తేదీ: 17-03-2025,
శాసనమండలి.
పోలీసులపై కక్షకట్టి వీఆర్కు పంపిందే వైసీపీ ప్రభుత్వం : హోంమంత్రి వంగలపూడి అనిత
మా కూటమి ప్రభుత్వ సంస్కృతి,విధానం అది కాదు
కొందరు పోలీసులకు ఏళ్లకేళ్లు గత ప్రభుత్వం జీతాలివ్వలేదు
వీఆర్లో పోలీసులకు వేతనం ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తాం
పోలీసుల గురించి గత ప్రభుత్వాన్నెందుకు అడగలేదు?
వీఆర్పై వైఎస్ఆర్సీపీ ఎంఎల్సీ ఏసురత్నం ప్రశ్నకు హోంమంత్రి అనిత కౌంటర్
మార్చి, 17; కక్షకట్టి పగబట్టి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం పోలీసులను వీఆర్కు పంపిందని హోంమంత్రి వంగలపూడి అనిత వెల్లడించారు. ఆ విధానం, సంస్కృతి కూటమి ప్రభుత్వానిది కాదని ఆమె స్పష్టం చేశారు. కొందరు పోలీసులకు ఏళ్లకేళ్లు గత ప్రభుత్వం జీతాలివ్వలేదని పేర్కొన్నారు. 2014-19 సమయంలో వీఆర్లో ఉన్నా పోలీసులకు సగం జీతం అందించామన్నారు. వీఆర్ సాకుతో గత వైసీపీ ప్రభుత్వం మూడునాలుగేళ్లపాటు ఏ పోలీసుకు పైసా జీతం ఇవ్వలేదన్నారు. టీడీపీ సానుభూతిపరులని భావించి జగన్ ప్రభుత్వంలో పోలీసులను వీఆర్ లో ఉంచారన్నారు. ప్రస్తుతం 199 మంది పోలీసులు వీఆర్లో ఉన్నారని శాసనమండలికి హోంమంత్రి వివరించారు. టీడీపీ ప్రభుత్వంలో ఆరోపణలు,వివాదాస్పద నిర్ణయాలప్పుడే పోలీసులను వీఆర్కు పంపినట్లు తెలిపారు. విచారణ పూర్తై అనుమతిరాగానే పెండింగ్ బిల్లులు,శాలరీలు ఒకేసారి చెల్లిస్తున్నట్లు వీఆర్పై కూటమి ప్రభుత్వ విదానాన్ని తెలియజేశారు. గత ప్రభుత్వంలో ఏళ్లకేళ్లు జీతాలివ్వకపోయినా ఎందుకు మౌనం వహించారని వైసీపీ ఎంఎల్సీ ఏసురత్నాన్ని హోంమంత్రి అనిత సూటిగా ప్రశ్నించారు. వీఆర్ లో శాంక్షన్డ్ పోస్టులు 26 ఉన్నాయన్నారు..వీరెవరికి జీతాలు ఆగవన్నారు. డిప్యుటేషన్ వేకెన్సి కింద ఏసీబీ, విజిలెన్స్ లో సేవలు వినియోగించుకుంటామన్నారు. పోలీసు అయ్యుండి సాటి పోలీసుల గురించి ఎంఎల్సీ ఏసురత్నం నాడెందుకు ప్రశ్నించలేకపోయారో చెప్పాలన్నారు. సరెండర్ లీవ్, జీతాలు ఇవ్వలేదు, ఇచ్చినవి కూడా ఒకటో తేదీన ఇవ్వలేదు, భద్రత కల్పించలేదు..అప్పుడేం చేశారని నిలదీశారు. మానవతా దృక్పథంతో పోలీసుల సంక్షేమానికి కృషి చేస్తున్నామని హోంమంత్రి వెల్లడించారు. వీఆర్లో ఉన్నవారికి పూర్తి జీతాలివ్వాలన్న ఛైర్మన్ మోషేన్ రాజు సూచనను పరిశీలించి తగు చర్యలు చేపడతామన్నారు.
అనకాపల్లి జిల్లా చినగుమ్ములూరు వద్ద జరిగిన రొయ్యల పరిశ్రమ బస్సు ప్రమాదంపై హోంమంత్రి అనిత స్పందించారు. రోడ్డు ప్రమాదంపై ఆమె ఆరా తీశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యసేవలందించాలన్నారు. పాయకరావుపేట ఎస్.రాయవరానికి చెందిన బాధితులతో ఫోన్ లో మాట్లాడి హోంమంత్రి ధైర్యం చెప్పారు. నక్కపల్లి హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను తక్షణమే పరామర్శించి, వారి యోగక్షేమాలు చూడాలని స్థానిక నేతలను హోంమంత్రి ఆదేశించారు.