Home Andhra Pradesh చేయీచేయీ క‌లుపుదాం.. ప‌ర్యాట‌కుల‌కు ఆత్మీయ ఆతిథ్యమిద్దాం..

చేయీచేయీ క‌లుపుదాం.. ప‌ర్యాట‌కుల‌కు ఆత్మీయ ఆతిథ్యమిద్దాం..

2
0

 *ఎన్‌టీఆర్ జిల్లా, మార్చి 19, 2025*

చేయీచేయీ క‌లుపుదాం..

ప‌ర్యాట‌కుల‌కు ఆత్మీయ ఆతిథ్యమిద్దాం..

– *సేవా రంగ వృద్ధి ఉమ్మ‌డి ల‌క్ష్యానికి స‌మ‌ష్టిగా కృషిచేద్దాం*

– *గ్రోత్ ఇంజిన్‌గా వాణిజ్యం, హోట‌ళ్లు, రెస్టారెంట్స్ విభాగం*

– *ప‌ర్యాట‌కుల‌కు మ‌ధురానుభూతి మిగిల్చేలా టూరిజం ప్యాకేజీలు*

– *స్వ‌ర్ణాంధ్ర @ 2047, స్వ‌ర్ణాంధ్ర‌-స్వ‌చ్ఛాంధ్ర దిశ‌గా వ‌డివ‌డిగా అడుగులు*

– *సీసీఎల్ఏ, జిల్లా ప్ర‌త్యేక అధికారి జి.జ‌య‌ల‌క్ష్మి, క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ‌, సీపీ ఎస్‌వీ రాజశేఖ‌ర‌బాబు*

రాష్ట్ర ప్ర‌భుత్వం  ముఖ్య‌మంత్రి దార్శ‌నిక‌త‌కు అనుగుణంగా స్వ‌ర్ణాంధ్ర @ 2047, స్వ‌ర్ణాంధ్ర‌-స్వ‌చ్ఛాంధ్ర ల‌క్ష్యాల సాధ‌న‌కు ప్ర‌ణాళిక ప్ర‌కారం కృషిచేయ‌డం జ‌రుగుతోంద‌ని.. ఇందులో భాగంగా ఎన్‌టీఆర్ జిల్లాలో భాగ‌స్వామ్య ప‌క్షాల స‌మ‌ష్టి కృషితో ఆతిథ్య రంగంతో స‌హా సేవారంగ స‌మ‌గ్రాభివృద్ధికి చ‌ర్య‌లు తీసుకుంటున్న‌ట్లు సీసీఎల్ఏ, జిల్లా ప్ర‌త్యేక అధికారి జి.జ‌య‌ల‌క్ష్మి, క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ‌, సీపీ ఎస్‌వీ రాజశేఖ‌ర‌బాబు అన్నారు.

బుధ‌వారం విజ‌య‌వాడ‌లోని హోట‌ల్ హ‌య‌త్ ప్లేస్‌లో స్వ‌చ్ఛ‌తా గ్రీన్ లీఫ్ రేటింగ్ (ఎస్‌జీఎల్ఆర్‌), స్వర్ణాంధ్ర‌-స్వ‌చ్ఛాంధ్ర‌, పీ4 విధానం, టూరిజం స‌హా సేవా రంగ అభివృద్ధిపై ఛాంబ‌ర్ ఆఫ్ కామ‌ర్స్‌, హోట‌ల్స్ అసోసియేష‌న్ ఆధ్వ‌ర్యంలో ప్ర‌త్యేక స‌ద‌స్సు జ‌రిగింది. ఈ స‌ద‌స్సుకు ముఖ్య అతిథిగా హాజ‌రైన జిల్లా ప్ర‌త్యేక అధికారి జ‌య‌ల‌క్ష్మి మాట్లాడుతూ ప‌ర్యాట‌కుల‌కు ఎప్ప‌టికీ గుర్తుండిపోయేలా మౌలిక వ‌స‌తుల‌తో ఆతిథ్య‌మివ్వాల్సిన అవ‌స‌ర‌ముంద‌న్నారు. హోట‌ళ్లు కూడా రిసెప్ష‌న్, చెక్ ఇన్‌, చెక్ అవుట్ స‌హా అన్ని విభాగాల‌నూ ప‌ర్యాట‌క మిత్ర విభాగాలుగా తీర్చిదిద్దుకోవాల‌ని.. ప‌ర్యాట‌కంలో జిల్లాల మ‌ధ్య పోటీత‌త్వం, స‌మ‌న్వ‌యం కూడా అవ‌స‌ర‌మ‌న్నారు. విజ‌య‌వాడ సౌంద‌ర్యాన్ని, ఆతిథ్య ఔన్న‌త్యాన్ని ప్ర‌తిబింబించేలా ట్యాగ్‌లైన్ రూప‌క‌ల్ప‌న‌కు కృషిచేసి.. ఇమేజ్‌ను నిల‌బెట్టేందుకు కృషిచేయాల‌న్నారు.

