ఎన్టీఆర్ జిల్లా, మార్చి 20, 2025
మిషన్ వాత్సల్యతో శిశు క్షేమం, సంక్షేమం
గ్రామ, వార్డుస్థాయి కమిటీలు క్రియాశీలం కావాలి
15రోజులకోసారి సమావేశాలు నిర్వహించాలి
కమిటీలకు డివిజన్ స్థాయిలో వర్క్షాప్ల నిర్వహణ
జిల్లాస్థాయి కమిటీ సమావేశంలో కలెక్టర్ డా. జి.లక్ష్మీశ
నిస్సహాయ స్థితిలో ఉన్న, అవసరాలుగల చిన్నారుల క్షేమం, సంక్షేమం లక్ష్యంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలుచేస్తున్న మిషన్ వాత్సల్యను లక్ష్యాలకు అనుగుణంగా ముందుకు తీసుకెళ్లేందుకు ఏర్పాటైన గ్రామ, వార్డుస్థాయి కమిటీలు క్రియాశీలం కావాలని కలెక్టర్ డా. జి.లక్ష్మీశ అన్నారు.
గురువారం కలెక్టర్ లక్ష్మీశ అధ్యక్షతన కలెక్టరేట్లో మిషన్ వాత్సల్య-శిశు సంక్షేమ, రక్షణ జిల్లాస్థాయి కమిటీ సమావేశం జరిగింది. మిషన్ వాత్సల్య లక్ష్యాలు, జిల్లాలో వాటి సాధనలో పురోగతిపై సమావేశంలో చర్చించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ శిశు సంరక్షణ చట్టాలు, కుటుంబ ఆధారిత సంరక్షణకు ప్రోత్సాహం, సంస్థాగత మద్దతు, ఆర్థిక సహకారం, శిశు సంరక్షణ పథకాలు తదితరాల అనుసంధానంతో మిషన్ వాత్సల్య అమలుకు చర్యలు తీసుకుంటున్నామని.. ఈ క్రమంలో సర్పంచ్/కౌన్సిలర్/కార్పొరేటర్ ఛైర్మన్గా గ్రామ, వార్డుస్థాయి కమిటీలు ఏర్పాటయ్యాయని.. ఇవి 15 రోజులకోసారి తప్పనిసరిగా సమావేశం కావాలని సూచించారు. డివిజన్ స్థాయిలో కమిటీలకు వర్క్షాప్లు నిర్వహించాలని.. బాలల హక్కుల పరిరక్షణ, బాల్య వివాహాల నిర్మూలన, విద్యా సాధికారత, గ్రామ పంచాయతీ అభివృద్ధి ప్రణాళిక (జీపీడీపీ)లో శిశు మద్దతు కార్యకలాపాలు, ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు, ప్రస్తుతం అమల్లో ఉన్న చట్టాలు తదితరాలపై కమిటీ సభ్యులకు అవగాహన కల్పించాలన్నారు. శిశు సంరక్షణ సంస్థల్లోని చిన్నారులకు సరైన విద్య అందడం కూడా ముఖ్యమని.. ఈ విషయంలో జిల్లా శిశు సంరక్షణ యూనిట్ల అధికారులు.. విద్యాశాఖ, సర్వశిక్షా అభియాన్ విభాగాల అధికారులతో సమన్వయం చేసుకోవాలని సూచించారు. బాల్య వివాహం అనేది ఓ సాంఘిక దురాచారమని, అది బాలికలను విద్య, ఆరోగ్యం, అభివృద్ధికి ఆటంకం కలిగించడమే కాకుండా వారి కలలను సాకారం చేసుకునే అవకాశాలను దూరం చేస్తుందని వివరించారు. బాల్య వివాహాల వల్ల భవిష్యత్తులో ఎదురయ్యే అనారోగ్య సమస్యలతో పాటు ఇతర దుష్పరిణామాలపై ప్రజల్లో పెద్దఎత్తున అవగాహన కల్పించాలన్నారు. బాలికల విద్య, ఆర్థిక సాధికారతపై ప్రత్యేకంగా దృష్టిసారించాలని కలెక్టర్ లక్ష్మీశ అన్నారు.
సమావేశంలో జిల్లా న్యాయసేవల సంస్థ (డీఎల్ఎస్ఏ) కార్యదర్శి కేవీ రామకృష్ణయ్య, డీసీపీ కేజీవీ సరిత, జెడ్పీ సీఈవో వై.కన్నమనాయుడు, ఐసీడీఎస్ పీడీ డి.శ్రీలక్ష్మి, జిల్లా శిశు సంరక్షణ అధికారి ఎం.రాజేశ్వరరావు, జిల్లా గిరిజన సంక్షేమ అధికారి జి.మహేశ్వరరావు, ఏసీపీ కె.లతాకుమారి, సాంఘిక సంక్షేమ అధికారి కేఎస్ శిరోమణి, లేబర్ కమిషనర్ సీహెచ్ ఆశారాణి, డిప్యూటీ డీఎంహెచ్వో డా. పద్మావతి, జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి ఎస్.శ్రీనివాసరావు, జిల్లా ప్రొహిబిషన్ ఆఫీసర్ టి.జ్యోతి, డీసీపీయూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.