*ఎన్టీఆర్ జిల్లా, మే 01, 2025*
పేదల సామాజిక భద్రతకు ఎన్టీఆర్ భరోసా
పటిష్ట పర్యవేక్షణతో సజావుగా పెన్షన్ల పంపిణీ
సీసీఎల్ఏ, జిల్లా ప్రత్యేక అధికారి జి.జయలక్ష్మి
పేదలకు ఎన్టీఆర్ భరోసా ద్వారా సామాజిక భద్రత ఏర్పడుతోందని.. పేదల జీవన ప్రమాణాలను పెంచడంతో పాటు, శూన్య పేదరికం లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికతో పనిచేస్తున్నట్లు రాష్ట్ర భూ పరిపాలన ప్రధాన కమిషనర్ (సీసీఎల్ఏ), ఎన్టీఆర్ జిల్లా ప్రత్యేక అధికారి జి.జయలక్ష్మి అన్నారు.
ఎన్టీఆర్ భరోసా ద్వారా సామాజిక భద్రత పెన్షన్ల పంపిణీలో భాగంగా గురువారం సీసీఎల్ఏ జయలక్ష్మి అధికారులతో కలిసి విజయవాడ తూర్పు నియోజకవర్గం, వార్డు సచివాలయం-82 పరిధిలో పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రభుత్వ ఉద్యోగుల ద్వారా ఇంటింటికి వెళ్లి పెన్షన్లు అందిస్తున్న ప్రక్రియను పరిశీలించారు. కేటగిరీల వారీగా లబ్ధిదారులకు పెన్షన్ మొత్తం సరైనవిధంగా అందుతుందా.. లేదా? అనే విషయాన్ని అడిగి తెలుసుకున్నారు. వార్డు సచివాలయం పరిధిలో 294 పెన్షన్లు ఉండగా.. ఎం.శ్రీను, బి.భూలక్ష్మి (దివ్యాంగ పెన్షన్లు), వై.వెంకటేశ్వరమ్మ, దుర్గా భవాణి (విడో పెన్షన్లు)లకు పెన్షన్లు అందించే ప్రక్రియను పరిశీలించారు. ఈ సందర్భంగా జి.జయలక్ష్మి మాట్లాడుతూ అవకతవకలకు ఆస్కారం లేకుండా అత్యంత పారదర్శకంగా, జవాబుదారీతనంతో ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా పెన్షన్ల మొత్తాన్ని లబ్ధిదారుల ఇళ్ల వద్దే అందిస్తున్నట్లు తెలిపారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో నియోజకవర్గాలు, మండలస్థాయి అధికారుల ప్రత్యక్ష పర్యవేక్షణతో ఎక్కడా ఎలాంటి ఇబ్బంది లేకుండా లబ్ధిదారులకు పెన్షన్లు అందించడం జరుగుతోందని తెలిపారు. సీసీఎల్ఏ వెంట యూసీడీ పీవో పి.వెంకట నారాయణ, సచివాలయ సిబ్బంది ఉన్నారు.
పెద్దాయనా బాగున్నారా.. పెన్షన్ సమాయానికి అందుతోందా?
ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న కలెక్టర్ లక్ష్మీశ
ఎన్టీఆర్ భరోసా ద్వారా సామాజిక భద్రత పెన్షన్ల పంపిణీలో భాగంగా గురువారం జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ అధికారులతో కలిసి విజయవాడ అర్బన్ పరిధిలోని రామలింగేశ్వరనగర్లో పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. పెద్దాయనా బాగున్నారా.. పెన్షన్ సమాయానికి అందుతోందా?, ఆరోగ్యం ఎలా ఉంది? ఎవరైనా మిమ్మల్ని డబ్బులు డిమాండ్ చేస్తున్నారా? అంటూ లబ్ధిదారులను ఆత్మీయంగా పలకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ లక్ష్మీశ మాట్లాడుతూ జిల్లాలో 2,28,388 పెన్షన్లకు రూ. 98.14 కోట్లు మేర పంపిణీ చేయడం జరుగుతోందన్నారు. స్వర్ణాంధ్ర @ 2047 లక్ష్యాలకు అనుగుణంగా సమాజం నుంచి పేదరికాన్ని దూరం చేయడం, నూరు శాతం అక్షరాస్యత, తలసరి ఆదాయాన్ని గణనీయంగా పెంచడం, ప్రతి కుటుంబం నుంచి ఒక పారిశ్రామికవేత్త వచ్చేలా ప్రోత్సహించడం.. ఇలా పూర్తిస్థాయిలో పేదరిక నిర్మూలనకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఇదే సమయంలో ప్రజలు ప్రభుత్వ సంక్షేమ పథకాలు, కార్యక్రమాలను సద్వినియోగం చేసుకుంటూ తమ కుటుంబాలను ఉన్నతంగా తీర్చిదిద్దుకోవాలని కలెక్టర్ లక్ష్మీశ పేర్కొన్నారు.
కార్యక్రమంలో డీఆర్డీఏ పీడీ ఏఎన్వీ నాంచారరావు, యూసీడీ పీవో పి.వెంకట నారాయణ తదితరులు పాల్గొన్నారు.