*ఉమ్మ‌డి ల‌క్ష్యాల సాధ‌న‌కు స‌మ‌ష్టి కృషి అవ‌స‌రం: క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ‌*

క‌లెక్ట‌ర్ ల‌క్ష్మీశ మాట్లాడుతూ స్వ‌ర్ణాంధ్ర @ 2047, స్వ‌ర్ణాంధ్ర‌-స్వ‌చ్ఛాంధ్ర ల‌క్ష్యాల‌పై స్ప‌ష్ట‌మైన అవ‌గాహ‌న పెంపొందించుకొని, ఉమ్మ‌డి ల‌క్ష్యాల సాధ‌న‌కు వివిధ ప‌క్షాల భాగ‌స్వామ్యాన్ని ప్రోది చేసేందుకు ఈ కార్య‌క్ర‌మాన్ని ఏర్పాటుచేసిన‌ట్లు తెలిపారు. ఎన్‌టీఆర్ జిల్లా ఆర్థిక వ్య‌వ‌స్థ‌లో 66 శాతం సేవారంగం వాటా ఉంద‌ని.. ఇంత‌టి ప్రాధాన్య‌మున్న రంగంలోని వాణిజ్యం, హోట‌ళ్లు, రెస్టారెంట్ల ఉప రంగంలో 2025-26 ఆర్థిక సంవ‌త్స‌రంలో 22.22 శాతం వృద్ధి ల‌క్ష్యాన్ని నిర్దేశించుకోవ‌డం జ‌రిగింద‌ని వివ‌రించారు. అదేవిధంగా నవ్య రాజ‌ధాని అమ‌రావ‌తికి గేట్‌వే అయిన విజ‌య‌వాడ‌తో పాటు ఎన్‌టీఆర్ జిల్లాను ప‌ర్యాట‌కంగా అభివృద్ది చేసేందుకు స‌మష్టి కృషి అవ‌స‌ర‌మ‌ని పేర్కొన్నారు. జిల్లాలో టెంపుల్ టూరిజంతో పాటు ఎకో, హిస్టారిక‌ల్ ప‌ర్యాట‌కాన్ని ప్రోత్స‌హించేందుకు ప్ర‌త్యేక ప్యాకేజీలు రూపొందించిన‌ట్లు తెలిపారు. యువ‌త‌ను గైడ్లుగా తీర్చిదిద్దేందుకు శిక్ష‌ణ కార్య‌క్ర‌మాలు నిర్వ‌హిస్తున్న‌ట్లు తెలిపారు. ప‌ర్యావ‌ర‌ణ హిత స్వ‌చ్ఛ‌త‌, పారిశుద్ధ్యంలో అత్యుత్త‌మ ప్ర‌మాణాలు పాటిస్తూ ప‌ర్యాట‌కుల‌కు మ‌ధురానుభూతులు మిగిల్చే హోట‌ళ్లు, లాడ్జిలు వంటివాటికి ప్ర‌భుత్వం గ్రీన్ లీఫ్ రేటింగ్ ఇవ్వ‌నుంద‌ని.. స్థానిక స‌మాజం, ప‌ర్యావ‌ర‌ణాన్ని దృష్టిలో ఉంచుకొని బాధ్య‌తాయుత ప‌ర్యాట‌కంలో భాగంగా ఆతిథ్య రంగంలో సుర‌క్షిత పారిశుద్ధ్య నిర్వ‌హ‌ణ‌ను ప్రోత్స‌హించేందుకు ఈ గ్రీన్ లీఫ్ రేటింగ్ వ్య‌వ‌స్థ‌ను ఆవిష్క‌రించిన‌ట్లు వివ‌రించారు. హోట‌ళ్లు, లాడ్జీలు, హోమ్‌స్టేలు, ధ‌ర్మ‌స్థ‌లాలు త‌దిత‌ర ఆతిథ్య సౌక‌ర్యాల‌కు గ్రీన్ లీఫ్ రేటింగ్ ఇవ్వ‌డం జ‌రుగుతుంద‌ని..ఇందుకు మండ‌ల‌, డివిజ‌న్‌, జిల్లాస్థాయి క‌మిటీలు ఏర్పాటైన‌ట్లు తెలిపారు.

