నర్సింగ్ విద్యా రంగంలో సంస్కరణలకు శ్రీకారం
ఆయా ప్రాంతాల అవసరాల మేరకు మాత్రమే నర్సింగ్ కాలేజీల స్థాపనకు అనుమతులు
మౌలిక వసతులు, విద్యా నాణ్యత లోపాలపై కఠిన చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశం
2019-24లో నియమాలు ఉల్లంఘించి 133 సంస్థలకు అనుమతినిచ్చిన అప్పటి ప్రభుత్వం
నర్సింగ్ విద్యా సంస్థల్లో లోపాలపై నోటీసుల జారీకి మంత్రి సత్యకుమార్ యాదవ్ ఆదేశం
గుర్తించిన లోపాల్ని జూన్ 15లోగా సవరించకుంటే ప్రవేశాలకు నిరాకరణ
మూడు గంటల పాటు వివిధ అంశాలు, సమస్యలపై మంత్రి సమీక్ష
అమరావతి,మార్చ్ 21
రాష్ట్రంలో ఇబ్బడిముబ్బడిగా నర్సింగ్ విద్యా సంస్థల ఏర్పాటు, తదనంతర పరిణామాలపై దృష్టి సారించిన కూటమి ప్రభుత్వం ఈ రంగాన్ని ప్రక్షాళన చేయడానికి శ్రీకారం చుట్టింది. ప్రజలకు ఉన్నతమైన వైద్య సేవల్ని అందించడానికి డాక్టర్లతో పాటు అంతే ప్రధానమైన ఉన్నత ప్రమాణాలు కలిగిన నర్సుల్ని అందించే దిశగా పలు చర్యల్ని చేపట్టాలని నిర్ణయించింది. రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖా మంత్రి సత్యకుమార్ యాదవ్ ఈ కీలక రంగానికి సంబంధించిన పలు అంశాల్ని, సమస్యల్ని సంబంధిత ఉన్నతాధికారులతో వెలగపూడిలోని ఏపీ సచివాలయంలో శుక్రవారంనాడు దాదాపు మూడు గంటలపాటు చర్చించి పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
పలు సంవత్సరాలుగా నర్సింగ్ విద్యా సంస్థల ఏర్పాటుకు స్వీయ ప్రతిపాదనలతో ముందుకొచ్చిన వారికి రాష్ట్ర ప్రభుత్వాలు అనుమతులు మంజూరు చేయడంతో…రాష్ట్ర వ్యాప్తంగా 571 నర్సింగ్ స్కూళ్లు, కాలేజీలు ఏర్పాటయ్యాయి. ఇందులో 21 ప్రభుత్వ సంస్థలు కాగా 550 ప్రైవేట్ రంగంలో ఉన్నాయి. ఈ సంస్థల నుండి ఏడాదికి 30,220 మంది నర్సులు ఉత్తీర్ణులవుతున్నారు. ఈ నేపథ్యంలో నర్సింగ్ విద్యా సంస్థల ఏర్పాటు, వాటిలో నర్సింగ్ విద్య నైపుణ్యతపై వివిధ అంశాల్ని సమగ్రంగా పరిశీలించాలని మంత్రి సత్యకుమార్ యాదవ్ కొంత కాలం క్రిందట ఆదేశించారు. ఈ మేరకు జరిగిన పరిశీలనా ఫలితాల్ని మంత్రి ఈరోజు సుదీర్ఘంగా చర్చించారు.
