు తానున్నానన్న భరోసాను కల్పించారన్నారు. దేశ చరిత్రలో 99 శాతం హామీలను అమలు చేసిన ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాత్రమేనని చెప్పుకొచ్చారు. దళారీ వ్యవస్థకు తావులేకుండా స్వచ్ఛమైన పాలనను అందించి ఐదేళ్లలో పేద, మద్య తరగతి ప్రజలకు డీబీటీ, నాన్-డీబీటీ ద్వారా అక్షరాల రూ.2,83,866 కోట్ల మేలు చేకూర్చినట్లు వెల్లడించారు. ఒక్క సెంట్రల్ నియోజకవర్గ పరిధిలోనే రూ. 440 కోట్ల సంక్షేమాన్ని అందజేసినట్లు వివరించారు. విద్య, వైద్య, వ్యవసాయ రంగాలలో విప్లవాత్మక సంస్కరణలు తీసుకురావడంతో పాటు మహిళలను ఒక బలమైన శక్తిగా తీర్చిదిద్దారని చెప్పుకొచ్చారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన ఆరు నెలల కాలంలో గ్రామ, వార్డు సచివాలయాలు ఏర్పాటు చేసి.. 1.34 లక్షల మందికి ఉద్యోగావకాశాలు కల్పించారన్నారు. కరోనా లాంటి విపత్తు సమయాలలో., వరదలు, తుఫాన్లు వచ్చినప్పుడు ప్రజల ప్రాణాలకు అత్యధిక ప్రాధాన్యతనిచ్చి.. సంయమనంతో పరిస్థితులను చక్కదిద్ది వారిలో మనోస్థైర్యాన్ని నింపారని చెప్పారు. రాష్ట్రంలో అన్ని వర్గాలు సంతోషంగా ఉండాలన్నదే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ లక్ష్యమని, అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా ప్రజల కోసం పరితపించే నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని మల్లాది విష్ణు అన్నారు. 2029లో వైసీపీ ప్రభంజనం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. రాబోయే రోజుల్లో ప్రతిఒక్కరూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి వెన్నంటే ఉంటూ.. ఆయన అడుగుజాడల్లో నడుస్తూ పార్టీ పటిష్టత కోసం పునరంకితమవ్వాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో వైసీపీ కార్పొరేటర్లు శర్వాణీమూర్తి, కొండాయిగుంట మల్లేశ్వరి, ఇసరపు దేవి రాజా రమేష్, యరగొర్ల తిరుపతమ్మ శ్రీరాములు, కుక్కల అనిత రమేష్, జానారెడ్డి, ఉద్ధంటి సునీత సురేష్, పార్టీ వివిధ అనుబంధ సంఘాల నేతలు, నాయకులు, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.