పోలీస్ కమిషనర్ ఎస్‌వీ రాజ‌శేఖ‌ర‌బాబు మాట్లాడుతూ న‌గ‌రంలో రాత్రి 12 గంటల వరకు హోటళ్ల‌ను తెరచి ఉంచుకునే విధంగా ఇప్ప‌టి నుంచి మూడు నెలలపాటు అమలు చేసి త‌ర్వాత ప‌రిస్థితిని విశ్లేషించి పొడిగింపుపై తగు నిర్ణయం తీసుకోవడం జరుగుతుందన్నారు. విజయవాడ నగరం అద్భుత నగరమని,ఇక్కడకు వచ్చే పర్యాటకులకు శాంతియుత వాతావరణం, భ‌ద్ర‌త కల్పించేందుకు పోలీస్ శాఖ పూర్తి సహకారం అందిస్తుంద‌ని తెలిపారు. ట్రాఫిక్ నియంత్రణలో ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్, డ్రోన్స్ వినియోగం వంటి అత్యాధునిక సాంకేతికతను వినియోగిస్తున్న‌ట్లు తెలిపారు. దాదాపు 3,500 సీసీ కెమెరాల‌ను వినియోగిస్తున్నామ‌ని.. ఇలాంటి చ‌ర్య‌ల వ‌ల్ల క్రైమ్ డిటెక్ష‌న్ సుల‌భ‌త‌రమ‌వుతుందన్నారు. అసాంఘిక శ‌క్తులపై ఉక్కు పాదం మోపేందుకు నిఘాను క‌ట్టుదిట్టం చేసిన‌ట్లు తెలిపారు.

విజ‌య‌వాడ న‌గ‌ర‌పాల‌క సంస్థ క‌మిష‌న‌ర్ ధ్యాన‌చంద్ర హెచ్ఎం మాట్లాడుతూ మూడు కాలువలు, కృష్ణా న‌దితో న‌గ‌రం సుంద‌ర న‌గ‌రంగా భాసిల్లుతోంద‌ని.. ఇంత‌టి విశిష్ట న‌గ‌రాన్ని స్వ‌చ్ఛ‌త‌తో పాటు అన్ని విధాలా అభివృద్ధి చేసేందుకు చొర‌వ చూపుతున్న‌ట్లు తెలిపారు. న‌గ‌రంలోని మూడు నియోజ‌క‌వ‌ర్గాల్లోనూ ఈట్ స్ట్రీట్ ఏర్పాటుకు చ‌ర్య‌లు తీసుకుంటున్న‌ట్లు వెల్ల‌డించారు. స్వ‌చ్ఛ స‌ర్వేక్ష‌ణ్‌లో విజ‌య‌వాడ ముందు వ‌రుస‌లో ఉంటోంద‌ని ఈ ఏడాది కూడా ఉత్త‌మ స్థానంలో నిలిపేందుకు అంద‌రూ కృషిచేయాల‌ని పిలుపునిచ్చారు.

కార్య‌క్ర‌మంలో ఏపీ హోట‌ల్స్ అసోసియేష‌న్ ప్రెసిడెంట్ ఆర్ వీరాస్వామి, ఏపీ ఛాంబ‌ర్ ఆఫ్ కామ‌ర్స్ ప్రెసిడెంట్ పొట్లూరి భాస్క‌ర్‌, విజ‌య‌వాడ హోట‌ల్స్ అసోసియేష‌న్ ప్రెసిడెంట్ ర‌మ‌ణ‌, జెడ్‌పీ సీఈవో క‌న్న‌మ‌నాయుడు, జిల్లా ప‌ర్యాట‌క అధికారి ఎ.శిల్ప‌, జిల్లా ప‌రిశ్ర‌మ‌ల అధికారి బి.సాంబ‌య్య, ఛాంబ‌ర్ ఆఫ్ కామ‌ర్స్‌, హోట‌ల్స్ అసోసియేష‌న్ ప్ర‌తినిధులు త‌దిత‌రులు హాజ‌ర‌య్యారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here