రాష్ట్ర అవసరాలతో నిమిత్తం లేకుండా పలు నర్సింగ్ విద్యా సంస్థలు ఏర్పాటైన నేపథ్యం, దాని పరిణామాల్ని దృష్టిలో పెట్టుకుని గుర్తించిన అవసరాల మేరకు మాత్రమే అట్టి విద్యాసంస్థల ఏర్పాటును ప్రోత్సహించాలని నేటి సమీక్షా సమావేశంలో నిర్ణయించారు. గతంలో మంత్రి ఇచ్చిన ఆదేశాల మేరకు జిల్లాల వారీగా డిమాండ్ మరియు సరఫరా పరిస్థితిని డిఎంఇ అధికారులు మదింపు చేశారు. జనాభా ఆధారంగా ప్రతి వెయ్యి మందికి ముగ్గురు నర్సులు, రెండు ఆసుపత్రి పడకలు ఉండాలన్న డబ్ల్యుహెచ్ ఓ ప్రమాణాన్ని పరిగణనలోకి తీసుకుని ఈ మదింపు చేశారు. దీని ఆధారంగా అవసరాల కంటే బాగా తక్కువగా నర్సుల లభ్యత ఉన్న 8 జిల్లాల్లో నూతన నర్సింగ్ విద్యా సంస్థల ఏర్పాటుకు ప్రాధాన్యతనివ్వాలని నిర్ణయించారు. నర్సుల కొరత ఎక్కువగా ఉన్న జిల్లాలుగా… శ్రీ సత్యసాయి, నంద్యాల, ఏలూరు, కోనసీమ, అన్నమయ్య, శ్రీకాకుళం, బాపట్ల మరియు అల్లూరు సీతారామరాజు జిల్లాల్ని ఆ క్రమంలో గుర్తించారు. అవసరాల కంటే ఎక్కువగా నర్సుల లభ్యత ఉన్న జిల్లాలు…విశాఖపట్నం, గుంటూరు, తిరుపతి, తూర్పుగోదావరి, నెల్లూరు, కడప, ప్రకాశం మరియు అనంతపురం
రాష్ట్రంలో నర్సింగ్ విద్యా సంస్థల ఏర్పాటు క్రమాన్ని పరిశీలించగా…2019-20 కాలంలో 133 విద్యా సంస్థల (మొత్తంలో దాదాపు నాలుగో వంతు) ఏర్పాటుకు అప్పటి ప్రభుత్వం అనుమతించినట్లు వెల్లడయ్యింది. వీటి ద్వారా ఏడాదికి 6,460 నర్సులు( మొత్తంలో 22 శాతం) ఉత్తీర్ణులవుతున్నారు. ఇదే కాలంలో 28 విద్యా సంస్థలకు నియమాలకు విరుద్ధంగా పేరెంట్ ఆసుపత్రులు లేకపోయినా అనుమతులు మంజూరైనట్లు అధికారులు వెల్లడించారు.
ప్రైవేట్ రంగంలోని 548 నర్సింగ్ విద్యా సంస్థలకు సంబంధించి అధికారులు చేపట్టిన డాక్యుమెంట్ల పరిశీలన ఫలితాల్ని అధికారులు మంత్రి సత్యకుమార్ యాదవ్ కు వివరించారు. వీటిలో 427 సంస్థలు ( 78 శాతం) నియమాల ప్రకారం ఉండాల్సిన పేరెంట్ ఆసుపత్రుల వివరాల్ని ప్రభుత్వానికి అందించలేదు. 357 సంస్థలు (65 శాతం) స్వంత భవనాలకు సంబంధించి, 148 సంస్థలు(27 శాతం) మేనేజ్మెంట్ ట్రస్టు/ సొసైటీకి చెందిన వివరాల్ని అందించలేదు.
మంత్రి ఆదేశాలు
డాక్యుమెంట్ల పరిశీలనలో బయటపడిన లోపాలు, వాటి పరిణామాలపై మంత్రి సత్యకుమార్ యాదవ్ అధికారులతో కూలంకషంగా చర్చించారు. దీంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా నర్సింగ్ విద్యా సంస్థల్లో అందించబడుతున్న విద్య నాణ్యతపై మంత్రి పలు ప్రశ్నల్ని సంధించి, పర్యవేక్షణా లోపాన్ని ఎత్తి చూపారు. ఆయా నర్సింగ్ విద్యా సంస్థల్లో నియమాల మేరకు అధ్యాపకుల నియామకం, సొంత భవనాల లభ్యత,
ప్రయోగశాలల ఏర్పాటు, క్లినికల్ మెటీరియల్ల లభ్యతపై ప్రత్యేక బృందాల ద్వారా తనిఖీలు జరపాలని మంత్రి ఆదేశించారు.
డిఎంఇ విభాగం గుర్తించిన లోపాలపై ఏప్రిల్ 15లోగా ఆయా నర్సింగ్ విద్యా సంస్థలకు నోటీసులిచ్చి వాటిని రెండు నెలల్లోగా సవరించకుంటే 2025-26 విద్యా సంవత్సరానికి ప్రవేశాల్ని అనుమతించేది లేదంటూ స్పష్టం చేయాలని మంత్రి సత్యకుమార్ యాదవ్ ఆదేశించారు. అదేవిధంగా వివిధ నర్సింగ్ విద్యా సంస్థల్లో భౌతిక పరిశీలనలో వెల్లడయ్యే లోపాల్ని ఈ ఏడాది జూన్ 15లోగా సవరించకపోతే ప్రవేశాల్ని అనుమతించరాదని మంత్రి ఆదేశించారు.
ఈ సమీక్షా సమావేశంలో ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎం.టి.కృష్ణబాబు, కార్యదర్శి డాక్టర్ మంజుల డి.హోష్మణి, డిఎంఇ డాక్టర్ నరసింహం, రాష్ట్ర నర్సింగ్ కౌన్సిల్ కార్యదర్శి మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు.