12.03.2025
విద్యార్థుల జీవితాలతో కూటమి ప్రభుత్వం చెలగాటం
వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త మల్లాది విష్ణు
విద్యార్థుల జీవితాలతో కూటమి ప్రభుత్వం చెలగాటమాడుతోందని వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఆరోపించారు. బుధవారం మల్లాది విష్ణు ఆధ్వర్యంలో బీసెంట్ రోడ్డులోని ఎల్ఐసి కార్యాలయం నుంచి ప్రారంభమైన ‘యువత పోరు’ ర్యాలీ కలెక్టర్ కార్యాలయం వరకు సాగింది. ఈ సందర్భంగా విద్యార్థులకు ఫీజు రీయింబర్స్ మెంట్ వెంటనే విడుదల చేయాలని నినాదాలు చేశారు. అనంతరం మల్లాది విష్ణు మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వ్యవస్థలన్నింటినీ నిర్వీర్యం చేసిందని విమర్శించారు. మూడు రాజకీయ పార్టీలు కలిసి పాలన చేస్తున్నా.. 10 నెలల కాలంలో పేదవాడికి ఏ ఒక్క ప్రయోజనం చేకూరలేదన్నారు. పైగా భారాలు వేస్తూ రాష్ట్ర ప్రజల రక్తాన్ని పీల్చేస్తున్నారని దుయ్యబట్టారు. ముఖ్యంగా కూటమి పాలనలో యువకులు, నిరుద్యోగులు, విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని మల్లాది విష్ణు ఆవేదన వ్యక్తం చేశారు. సకాలంలో ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలు విడుదల చేయకపోవడంతో లక్షలాది మంది విద్యార్ధులు ఆందోళన చెందుతున్నారన్నారు. మొత్తం రూ.7,100 కోట్ల మేర బకాయిలు ఉంటే.. ఈ బడ్జెట్లో కేవలం రూ.2,600 కోట్లు కేటాయించడం దుర్మార్గమన్నారు. విద్యార్ధుల సంఖ్యను కుదించేందుకు ఈ ప్రభుత్వం కుట్ర చేస్తోందని ఆరోపించారు.
వైద్య కళాశాలలపై ప్రైవేటు కత్తి
వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన మంచి ప్రజలకు ఎక్కడా కనిపించకూడదని కూటమి ప్రభుత్వం కుట్ర పన్నుతున్నట్లు మల్లాది విష్ణు ఆరోపించారు. ఇందులో భాగంగా కొత్త వైద్య కళాశాలలను ప్రైవేటుపరం చేస్తూ.. పేదింటి బిడ్డలకు వైద్య విద్యను దూరం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రస్తుత విద్యా సంవత్సరం 700 సీట్లు కోల్పోగా, వచ్చే ఏడాది అదనంగా వచ్చే సీట్లతో కలిపి మొత్తం 2,500 సీట్లను కోల్పోవాల్సి వస్తోందని చెప్పారు. ఇప్పటికైనా ప్రభుత్వం నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.
కూటమి కుట్రతో యువశక్తి నిర్వీర్యం
నిరుద్యోగ యువతకు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను కూటమి ప్రభుత్వం విస్మరించిందని మల్లాది విష్ణు ఆరోపించారు. 20 లక్షల ఉద్యోగాలు లేదా ప్రతినెలా 3 వేల రూపాయల చొప్పున నిరుద్యోగభృతి చెల్లిస్తానంటూ ఇచ్చిన హామీ ఏమైందని ఈ సందర్భంగా ప్రశ్నించారు. మెగా డీఎస్సీ విషయంలోనూ అతీగతీ లేదన్నారు. ఈ అంశాలపై ఆనాడు ఎన్నికల సభలలో చంద్రబాబుతో కలిసి వేదికను పంచుకున్న పవన్ కళ్యాణ్, పునంధేశ్వరి.. ఎందుకు నోరు మెదపరన్నారు. సూపర్ సిక్స్ హామీలన్నింటినీ గాలికొదిలేశారని.. వైఎస్ జగన్మోహన్ రెడ్డి కన్నా రెట్టింపు సంక్షేమాన్ని అందిస్తామని, తీరా అధికారంలోకి వచ్చాక అన్ని వర్గాల ప్రజలను మోసగించారని మండిపడ్డారు. అదే గత వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో అమ్మఒడి నుంచి ఫీజు రీయింబర్స్ మెంట్ వరకు చెప్పిన తేదీకే పథకాలను అమలు చేసినట్లు గుర్తుచేశారు. కానీ ఈ ప్రభుత్వం విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటోందని నిప్పులు చెరిగారు. చివరకు విద్యార్థుల సమస్యలపై శాంతియుత వాతావరణంలో కలెక్టర్ కు వినతిపత్రం ఇవ్వడానికి వెళ్తున్నా.. ఈ ప్రభుత్వం భయపడుతోందని ఎద్దేవా చేశారు. పోలీసుల సాయంతో ప్రజల గొంతు నొక్కాలని చూడటం ప్రభుత్వ నిరంకుశత్వ ధోరణికి అద్దంపడుతోందన్నారు. ఈ ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలపై పోరాడేందుకు ప్రతిఒక్కరూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి అడుగులో అడుగు వేసి ముందుకు రావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ అవుతు శ్రీశైలజారెడ్డి, కాపు కార్పొరేషన్ మాజీ ఛైర్మన్ అడపా శేషు, వైసీపీ కార్పొరేటర్లు శర్వాణీమూర్తి, కొండాయిగుంట మల్లేశ్వరి, ఇసరపు దేవి రాజా రమేష్, యరగొర్ల తిరుపతమ్మ శ్రీరాములు, కుక్కల అనిత రమేష్, జానారెడ్డి, ఉద్ధంటి సునీత సురేష్, పార్టీ వివిధ అనుబంధ సంఘాల నేతలు, నాయకులు, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.