17.03.2025
అప్పులపై ప్రభుత్వం శ్వేత పత్రం విడుదల చేయాలి
వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త మల్లాది విష్ణు
రాష్ట్ర అప్పులపై కూటమి ప్రభుత్వం శ్వేత పత్రం విడుదల చేయాలని వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు డిమాండ్ చేశారు. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 10 నెలల కాలంలో చేసిన రూ. 1.26 లక్షల కోట్ల అప్పులపై వెంటనే శ్వేత పత్రం విడుదల చేసి.. ఆ అప్పు ఎలా ఖర్చు చేశారో ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు. ఆ బాధ్యత కచ్చితంగా సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ లపై ఉందని తేల్చి చెప్పారు. అంతే కానీ తేలు కుట్టిన దొంగల్లా దాక్కోవటం సరైన పద్ధతి కాదన్నారు. ఏడాది తిరక్కుండానే లక్ష కోట్ల పైచిలుకు అప్పులు చేసినా.. సూపర్ సిక్స్ హామీలలో ఏ ఒక్కటి పూర్తిగా అమలు చేయలేకపోయారని మల్లాది విష్ణు విమర్శించారు. కూటమి పాలనలో ప్రజలకు జరిగిన మేలు గుండు సున్నా అని ఎద్దేవా చేశారు. అదే గత వైఎస్ జగన్ ప్రభుత్వం ఐదేళ్ల కాలంలో చేసిన అప్పులు రూ. 3,39,590 కోట్లు మాత్రమే అయినా.. అందులో అక్షరాల రూ.2,83,866 కోట్ల మేర పేద, మద్య తరగతి ప్రజలకు డీబీటీ, నాన్-డీబీటీ ద్వారా మేలు చేకూర్చినట్లు వెల్లడించారు. 2016 డిసెంబర్ నాటికి ఏపీలో 11.77 శాతం ఉన్న పేదరికం.. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత 6.06 శాతానికి తగ్గిందని గుర్తుచేశారు. కానీ కూటమి ప్రభుత్వం తీసుకొచ్చిన రూ. 1.26 లక్షల కోట్లు ఏమయ్యాయని సూటిగా ప్రశ్నించారు. సాక్షాత్తూ రాష్ట్ర ముఖ్యమంత్రికే ఆర్థిక లెక్కలపై అవగాహన లేకపోవటం శోచనీయమన్నారు. ఈ ప్రభుత్వంలో చేస్తున్న ఖర్చులకు లెక్కాపత్రం లేకుండా పోయిందని.. ప్రభుత్వం చేసిన అప్పుల కారణంగా ప్రతి వ్యక్తిపై లక్షల రుణ భారం పడుతోందని ఆరోపించారు.
అమరావతికి ఇస్తున్నది అప్పే
అమరావతి రాజధాని నిర్మాణం కోసం కూటమి ప్రభుత్వం చేస్తున్న అప్పులపై ముఖ్యమంత్రి చంద్రబాబు పచ్చి అబద్దాలు మాట్లాడుతున్నారని మల్లాది విష్ణు ఆరోపించారు. అమరావతి కోసం కేంద్రం రూ.15వేల కోట్లు ప్రపంచబ్యాంక్ ద్వారా ఇప్పిస్తోందని, ఇది పూర్తి గ్రాంట్ అంటూ ఇప్పటి వరకు చేసిన వాదనలు పూర్తి అవాస్తవాలేనన్నారు. పార్లమెంట్ సాక్షిగా అమరావతి కోసం రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అప్పులపై కేంద్ర మంత్రి పంకజ్ చౌదరి వెల్లడించిన అంశాలతో ఇప్పటి వరకు సీఎం చంద్రబాబు చేస్తున్న బుకాయింపులన్నీ అసత్యాలేనని బయటపడిందన్నారు. కేంద్రం కేవలం పది శాతం మాత్రమే అంటే రూ. 1500 కోట్లు వరకే గ్రాంట్గా ఇస్తుందని వెల్లడించారు. ప్రస్తుతం ప్రపంచ బ్యాంకు నుంచి రూ. 15 వేల కోట్లు, హడ్కో నుంచి రూ. 11 వేల కోట్లు, జర్మనీకి చెందిన కేఎఫ్డబ్ల్యూ నుంచి రూ.5 వేల కోట్లు .. మొత్తం రూ. 31 వేల కోట్లు మళ్లీ అప్పులు చేస్తున్నారని మల్లాది విష్ణు విమర్శించారు. వీటితోపాటు సీఆర్డీఏ ద్వారా నిధులు సమీకరించాలని చూస్తున్నారన్నారు. గతంలో చేసిన అప్పులు కూడా కలిపి ఇప్పటికే రూ. 37 వేల కోట్లు అప్పులు చేశారని.. ఇవన్నీ ఎప్పుడు చెల్లిస్తారు.. ఎలా చెల్లిస్తారని ప్రశ్నించారు. కేవలం 10 నెలల కూటమి పాలనలోనే రాష్ట్రం అథోగతి పాలైందని.. రాష్ట్ర అప్పులు, ఖర్చులపై కచ్చితంగా శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.