*ఎన్టీఆర్ జిల్లా, మార్చి 26, 2025*
పారదర్శకంగా వృత్తి పన్ను వసూళ్లు
– *కార్పొరేషన్ పరిధిలో ఏప్రిల్ 1 నుంచి వాణిజ్య పన్నుల శాఖ ద్వారా వృత్తి పన్ను వసూలు*
– *రాష్ట్ర పన్నుల జాయింట్ కమిషనర్ ఎస్.ప్రశాంత్ కుమార్*
వృత్తి పన్ను వసూళ్లను సరళీకృతం చేసి మరింత పారదర్శకంగా నిర్వహించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవడం జరిగిందని విజయవాడ 1, 2 డివిజన్ వాణిజ్య పన్నుల శాఖ జాయింట్ కమిషనర్ ఎస్.ప్రశాంత్ కుమార్ బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు.
వాణిజ్య పన్నుల శాఖ ద్వారా వృత్తి పన్నుదారుల నుంచి పన్నుల వసూలును పారదర్శకంగా నిర్వహించడం జరుగుతుందని, విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో వృత్తి పన్ను వసూలు బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వం వాణిజ్య పన్నుల శాఖకు అప్పగించడం జరిగిందని వెల్లడించారు. మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో వృత్తి పన్ను వసూళ్లను వాణిజ్య పన్నుల శాఖకు అప్పగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీవో ఎంఎస్ నెం.63 జారీచేసిందని, ఇది ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వస్తుందన్నారు.
వివిధ వర్గాలకు చెందిన వేతన జీవులు, వ్యాపారులు, స్వయం ఉపాధి పొందుతున్న వ్యక్తులు వారికి నిర్దేశించిన రేట్ల ప్రకారం వృత్తి పన్ను చెల్లించాల్సి ఉంటుందన్నారు. దుకాణ యజమానులు, రూ. 10 లక్షల కంటే అధిక వార్షిక టర్నోవర్ ఉన్న జీఎస్టీ పన్ను చెల్లింపుదారులు వృత్తి పన్ను చెల్లించాల్సి ఉంటుందన్నారు. వాణిజ్య, వ్యాపార, పారిశ్రామిక సంస్థల్లో పనిచేసే ఉద్యోగులకు నెలకు రూ. 15 వేల కంటే ఎక్కువ జీతం చెల్లిస్తున్న యజమానులు ఉద్యోగుల తరఫున ప్రభుత్వానికి వృత్తి పన్ను చెల్లించాలని ఆయన వివరించారు. 2025, మార్చి పన్ను కాలానికి (2025, ఏప్రిల్లో దాఖలు చేయాల్సిన) నెలవారీ ప్రొఫెషనల్ ట్యాక్స్ రిటర్న్ను https://myprofessiontax.apct.gov.in/ptax/ వెబ్సైట్లో లాగిన్ అయి దాఖలు చేయాలని జాయింట్ కమిషనర్ ప్రశాంత్ కుమార్ తెలిపారు.