ఎన్టిఆర్ జిల్లా* *తేది: 15.05.2025
దోమల నియంత్రణ ద్వారానే డెంగ్యూ నివారణ సాధ్యం.
మురుగు నీటి నిల్వలను ఆరికట్టి దోమలను నివారిద్దాం
ప్రజల భాగస్వామంతోనే డెంగ్యూ నివారణ సాధ్యం
జిల్లా కలెక్టర్ డా. జి లక్ష్మీశ.
దోమల నియంత్రణ ద్వారానే డెంగ్యూ వ్యాధిని ఆరికట్టగలుగుతామని అధికారులు, ప్రజల భాగస్వామ్యంతోనే దోమల నివారణ చర్యలు చేపట్టి ప్రాణాంతక డెంగ్యూ వ్యాధి ప్రబల కుండా ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీశ అన్నారు.
ఈనెల 16 తేదీ జాతీయ డెంగ్యూ దినోత్సవం సందర్భంగా డెంగ్యూ వ్యాధి నివారణకు చేపట్టాల్సిన చర్యలపై జిల్లా వైద్య ఆరోగ్య శాఖ నగర పాలక సంస్థ, గ్రామీణ నీటి సరఫరా, పంచాయతీ అధికారులతో గురువారం జిల్లా కలెక్టర్ లక్ష్మీశ కలెక్టరేట్ నుండి జూమ్ కాన్ఫరెన్స్ నిర్వహించి అనంతరం అవగాహన పోస్టర్ను విడుదల చేశారు.
కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ దోమల నియంత్రణ ద్వారానే డెంగ్యూ వ్యాధిని ఆరికట్టగలుగుతామన్నారు. దోమల నివారణ పట్ల ప్రజలలో అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. డెంగ్యూ వ్యాధి లక్షణాలపై ప్రజలకు అవగాహన కల్పించేలా సంబంధిత అధికారులు విసృత ప్రచారం కల్పించాలన్నారు. డెంగ్యూ మలేరియా వంటి వ్యాధులు దోమల ద్వారా సంక్రమిస్తాయని, డెంగ్యూ వ్యాధి ఈడిస్ ఈజిప్ట్ దోమ కాటు ద్వారా సంక్రమిస్తుందని దోమలు వ్యాప్తిచెందకుండా తగు జాగ్రత్తలు తీసుకోనేలా ప్రజలను చైతన్యవంతులను చేయాలన్నారు. ప్రజారోగ్యానికి ప్రధాన శత్రువైన దోమల ద్వారా మలెరీయా ఫైలేరియా డెంగీ, చికున్ గున్యా, మెదడు వాపు, వంటి వ్యాధులు వ్యాప్తిస్థాయన్నారు. నివాస పరిసరాల ప్రాంతాలలో సాధారణంగా ఆనాఫిలస్, క్యూలెక్స్, ఏడిస్, మాన్సోనియా, ఆర్మిజరిస్ దోమలు వ్యాప్తి చెందుతాయన్నారు. డెంగ్యూ వ్యాధిని వ్యాప్తిచేసే ఆడ దోమ ఉదయం, సాయంత్ర వేళల్లో చెమట పట్టే శరీర భాగాలపై కుట్టి రక్తాన్ని పీల్చుకొని నిల్వ ఉన్న నీటి పై గుడ్లను పెట్టి సంతానోత్పత్తి చేసుకొంటాయన్నారు. ప్రజలు ఉదయం సాయంత్రం వేళల్లో కిటికీలను మూసి ఉంచుకోవడం ద్వారా దోమలు ఇంట్లోకి రాకుండా చూసుకోవాలనన్నారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. నిల్వ ఉన్న నీటిలో మాత్రమే డెంగ్యూ దోమలు సంతానోత్పత్తి చేసేందుకు అవకాశం ఉన్నందున ప్రతి ఒక్కరూ ఇంటిలో, ఆరుబయట నీటి నిల్వలు లేకుండా పొడిగా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా డెంగ్యూ వ్యాధిని అరికట్టేందుకు అవకాశం ఉంటుందని కలెక్టర్ తెలిపారు. అధిక జ్వరం, తలనొప్పి. కంటి వెనుక భాగంలో నొప్పి, కండరాల నొప్పి, చర్మంపై గుండ్రటి మచ్చలు వంటి లక్షణాలు ఉన్న వారికి వెంటనే డెంగ్యూ పరీక్షలు నిర్వహించాలన్నారు. డెంగ్యూ పరీక్షలను ప్రైవేట్ ఆసుపత్రులలో కాకుండా ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో గల ప్రత్యేక ల్యాబ్ ద్వారా పరీక్షలు నిర్వహించేలా చర్యలు తీసుకోవాలన్నారు. నగరంలో కాలువలు కొండల కారణం వలన దోమల బెడద ఎక్కువగా ఉంటుందని నగర పాలక సంస్థ, జలవనరుల శాఖ అధికారుల సమన్వయంతో ఎప్పటికప్పుడు కాలువులను శుభ్రపరచి మురుగు నీటి నిల్వలకు ఆస్కారం లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. యాంటీ లార్వా ఆపరేషన్ ప్రక్రియను ప్రతి సచివాయాలనికి అనుసంధానించాలని అన్నారు. అధికారులు ప్రజలు స్థానిక ప్రజాప్రతినిధులు బాగస్వామ్యంతో నగరాన్ని దోమల రహిత నగరంగా తీర్చిదిద్ధి డెంగ్యూ వ్యాధి వ్యాప్తి చెందకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలన్నారు. జూన్, జూలై మాసాలలో వర్షాలు పడే సమయంలో వర్షపు నీరు నిలవకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. పూల కుండీలు, ఖాళీడబ్బాలు, టైర్లు, ప్లాస్టిక్ సీసాలలో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలన్నారు. దోమల నివారణకు అధికారులు తీసుకుంటున్న చర్యలకు ప్రజల సహకారం అవసరమని జిల్లా కలెక్టర్ లక్ష్మీశ తెలిపారు.
కార్యక్రమంలో జిల్లా మలేరియ అధికారి వి. మోతిబాబు, జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా. యం సుహాసిని, వైద్య ఆరోగ్య శాఖ, నగర పాలక సంస్థ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.