ఎన్టీఆర్ జిల్లా, మే 02, 2025
శభాష్ టీమ్ ఎన్టీఆర్
సమష్టి కృషితో అమరావతి పునఃప్రారంభం కార్యక్రమం విజయవంతం
మంచి ఫలితాలిచ్చిన మైక్రో లెవెల్ ప్లానింగ్
ప్రతి చిన్న అంశంపైనా ప్రత్యేక దృష్టిపెట్టడంతో మంచి ఫలితాలు
వేసవి నేపథ్యంలో ప్రత్యేక ఏర్పాట్లపై ప్రజల నుంచి ప్రశంస
మండల, జిల్లాస్థాయి నోడల్ అధికారులకు అభినందనలు
కీలక సేవలందించిన కమాండ్ కంట్రోల్ కేంద్రం (సీసీసీ)
సీసీ టీవీ దృశ్యాల ద్వారా నిరంతర పర్యవేక్షణ
జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ
రాష్ట్ర చరిత్రలో కీలక ఘట్టమైన నవ్య రాజధాని అమరావతి పునర్నిర్మాణ పనుల శంకుస్థాపన కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో టీమ్ ఎన్టీఆర్ చేసిన కృషి ప్రశంసనీయమని, కార్యక్రమంలో భాగస్వాములైన ప్రతిఒక్కరికీ అభినందనలు తెలియజేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ తెలిపారు.
జిల్లాతో పాటు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి బస్సుల్లో వచ్చిన వారు ఎక్కడా ఎలాంటి ఇబ్బంది పడకుండా విజయవాడలో ఎక్కడికక్కడ ఏర్పాట్లు చేసిన ట్రాన్సిట్ పాయింట్ల ద్వారా అల్పాహారం, మధ్యాహ్న భోజనం, రాత్రి భోజనం, తాగునీరు వంటి వాటిని ఏర్పాటు చేశారు. అదేవిధంగా వేసవి నేపథ్యంలో ప్రత్యేకంగా తాగునీటి పాయింట్లు, మజ్జిగ పాయింట్లు ఏర్పాటుచేశారు. వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో వైద్య శిబిరాలను ఏర్పాటు చేశారు. అదే విధంగా అధికారులు, సిబ్బంది మధ్య సమన్వయ సాధనకు, ఎక్కడైనా ఏ విషయంలోనైనా ఇబ్బంది తలెత్తితే వెంటనే సరిదిద్దేందుకు కలెక్టరేట్లో ప్రత్యేకంగా కమాండ్ కంట్రోల్ కేంద్రాన్ని (సీసీసీ) ఏర్పాటు చేశారు. రెవెన్యూ, పంచాయతీరాజ్, పోలీస్, ట్రాఫిక్, పురపాలక తదితర శాఖల అధికారులు కమాండ్ కంట్రోల్ కేంద్రంలో ఉండి నిత్యం క్షేత్రస్థాయి అధికారులు, సిబ్బందిని సమన్వయం చేశారు. కలెక్టర్ లక్ష్మీశ సైతం కమాండ్ కంట్రోల్ కేంద్రం నుంచి నిరంతరం పరిస్థితిని సమీక్షించడంతో పాటు క్షేత్రస్థాయిలో సుడిగాలి పర్యటనలు చేశారు.
కలెక్టర్ లక్ష్మీశ శుక్రవారం కలెక్టర్ కార్యాలయంలోని ప్రత్యేక కమాండ్ కంట్రోల్ రూమ్ వద్ద మాట్లాడుతూఎంఐపీ, వీవీఐపీ, వీఐపీ తదితరులకు విజయవాడలో వసతి కల్పించడం, వారికి అవసరమైన సౌకర్యాలు కల్పించడం, విజయవాడకు వచ్చిన బస్సులు ఏయే మార్గాల్లో వెళ్లాల్లో సరైన విధంగా దిశానిర్దేశం చేయడం, విశాఖపట్నం, మన్యం తదితర ప్రాంతాల నుంచి వచ్చిన వారికి భోజనం, తాగునీరు అందించడం వంటివి చేశామన్నారు. ప్రతి బస్సు పార్కింగ్ ఎక్కడ చేయాలనేది కూడా స్పష్టంగా సూచనలు జారీచేశామన్నారు. వెస్టర్న్ బైపాస్, సర్వీసు రోడ్లను కూడా ఉపయోగించుకున్నట్లు తెలిపారు. ఎక్కడా భోజనం, తాగునీటికి కొరత అనే మాట లేకుండా చూశామన్నారు. కార్యక్రమం అనంతరం దూరప్రాంతాలకు తిరిగివెళ్తున్న వారికి రాత్రి భోజనం కూడా అందించినట్లు తెలిపారు. మండల, జిల్లాస్థాయి నోడల్ అధికారులు, ఆర్డీవోలు, ఎంపీడీవోలు, మునిసిపల్ కమిషనర్లు, తహసీల్దార్లు కార్యక్రమంలో కీలక భాగస్వాములై సేవలందించారని.. వారందరికీ అభినందనలు తెలియజేస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రస్థాయి అధికారులు, మంత్రివర్యుల బృందం సహకారంతో పకడ్బందీ ఏర్పాట్లు చేసి ప్రణాళిక ప్రకారం పనిచేసి విజయవంతం చేసినట్లు కలెక్టర్ డా. జి.లక్ష్మీశ తెలిపారు.