ఎన్టీఆర్ జిల్లా/జగ్గయ్యపేట, మే 19, 2025
ప్రజా సమస్యల పరిష్కారమే విజన్ @ 2047 లక్ష్యాల సాధనలో తొలిమెట్టు
నిబద్ధతతో, నాణ్యతతో అర్జీలను పరిష్కరించాలి
అర్జీల పరిష్కారంలో సంతృప్తి అనేది అత్యంత ప్రధానం
సమస్యకు తప్పక పరిష్కారం లభిస్తుందనే భరోసా అధికారులు కల్పించాలి
అర్జీల పరిష్కారంలో అలసత్వం చూపితే కఠిన చర్యలు తప్పవు
జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ.
రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలుచేస్తున్న ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్) ద్వారా అందిన అర్జీల పరిష్కారంలోనూ.. సంక్షేమం, అభివృద్ధిలోనూ జిల్లాను నెంబర్ 1గా నిలిపేందుకు అధికారులు కృషిచేయాలని, ప్రతి అర్జీని సకాలములో నాణ్యవంతంగా పరిష్కరించాలని.. విజన్ @ 2047 లక్ష్యాల సాధనలో ప్రజా సమస్యల పరిష్కారమే తొలి మెట్టని జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ అన్నారు.
ప్రతి సోమవారం నిర్వహించే జిల్లాస్థాయి ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని సోమవారం జగ్గయ్యపేట బి. కన్వెన్షన్ లో నిర్వహించారు. శాసన సభ్యులు శ్రీరాం రాజగోపాల్ (తాతయ్య)తో కలసి జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ.. నందిగామ డివిజన్ ప్రజల నుండి అర్జీలు స్వీకరించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి సోమవారం విజయవాడలో జిల్లాస్థాయి పీజీఆర్ఎస్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతోందని.. అయితే వేసవి నేపథ్యంలోనూ అదేవిధంగా డివిజన్ స్థాయిలో కూడా ప్రణాళిక ప్రకారం జిల్లాస్థాయి పీజీఆర్ఎస్ కార్యక్రమాలను నిర్వహించాలనే ఉద్దేశంతో సోమవారం జగ్గయ్యపేటలో జిల్లాస్థాయి పీజిఆర్ఎస్ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు తెలిపారు. నిర్దిష్ట గడువులోగా సమస్యను పరిష్కరించడం ఎంత ప్రధానమో అర్జీదారుడు సంతృప్తి చెందేలా సమస్యను పరిష్కరించడం అంతే ప్రధానమని, అర్జీల పరిష్కార సంతృప్తి స్కోర్ ను పెంచేందుకు అధికారులు కృషి చేయాలన్నారు. రెవెన్యూ సమస్యలకు సంబంధించి అధిక అర్జీలు అందుతున్నాయని వీటిపై ప్రత్యేక దృష్టిసారించి పరిష్కరించాలన్నారు. గౌరవ ముఖ్యమంత్రి పీజీఆర్ఎస్ కార్యక్రమంపై ప్రత్యేకంగా దృష్టి సారించారని క్రమం తప్పకుండా ప్రతి అంశంపైనా సమీక్ష నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. తహసీల్దార్లు ఎంపీడీవోలు, సర్వేయర్లు తదితరులు క్షేత్రస్థాయిలో సమన్వయంతో పనిచేసి ప్రజల సమస్యలను పరిష్కరించాలని ఆదేశించారు.
అర్జీల పరిష్కారంలో నిర్లక్ష్యం వహించే అధికారులు సిబ్బందిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
సమస్య పరిష్కార సామర్థ్యం అనేది పాలనపై ప్రజల్లో విశ్వాసం పెంచుతుందని, ప్రతి అర్జీని పారదర్శకత, జవాబుదారీతనంతో పరిష్కరించాలన్నారు.
మొత్తం 461 అర్జీలు
మొత్తం 461 అర్జీలు స్వీకరించగా.. వీటిలో నందిగామ మండలానికి చెందినవి 38, చందర్లపాడు నుంచి 8, వీరుల్లపాడు నుంచి 4, కంచికచర్ల నుంచి 8, పెనుగంచిప్రోలు నుంచి 56, వత్సవాయి నుంచి 44, జగ్గయ్యపేట మండలం నుంచి 222 అర్జీలు రాగా మిగిలినవి ఇతర మండలాల నుంచి వచ్చాయని కలెక్టర్ లక్ష్మీశ వివరించారు. ప్రతి అర్జీని క్షుణ్ణంగా పరిశీలించి వారం రోజుల్లోగా కార్యాచరణ నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించినట్లు కలెక్టర్ తెలిపారు.
కార్యక్రమంలో గ్రామ, వార్డు సచివాలయాల ప్రత్యేక అధికారి జి.జ్యోతి, నందిగామ ఆర్డీవో కె. బాలకృష్ణ, డి.ఆర్.డి.ఎ పీడీ ఏఎన్వీ నాంచారరావు, డీపీవో పి.లావణ్య కుమారి, డీఎస్పీలు ఏబీజీ తిలక్, వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
రెవెన్యూ సమస్యల పరిష్కారంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి: శాసనసభ్యులు శ్రీరాం రాజగోపాల్ (తాతయ్య)
ప్రజల సమస్యలను సావధానంగా విని.. అర్జీలను క్షుణ్ణంగా పరిశీలించి సత్వరం పరిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం పీజీఆర్ఎస్ కార్యక్రమాన్ని నిర్వహిస్తోందని.. నియోజకవర్గ ప్రజలు విజయవాడ వెళ్లనవసరం లేకుండా సోమవారం జగ్గయ్యపేటలో జిల్లాస్థాయి పీజీఆర్ఎస్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం చాలా ఆనందం కలిగిస్తోందని జగ్గయ్యపేట శాసనసభ్యులు శ్రీరాం రాజగోపాల్ (తాతయ్య) అన్నారు.
ప్రజా సమస్యల పరిష్కార వేదికలో పాల్గొన్న అనంతరం శాసనసభ్యులు శ్రీరాం రాజగోపాల్ విలేకరులతో మాట్లాడుతూ వివిధ శాఖల జిల్లాస్థాయి అధికారుల సమక్షంలోనే అర్జీలు స్వీకరించి వాటి తక్షణ పరిష్కారానికి జిల్లా అధికార యంత్రాంగానికి స్పష్టమైన మార్గనిర్దేశం చేయడం జరిగిందన్నారు. పెన్షన్ల మంజూరు, ఇంటి స్థలం మంజూరు, ఉపాధి కల్పన తదితరాలపై ప్రజలు అర్జీలు సమర్పించడం జరిగిందని.. నిర్దిష్ట గడువులోగా అర్జీలను పరిష్కరించడం జరుగుతుందన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం రెవెన్యూ సమస్యల పరిష్కారంపై ప్రత్యేకంగా దృష్టిసారించినట్లు తెలిపారు. అనంతరం శాసనసభ్యులు బీ కన్వెన్షన్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన చెత్త నుంచి సంపద సృష్టి, వర్మీ కంపోస్ట్, ఘన, ద్రవ వ్యర్ధాల నిర్వహణ స్టాళ్లను పరిశీలించి వివరాలు అడిగి తెలుసుకున్నారు.