బుడమేరు సమగ్రాభివృద్ధికి పరిపూర్ణంగా నిధులు కేటాయించాలి.
గత ఏడాది వరద భీభత్సానికి దెబ్బతిన్న వాగులు, చెరువులు, ఎన్.ఎస్.పి కాల్వల అభివృద్ధికి కూడా నిధులు ఇవ్వాలి.
ఆకస్మిక వరదల వల్ల మైలవరం నియోజకవర్గం పూర్తిగా దెబ్బతింది.
-ఏపీ అసెంబ్లీలో మైలవరం శాసనసభ్యులు వసంత కృష్ణప్రసాదు
ఎన్టీఆర్ జిల్లా, మైలవరం, 18.03.2025.
బుడమేరు అభివృద్ధితో పాటు, గత ఏడాది ఆకస్మిక వరదల వల్ల మైలవరం నియోజకవర్గ వ్యాప్తంగా దెబ్బతిన్న వాగులు, చెరువులు, నాగార్జునసాగర్ ప్రాజెక్టు కాలువల అభివృద్ధికి కూడా నిధులు కేటాయించాలని మైలవరం శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణప్రసాదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీలో ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
ఏపీ అసెంబ్లీలో స్థానిక శాసనసభ్యులు వసంత కృష్ణప్రసాదు మంగళవారం మాట్లాడుతూ గత ఏడాది సంభవించిన వరదల భీభత్సానికి మైలవరం నియోజకవర్గం పూర్తిగా దెబ్బతిందన్నారు. అప్పట్లో 35 సెంటిమీటర్ల వర్షపాతం కురిసిందన్నారు. దీనివల్ల కోతులవాగు, పులివాగు, ఒకసారిగా వరద బీభత్సంతో పొంగి పొర్లాయని పేర్కొన్నారు. ఈ వాగులు అన్ని బుడమేరులో కలుస్తాయన్నారు. వీటితోపాటు 50కి పైగా చెరువుల కట్టలు, నాగార్జునసాగర్ ప్రాజెక్టు కాలువలు, వాగులు, వంకలు కూడా చాలాచోట్ల గండ్లు పడి తెగిపోయాయని పేర్కొన్నారు.
బుడమేరు అభివృద్ధికి ప్రభుత్వం రూ.39.05 కోట్లు కేటాయించినట్లు నేడు పత్రికల ద్వారా తెలిసిందన్నారు. ఇందులో బుడమేరు హెడ్ రెగ్యులేటర్ మరమ్మతులకు రూ.1.08 కోట్లు, మిగిలిన పనులకు రూ.37.97 కోట్లు కేటాయించారన్నారు. బుడమేరుకు పడిన ప్రధాన గండికి ఇరువైపులా రక్షణ గోడ నిర్మాణానికి నిధులు కేటాయించారన్నారు.
బుడమేరు 70 శాతంకు పైగా మైలవరం నియోజకవర్గంలో ఉందన్నారు. దీనికి అనుబంధంగా ఉన్న కోతుల వాగు, పులివాగులు కూడా ఇక్కడే ఉన్నాయన్నారు. గత ఏడాది ఆగస్టు, సెప్టెంబర్ మాసాల్లో వచ్చిన ఆకస్మిక వరదల వల్ల గ్రామాలకు రక్షణగా ఏర్పాటు చేసిన కరకట్టలు, పొలాలకు రక్షణగా ఏర్పాటు చేసిన కట్టలు కూడా పూర్తిగా కొట్టుకుపోయాయన్నారు. ఈ వాగులు పొంగిన కారణంగా నియోజకవర్గ వ్యాప్తంగా 50కి పైగా చెరువులు పూర్తిగా తెగిపోయాయన్నారు. వాగులు, బుడమేరు కట్టల అభివృద్ధికి ప్రభుత్వం రూ.35 కోట్లకు పైగా అంచనాలు రూపొందించినట్లు పేర్కొన్నారు. ఇంకా వాగులు, చెరువులు, సాగర్ కాల్వల అభివృద్ధికి కూడా నిధులు కేటాయించాలని అన్నారు. గతంలో అప్పటికప్పుడు యుద్ధప్రాతిపదికన తాత్కాలికంగా గండ్లు పూడ్చామని, దానికి కూడా నిధులు విడుదల చేయలేదన్నారు.
బుడమేరును, దానికి అనుబంధంగా ఉన్న కాల్వలను, వాగులను, చెరువులను శాశ్వతంగా అభివృద్ధి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఇవన్నీ అభివృద్ధి చేయకుండా మళ్ళీ అకాల వర్షాలు వస్తే మళ్ళీ విజయవాడకు వరదనీటి ముంపు తప్పదని హెచ్చరించారు. గతంలో బుడమేరు వరద నీటి ముంపు ప్రభావాన్ని, దానివల్ల జరిగిన నష్టాన్ని సీఎం చంద్రబాబు మంత్రి లోకేష్ , జలవనరుల శాఖ మాత్యులు నిమ్మల రామానాయుడు ప్రత్యక్షంగా చూశారని పేర్కొన్నారు.
గతంలో చేసిన తాత్కాలిక మరమ్మతులకు, ఇప్పుడు చేపట్టవలసిన పనులకు, బుడమేరుతో పాటు, దానికి అనుబంధంగా ఉన్న వాగులు, చెరువులు, ఎన్.ఎస్.పి కాల్వల సమగ్రాభివృద్ధికి పరిపూర్ణంగా నిధులు కేటాయించి, భవిష్యత్తులో ఎటువంటి విపత్తులు రాకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని ఎమ్మెల్యే కృష్ణప్రసాదు ఏపీ అసెంబ్లీలో విజ్ఞప్తి చేశారు.